ETV Bharat / state

ఆదాయ మార్గాల వ్యూహాత్మక అన్వేషణ - ఆలయాలపై శారదా పీఠం కన్ను

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2024, 10:11 AM IST

Visakha Sharada Peetham : ఆధ్యాత్మిక, ధార్మిక సేవలందించాల్సిన విశాఖ శారదా పీఠం శాశ్వత ఆదాయ మార్గాలకు ఉవ్విళ్లూరుతోంది. నిత్యం ఆదాయం తీసుకొచ్చే దారులను అన్వేషిస్తోంది. భవిష్యత్తులో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ‘వ్యూహాత్మకంగా’అడుగులు వేస్తుంది. సేవ ముసుగులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందాలని చూస్తోంది.

sarada_peetham
sarada_peetham

Visakha Sharada Peetham : స్వరూపానందేంద్ర సరస్వతి విశాఖ శారదా పీఠానికి స్వయం ప్రకటిత పీఠాధిపతి. ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన రాజగురువుగా చెబుతుంటారు. అధికార పార్టీలోని ముఖ్యనేతలు, ప్రభుత్వ పెద్దలతో ఈ పీఠానికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదే అదునుగా విశాఖ శారదా పీఠం శాశ్వత ఆదాయ మార్గాల కోసం పరితపిస్తోంది. ఇప్పటికే భీమిలిలో వందల కోట్ల విలువ చేసే 15 ఎకరాలను కారుచౌకగా దక్కించుకుంది. వేద విద్య కోసం గతంలో కేటాయించిన ఆ భూములకు సంబంధించి ఆదాయ సముపార్జనకు వీలుగా ఉత్తర్వులు మార్చాలని ముఖ్యమంత్రికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆధ్యాత్మిక, ధార్మిక సేవలందించే సంస్థకు ఆదాయమార్గాలతో పనేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. విశాఖలోని ప్రముఖ ఆలయాలపైనా శారదా పీఠం కన్నుపడింది. పూర్తిగా ఆధీనంలోకి తీసుకునేలా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎక్కువ ఆదాయం వచ్చే ఓ ఆలయాన్ని దక్కించుకునేందుకు అక్కడి కమిటీతోనే వ్యూహాత్మకంగా దేవాదాయశాఖకు లేఖ రాయించింది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Endowment Lands: దేవుడి భూములనూ వదల్లేదు.. సొంత ఆస్తిలా రాసిచ్చేస్తున్నారు!

వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూడేళ్ల కిందటే శారదా పీఠానికి అప్పగించాలని కొందరు ఒత్తిళ్లు తీసుకురాగా అప్పట్లో కుదరలేదు. ఇందుకోసం ఆలయ కమిటీలో విభేదాలు సృష్టించి రెండుగా విడిపోయేలా చేశారని ప్రచారం సాగుతోంది. ఆలయాన్ని పీఠానికి అప్పగించడాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తుండగా, నిర్వహణ సరిగా లేదంటూ అనుకూలవర్గంతో పీఠానికి లేఖ రాయించారు. కొద్ది రోజుల తర్వాత అప్పటి వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి దేవాదాయశాఖకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి సహాయ కమిషనర్‌ ఆలయానికి ఈవోను నియమించి స్థిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకోగా నాటి నుంచి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయం కొనసాగుతోంది. ఇక చినవాల్తేరు, మధురవాడలోని ఆలయాలపైనా పెద్దలు కన్నేయగా నిర్వాహకులు స్వామీజీని ప్రసన్నం చేసుకుంటే ఒకలా లేకుంటే మరోలా వ్యవహరిస్తున్నారు.

Tension at Temple Land Auction: దేవాలయ భూముల వేలంలో ఉద్రిక్తత.. ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం

విశాఖనగరం కప్పరాడలోని వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయం దేవాదాయశాఖ ఆధీనంలో ఉంది. ప్రస్తుతం మూడు కిలోల బంగారు ఆభరణాలు, వంద కిలోల వెండి, బ్యాంకుల్లో కోటి వరకు స్థిర డిపాజిట్లూ ఉన్నాయి. ఏటా కోటికి పైగా హుండీ ఆదాయం వస్తుంది. అంతటి ప్రాధాన్యం గల ఈ ఆలయాన్ని పీఠానికి అప్పగించేలా పావులు కదుపుతున్నారు. ఇటీవల ఆలయ కమిటీ దేవాదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాయగా, ఉన్నతాధికారులు ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. కానీ, భక్తులు ఆలయాన్ని దేవాదాయశాఖ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరుతున్నారు. కొద్ది రోజుల కిందట నిరసన తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల్లో కొందరికి వైసీపీ నేతలతో సంబంధాలు ఉండగా వారికి ఇష్టం లేకపోయినా పెద్దల ఒత్తిడితో లేఖ పంపినట్లు సమాచారం.

కందుకూరి వీరేశలింగం.. హితకారిణి సమాజం భూములపైన సర్కారు కన్ను!

ఆదాయ మార్గాల వ్యూహాత్మక అన్వేషణ - ఆలయాలపై శారదా పీఠం కన్ను
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.