ETV Bharat / state

వైఎస్సార్​ జిల్లాలో రెండో రోజు సీఎం పర్యటన.. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు

author img

By

Published : Dec 24, 2022, 8:04 AM IST

CM TOUR: ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజైన ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌ ఆయన తండ్రి సమాధి వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

Jagan
జగన్‌

CM TOUR: సొంత జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌.. శుక్రవారం కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ దివ్యాంగ బాలుడిని చూసిన సీఎం.. తన వాహనాన్ని ఆపి అతడితోపాటు తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలుడి దీనగాథ చూసి.. స్పందించిన ఆయన.. తక్షణం లక్ష రూపాయల సహాయం అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బాలుడికి వైద్యం కోసం కావాల్సిన సహాయం అందజేస్తానని.. ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చని భరోసా ఇచ్చారు.ఖాజీపేట మండలం భూమయ్యపల్లెకు చెందిన ఓబులేసు దంపతుల కుమారుడు పుట్టుకతోనే నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రిని కలిసేందుకు తల్లిదండ్రులు బాలుడిని కడపకు తీసుకొచ్చారు. వారితో మాట్లాడిన సీఎం జగన్‌.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్

రెండో రోజు పర్యటనలో...

వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజైన ఇవాళ.. ముఖ్యమంత్రి జగన్‌.. ఆయన తండ్రి సమాధి వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు వైఎస్సార్‌ గెస్ట్‌ హౌస్‌ నుంచి బయల్దేరి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకోనున్న ఆయన.. 9 గంటల 10 నిమిషాలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 10 గంటలకు ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. 12 గంటల 40 నిమిషాలకు పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. ఒంటి గంట 10 నిమిషాలకు విజయ హోమ్స్‌ జంక్షన్‌ను సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. ఒకటిన్నర గంటలకు.. కదిరి రోడ్డు జంక్షన్‌, కూరగాయల మార్కెట్‌, మైత్రి లే అవుట్‌, రాయలపురం వంతెనను ప్రారంభిస్తారు. 3 గంటలకు వైఎస్సార్‌ బస్టాండ్‌ను ప్రారంభించి.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. 3 గంటల 35 నిమిషాలకు అహోబిలపురం పాఠశాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు ఇడుపులపాయ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.