ETV Bharat / state

నిండా ముంచేసిన అకాల వర్షాలు.. ఆదుకోవాలంటున్న రైతులు

author img

By

Published : Mar 21, 2023, 8:14 PM IST

Heavy rains damage crops: అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టించి అప్పులు చేసి పంటను పండిస్తే.. పంట చేతికొస్తుందనే సమయంలో అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి. అయితే రైతులు నష్టపోయిన పంటను పరిశీలించిన అధికారులు.. ప్రభుత్వం నుంచి పరిహారం అందేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

crops loss
crops loss

Farmers lost their crops due to Rains: ఆరుగాలం కష్టించి పంటలు పండించే అన్నదాతను అకాల వర్షాలు నిలువునా ముంచేశాయి. అప్పులు చేసి పంటను పండిస్తే.. చేతికందాల్సిన సమయంలో పంట కళ్ల ముందే నేలకొరిగింది. దీంతో బాధిత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారు. ముఖ్యంగా వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అకాల వర్షం కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయి.

పెండ్లిమర్రి వీరపునాయిని పల్లె మండలాల్లోని నష్టపోయిన పంట పొలాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పరిశీలించారు. అరటి, చీని, నువ్వులు, దోసకాయ పంటలను పరిశీలించిన ఆయన లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికందే సమయంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అదే విధంగా వైయస్సార్ జిల్లా వీఎన్ పల్లి మండలం, పెండ్లిమర్రి, వేంపల్లి మండలాలల్లో ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం వేలాది హెక్టార్లలో పంటలకు అపార నష్టం మిగిల్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహా మండలి ఛైర్మన్ ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి, యువ నాయకుడు నరేన్ రామాంజుల రెడ్డిలతో కలిసి కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి.. నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.

వెంటనే పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వేలాది హెక్టార్లలో పంట నష్టం మిగిల్చిందన్నారు. రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి దీనిపై నివేదిక తయారు చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వీటిని తీసుకుని వెళ్తామని అన్నారు. దీంతోపాటు నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు తగిన చర్యలను తీసుకుంటామని ఆయన అన్నారు. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమని, వెంటనే రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలంలో అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. మరో 20 రోజుల్లో చేతికి అందాల్సిన పంట ఎందుకూ పనికి రాకుండా పోయిందని రైతన్నలు వాపోతున్నారు. వారు నష్టపోయిన పంటకు పరిహారం అందించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.