ETV Bharat / state

కష్టాల వరద...కట్టుబట్టలతో నడిరోడ్డున పడ్డ బాధితులు

author img

By

Published : Nov 21, 2021, 7:44 AM IST

కష్టాల వరద.
కష్టాల వరద.

వర్షాలు అంతులేని శోకాన్ని మిగిల్చాయి. ఏ ఊరికెళ్లినా బరువెక్కిన హృదయాలతో బాధితులు ఆక్రోశిస్తున్నారు. కట్టుబట్టలతో వారు నడిరోడ్డున పడ్డారు. కళ్లేదుటే ఇళ్లల్లోని వస్తువులు, సామగ్రి కొట్టుకుపోవడంతో తీవ్ర మనోవ్యథకు గురయ్యారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో వరద ప్రభావిత పల్లెల్లో అంధకారం అలుముకుంది. ముందస్తుగా అప్రమత్తం చేసి ఉంటే అపార నష్టం కొంతవరకు తప్పేదని చెబుతున్నారు. ఇప్పటికైనా సాయం చేయాలని విన్నవిస్తున్నారు.

కడప జిల్లాలో జల ప్రళయం కోలుకోలేని గాయం చేసింది. సుండుపల్లి మండలం పింఛ, రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద ఉన్న అన్నమయ్య జలాశయం మట్టి కట్టలు శుక్రవారం తెగిపోవడంతో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. చెయ్యేరు నదికి పక్కనే ఉన్న పులపుత్తూరు, పులపుత్తూరు ఎస్సీ కాలనీ, కోనరాజుపల్లె, దిగువ, ఎగువ మందపల్లి, శేషమాంబపురం, తోగూరుపేట, గండ్లూరు, చొప్పావారిపల్లె గ్రామాలు ఎక్కువగా నష్టపోయాయి. పాటూరు, ఇసుకపల్లి, నీలిపల్లి, నాగిరెడ్డిపల్లె, నందలూరు, కుమ్మరపల్లి, గొల్లపల్లి, తురకపల్లిలోనూ వర్షపు నీరు ముంచేసింది. ఉదయం 6.30-8.30 గంటల్లోపు వరద బీభత్సం సృష్టించింది. రెండు గంటల్లోనే ఎక్కడికక్కడే ఇళ్లు కూలిపోయాయి. బాహుదా నది పరివాహక గ్రామాల్లోని ప్రతి ఇంట్లోకి 8-10 అడుగుల మేర నీరు చేరింది. వరద వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు ముందస్తు సమాచారమివ్వలేదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నష్టం జరిగినా ఎవరూ పలకరించలేదని పేర్కొన్నారు.

ప్రాణాలతో బయటపడ్డాం

ఉప్పెన వచ్చి నిండా ముంచేసింది. ప్రాణాలతో బయటపడ్డాం. రూ.30 లక్షలతో నిర్మించుకున్న ఇల్లు పూర్తిగా కుంగిపోయింది. ఒక్క వస్తువు మిగలలేదు.

- తిరుమలశెట్టి వెంకటసుబ్బమ్మ, ఎగువ మందపల్లి

ఇలాంటి ఉపద్రవం చూడలేదు

ఇంటిపై నుంచి నీటి ప్రవాహం సవ్వడికి భయపడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశాం. నాకిప్పుడు 64 ఏళ్లు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఉపద్రవం చూడలేదు.

-ఎల్లటూరు సుబ్బరాజు, దిగువ మందపల్లి

బిడ్డ పెళ్లికి తెచ్చిన నగలు వరదార్పణం

మా కుమార్తె పెళ్లికి ఇటీవల రూ.10 లక్షలతో నగలు కొనుగోలు చేశాం. ఈ నెల 20న నిశ్చితార్థం. డిసెంబరు 10న పెళ్లి చేసేందుకు నిర్ణయించాం. వరదలో నగలన్నీ కొట్టుకుపోయాయి.

- మర్రి సరోజ, ఎగువ మందపల్లి

ఒకే కుటుంబంలో 9 మంది గల్లంతు

మా ఉమ్మడి కుటుంబంలో 9 మంది గల్లంతయ్యారు. పిల్లలు, పెద్దలు అందరూ కొట్టుకుపోయారు. మొత్తం 11 మందిలో ఇద్దరు బతికి బయటపడ్డారు. మిగతావారి జాడ లేదు. కార్తిక పౌర్ణమి వేళ పూజలు చేయాలని శివాలయానికి వెళ్లారు. ముంపు నుంచి బయటపడటానికి మండపంలోకి వెళ్లారు. కల్యాణ మండపం కూలిపోవడంతో తొమ్మిది మంది జల ఉద్ధృతితో బయటపడలేకపోయారు. ఈ ఘటనను తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది. దేవుడు మాకెందుకీ శిక్ష వేశాడో అర్థం కావడం లేదు.

- కొర్రపాటి సరస్వతి, ఎగువ మందపల్లి

కాడెద్దులు కోల్పోయా..

వరదనీరు ఇంట్లోకి 10 అడుగుల మేర నీరు చేరింది. రెండు ఎద్దులు ప్రాణాలు కోల్పోయాయి. మరో రెండు జాడ లేదు. మృతి చెందిన ఎడ్లను చూస్తే నోట మాట రావడం లేదు. నోట్లోకి ముద్ద పోలేదు.

- వరదరాజు సుబ్బరామరాజు, దిగువ మందపల్లి

ఇదీ చదవండి: మరింత విషమంగా కైకాల ఆరోగ్య పరిస్థితి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.