జగన్ నియంత పాలనతోనే అంగన్వాడీలు మృతి : నారా లోకేశ్
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 8:32 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-01-2024/640-480-20558629-thumbnail-16x9-nara-lokesh-fire-on-cm-jagan.jpg)
Nara Lokesh Fire on Cm Jagan : సీఎం జగన్ నియంత పాలనలో అంగన్వాడీ చెల్లెమ్మల బలి అవుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాజులు, రాజ్యాలు అంతరించి పోయి ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక తొలిసారిగా సుమారు అయిదేళ్ల క్రితం ఏపీ ప్రజలు పొరపాటున జగన్ అనే నయా నియంతకు అధికారమిచ్చారని అన్నారు. జగన్ అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను అవస్థలు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ 40 రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుంటే కనీస స్పందన లేకపోగా, విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలు పీకేస్తామని తన పాలేరు సజ్జలతో బెదిరింపులకు దిగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YSRCP Government Not Responding on Anganwadi Protest : ప్రభుత్వ అనాలోచిత, మొండివైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయని లోకేస్ విచారం వ్యక్తం చేశారు. జగన్ అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారబోతోందని తేల్చి చెప్పారు. ఎంతటి నియంత అయినా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేని జగన్ మరో 3నెలల్లోపే ఇంటికి వెళ్లడం ఖాయని వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరిపోకుండా న్యాయమైన డిమాండ్ల సాధనకు 40రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. టీడీపీ - జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని తాను మాట ఇస్తున్నా అన్నారు.