ETV Bharat / state

Students Protest: ఆందోళనలతో అట్టుడికిన ఇడుపులపాయ ట్రిపుల్​ ఐటీ.. అసలేమైంది..?

author img

By

Published : Mar 21, 2022, 7:59 AM IST

Updated : Mar 21, 2022, 6:49 PM IST

Idupulapaya IIIT Students: కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ... విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. వసతుల్లేని పాత క్యాంపస్‌కు వెళ్లేది లేదంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు. నిరసనలను పట్టించుకునేది లేదన్న డైరెక్టర్‌ కసిరెడ్డి సంధ్యారాణి.. పాత క్యాంపస్‌కు వెళ్లడం ఇష్టం లేనివారు ఇళ్లకు వెళ్లిపోవచ్చని తేల్చిచెప్పారు. అలా కాకుండా గొడవ చేస్తామంటే పోలీసుల సాయంతో పంపించివేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థినిపై చేయి చేసుకున్నారు.

students protest
students protest

students protest

ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో PUC-1, PUC-2 విద్యార్థులు ధర్నాకు దిగారు. ట్రిపుల్ ఐటీ అకడమిక్ బ్లాక్-1 వద్ద బైఠాయించి.. న్యాయం కావాలంటూ నినదించారు. కనీస వసతులు కల్పించే వరకు పాత క్యాంపస్‌కు వెళ్లబోమని తేల్చిచెప్పారు. ఉన్నఫళంగా పాత క్యాంపస్‌లోకి వెళ్లాలంటూ శనివారం రాత్రి 9 గంటలకు డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యరాణి చెప్పారని.. అప్పటినుంచి వివాదం చెలరేగిందని విద్యార్థులు తెలిపారు. 3 నెలలుగా కొత్త క్యాంపస్‌లో ఉంటున్నామని.. రాత్రికి రాత్రే లగేజీ, ఇతర సామగ్రిని ట్రాక్టర్లో పడేసి పాత క్యాంపస్‌కు తరలించారని వాపోయారు. విశ్రాంతి గదులు సరిగా లేకపోవడం, తలుపుల్లేని మరుగుదొడ్లు, ఇతర వసతులు లేవని... దీనివల్ల శనివారం రాత్రంతా నిద్ర కూడా లేదని ఆవేదన చెందారు. ఈ విషయం తెలుసుకుని ఆదివారం ఇడుపులపాయ వచ్చిన తల్లిదండ్రులు.. డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యరాణిని నిలదీయడంతో ఆమె దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.

ఆందోళనకు దిగిన విద్యార్థులపై డైరెక్టర్‌ కసిరెడ్డి సంధ్యారాణి ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో ధర్నాలో కూర్చున్న ఓ విద్యార్థిపై చేయి చేసుకున్నారు. ఈ చర్యను విద్యార్థులు తీవ్రంగా నిరసించారు. అందరూ గట్టిగా నినాదాలు చేశారు.

ఆ తర్వాత కూడా వెనక్కి తగ్గని డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యారాణి... ట్రిపుల్ ఐటీకి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులంతా వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని... లేదంటే పోలీసుల సాయంతో బలవంతంగా పపించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

డైరెక్టర్‌ కసిరెడ్డి సంధ్యారాణి హెచ్చరికలకు భయపడని విద్యార్థులు... మరింత గట్టిగా నినాదాలు చేశారు. ఆదివారం చీకటి పడిన తర్వాత కూడా సెల్‌ఫోన్ల లైటింగ్ వెలుగులో ఆందోళన కొనసాగించారు.

పరిస్థితిని అర్థం చేసుకోకుండా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని... ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి చెప్పుకొచ్చారు.

విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ఆర్జీయూకేటీ ఛాన్స్‌లర్ కె.చెంచురెడ్డి... సమస్యలు శాశ్వతం కాదన్నారు. త్వరలోనే మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.

Last Updated :Mar 21, 2022, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.