ETV Bharat / state

tdp: ఉత్తరాంధ్ర రక్షణకు ఉద్యమం

author img

By

Published : Aug 31, 2021, 7:08 AM IST

వైకాపా ప్రభుత్వ పాలన రెండేళ్లు దాటినా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు పైసా ఖర్చు చేయలేదని, ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని తెదేపా నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చేసిందనే అంశాలపై త్వరలో బస్సు యాత్ర చేపట్టి ప్రజలకు వివరించాలని, ఆయా పనులను పరిశీలించాలని నిర్ణయించారు.

ఉత్తరాంధ్ర రక్షణకు ఉద్యమం
ఉత్తరాంధ్ర రక్షణకు ఉద్యమం

వైకాపా ప్రభుత్వ పాలన రెండేళ్లు దాటినా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు పైసా ఖర్చు చేయలేదని, ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని తెదేపా నేతలు మండిపడ్డారు. జిల్లాల్లో జనం సమస్యలేంటి? పెండింగులో ఉన్న పనులేంటి? ప్రభుత్వం ఏం చేసిందనే అంశాలపై త్వరలో బస్సు యాత్ర చేపట్టి ప్రజలకు వివరించాలని, ఆయా పనులను పరిశీలించాలని నిర్ణయించారు.

‘ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చాం. ఇకపై ప్రతి అంశం మీద పోరాడేలా ప్రజలను చైతన్య పరుస్తాం’ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర రక్షణ- చర్చావేదిక’ పేరిట సోమవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెదేపా హయాంలో తారకరామ, జంఝావతి, పెద్దగెడ్డ, వంశధార, నాగావళి వంటి ఎన్నో ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేశామన్నారు. నదుల అనుసంధానానికి పూనుకుని శ్రీకాకుళంలో వంశధార- నాగావళిని కలిపే పనులు చేపట్టామని తెలిపారు. వంశధారను బాహుదా నదికి అనుసంధానం చేయడానికి రూ.5 వేల కోట్లతో టెండర్లు పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చి ఏ పనీ చేయలేదని విమర్శించారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు తెదేపా హయాంలో టెండర్లు పిలిస్తే... వైకాపా ప్రభుత్వం వాటిని రద్దు చేసి రివర్స్‌ టెండర్‌ పిలిచినా ప్రారంభించలేదని చెప్పారు. ‘10 శాతం పనులు చేస్తే వంశధార, 5 శాతం చేస్తే తోటపల్లి పరిధిలో పెండింగు పనులు పూర్తవుతాయి. ఏమీ చేయకుండా ఇక్కడి ప్రాజెక్టులను విస్మరించారు. తెదేపా హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లి మేం పనులు మంజూరు చేయించుకునేవాళ్లం. ప్రస్తుత ఉత్తరాంధ్ర మంత్రులు ఎవరైనా ముఖ్యమంత్రి జగన్‌ వద్దకు వెళ్లి ప్రజల సమస్యలపై మాట్లాడగలరా? వీరంతా పేరుకే మంత్రులు. సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి హోదా కలిగినవారు పాల్గొన్నా మరొకరు వచ్చి సమీక్షిస్తుంటే ఆ మంత్రి పదవి ఎందుకు? వివిధ కేసుల్లో ఏ2గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిని విశాఖకు ఎందుకు పంపారు? అశోక్‌గజపతిరాజుపై విమర్శలు చేయడానికా? విశాఖ-భీమిలి మధ్య స్థలాలు ఆయన బంధుగణం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది’ అని ఆరోపించారు.

పైడితల్లిని మొదటిసారి కోరా

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ.. ‘బెయిల్‌ మీదొచ్చి సీఎం కావడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. సింహాచలం దేవస్థానంలో 860 ఎకరాలు మాయం అయ్యాయట. ఎక్కడ తప్పు జరిగిందో సర్వే నంబర్లతో సహా చెప్పండి. అది చెబితే గుట్టు బయటపడుతుందని భయపడుతున్నారు. భోగాపురం విమానాశ్రయానికి తెదేపా భూ సేకరణ చేస్తే... వైకాపా ప్రభుత్వం వచ్చి 500 ఎకరాలను తగ్గించింది. వాటితో వ్యాపారం చేస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన మరచిపోయారు. నేనెప్పుడూ పైడితల్లి అమ్మవారిని ఏమీ కోరలేదు. ఈ ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించాలని జీవితంలో మొదటిసారి మొక్కుకున్నా. ఆ రోజు వస్తుందని ప్రజలతో పాటే ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. వైకాపా మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఈ రెండున్నరేళ్లలో ఏం చేశారో చెప్పగలిగితే ఇక రాజకీయాలు మాట్లాడనని సవాలు విసిరారు. మాజీ మంత్రులు చినరాజప్ప, కళా వెంకటరావు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఎక్కడా ఉపాధి అవకాశాలు లభించడం లేదు. పెట్రో కాంప్లెక్స్‌, పారిశ్రామికవాడల్లో ఎటువంటి కదలిక లేదు. పైడిభీమవరంలో బీర్ల పరిశ్రమ మూతపడింది. మరో మూడు పరిశ్రమలదీ అదే పరిస్థితి. బెయిల్‌ రద్దవకూడదు... జైలుకు వెళ్లకూడదనే దానిపైనే శ్రద్ధ పెట్టారు’ అని విమర్శించారు. చర్చావేదికను సమన్వయం చేసిన పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ‘మూడు జిల్లాల ప్రజలు ఏం కోరుకున్నారు. వైకాపా ప్రభుత్వం ఏం చేసింది? మెజారిటీ సీట్లు ఇచ్చిన ఈ ప్రాంతాలకు ఏం చేశారన్నది జనం ప్రశ్నించుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు, మాజీ జడ్పీ ఛైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడి తప్పింది : వర్ల రామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.