ETV Bharat / state

ఆ రోడ్లపై అప్పుడు ప్రయాణానికి గంట సమయం.. ఇప్పుడు నాలుగు గంటలు..!

author img

By

Published : Dec 14, 2020, 3:30 PM IST

పశ్చిమగోదావరిజిల్లాలో రహదారులు.. అధ్వాన్నంగా మారాయి. అడుగడుగున గోతులమయమైన రహదారులపై ప్రజల ప్రయాణం దుర్భరమవుతోంది. రెండు, మూడు అడుగల మేర గోతులు.. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. జిల్లాలో జాతీయ రహదారుల మినహా.. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రహదారులతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

roads damaged at west godavari district
పశ్చిమగోదావరిజిల్లాలో రహదారులు

అన్ని రంగాల్లో అభివృద్ది దశలో ఉన్న పశ్చిమగోదావరిజిల్లాలో రహదారుల పరిస్థితి మాత్రం.. దయనీయంగా మారింది. పశ్చిమ గోదావరిజిల్లాలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రహదారులలో ప్రజలు ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. ఆరు నెలలో రహదారి ప్రమాదాల్లో 46మంది మరణించగా... 178మంది గాయపడ్డారు. జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలు దేశంలోనే ముందువరుసలో నిలుస్తాయి. రికార్డు స్థాయిలో పండే ధాన్యం, విదేశాలకు రొయ్యలు... ఇతర రాష్ట్రాలకు చేపలు ఎగుమతి ఈ రహదారులపైనే సాగాలి. వాహన రాకపోకలకు ఈ దారి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న రహదారులు

ఇదో నరకం

ఏలూరు నుంచి నరసాపురం వెళ్లే 110కిలోమీటర్ల రహదారి.. ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తోంది. ఏలూరు నుంచి కైకలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, పాలకొల్లు మీదుగా నరసాపురం వెళ్లే దారంతా గోతులే. ఏలూరు నుంచి భీమవరం 65కిలోమీటర్ల ప్రయాణం నాలుగు గంటల అవుతోందని వాహనచోదకులు అంటున్నారు. గతంలో గంటన్నరలో వెళ్లేవారమమని ప్రస్తుతం ఈ రహదారిలో వాహనం నడపడమే ఇబ్బందికరంగా మారిందని చోదకులు అంటున్నారు. పాలకొల్లు, భీమవరం నుంచి గుడివాడకు ఈ రోడ్డునుంచే వెళ్లాలి. భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల్లో ఆక్వా రొయ్యల రవాణా ఇబ్బందికరంగా మారింది. బస్సు సర్వీసుల పరిస్థితి చెప్పనవసరమే లేదు.

గోతుల్లో నీరు

ఏలూరు నుంచి చింతలపూడి 50కిలోటమీటర్ల రహదారి పూర్తిగా పాడైంది. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, పాలకొల్లు నుంచి తణుకు, అత్తిలి, తాడేపల్లిగూడెం,భీమవరం-నారాయణపురం రహదారులు దెబ్బతిన్నాయి. దారుల్లో ప్రయాణం నరకప్రాయమైంది. జిల్లాలో ప్రధాన పట్టణాలను కలుపుతూ 100కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. సుమారు 2,135 కిలోమీటర్ల మేర రహదారులు జిల్లాలో ఉంటే.. వీటిలో 75శాతం పాడయ్యాయి. వర్షాలకు గోతుల్లో నీరు నిలుస్తోంది.

ఇప్పుడైనా కనికరించండి..

రోడ్లకు కేవలం చిన్నచిన్న మరమ్మతులు చేసి.. వదిలేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో ఒండ్రు మట్టి వల్ల.. రహదారులు తొందరగా దెబ్బతింటున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రహదారులు నిర్మించకపోవడం, నాణ్యత ప్రమాణాలు పాటించపోవడం వల్లే ఇలా అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రహదారులు మరమ్మతులు చేసి.. ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి. పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.