కడప జిల్లా రాజంపేట మండలంలోని బాదినగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలాశయం ప్రధాన కాలువ దెబ్బతింది. 23 ఏళ్ల క్రితం ప్రధాన కాల్వను నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కాలువకు సరిగ్గా మరమ్మతులు చేయలేదు. ఫలితంగా ప్రధాన కాలువ లైనింగ్ దెబ్బతింది. కాలువ నిర్మాణానికి ఉపయోగించిన బండరాళ్ళు బయటపడ్డాయి. ప్రధాన కాలువ నుంచి విడుదలయ్యే నీటిని 6 చెరువులకు మళ్లిస్తారు. ఈ క్రమంలో కాలువ సక్రమంగా లేకపోవటంతో ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ మరమ్మత్తుల కోసం అన్నమయ్య జలాశయ అధికారులు ఏటా ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో మరమ్మత్తుల అంశం ప్రతిపాదనలకే పరిమితమైంది. సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన కాలువకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ' విశాఖ జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం'