ETV Bharat / state

ధాన్యం రైతులకు ఎందుకీ దైన్యం.. పంట నూర్చి నెలలు గడిచిన కొనుగోలుకు నోచుకోక

author img

By

Published : Feb 11, 2023, 8:54 AM IST

Etv Bharat
Etv Bharat

Grain Farmers : ఆరుగాలం కష్టపడి రైతు పండించిన ధాన్యం..! సంక్రాంతికి ముందే కొనుగోలు చేసి డబ్బు చెల్లిస్తే.. కష్టమంతా మరిచి కుటుంబమంతా సంతోషంగా పండుగ జరుపుకోవాల్సిన సందర్భం..! అదే ఆశతో అన్నదాత పండుగకు ముందే నూర్పిళ్లు చేసి ధాన్యాన్ని సంచుల్లో నింపి.. ధాన్యాన్ని అమ్మకాలకు సిద్ధంగా ఉంచాడు. పంట కొనుగోలు చేస్తామని ఆశలు రేపిన ప్రభుత్వం అటువైపు చూడలేదు. సంక్రాంతి పండుగెళ్లి నెల కావస్తున్నా ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. సిరులొలికించాల్సిన ధాన్యం కోనుగోలు కాకపోవడంతో ఉత్తరాంధ్ర రైతన్న దిగాలు చెందుతున్నాడు.

ఉత్తరాంధ్రలో ఖరీఫ్‌ ధాన్యాన్ని అమ్ముకోలేక అన్నదాత అవస్థలు

Grain Farmers Faceing Problems : రైతన్నకు పంట పండించడం కంటే.. దానిని అమ్ముకోవడం పెను సమస్యగా మారింది. పండించే ప్రతి పంటకు ప్రజల్లో డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతున్నా.. వినియోగదారుడికి చేరవేయడంలో అన్నదాత వెనుకబడిపోతున్నాడు. గత ప్రభుత్వాలు రైతు నుంచి పంటను కొనుగోలు చేయడానికి మార్గాలు సుగమం చేసే ప్రయత్నాలు చేయగా.. వైఎస్సార్​సీపీ సర్కారు నిబంధనలతో ప్రతిబంధకాలు పెడుతోందని రైతులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పొలాల వద్దకే వచ్చి పంట కొనుగోలు చేస్తామని చెప్పినా.. ఈ - క్రాపింగ్‌, ఆన్‌లైన్‌ నమోదు అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నియమాలు రైతులకు ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఈ ప్రక్రియల్లో ఎదురవుతున్న సమస్యలు రైతు పాలిట శాపంగా మారుతున్నాయి. బహిరంగ మార్కెట్లలో పంట అమ్ముకోవడానికీ వీలు లేకుండా చేస్తున్నారంటూ రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. తమ నిస్సహాయతను దళారులు సొమ్ముచేసుకోవడానికి చూస్తున్నారని వాపోతున్నారు.

సంక్రాంతికి ముందే కొనాల్సిన ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో.. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం ఢంగభద్ర రైతులు ఆందోళనకు దిగారు. ఒక్క జియ్యమ్మవలస మండలంలోనే సుమారు 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. ఢంగభద్ర గ్రామంలో సుమారు 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాల్లోనే మూలుగుతోంది. అకాల వర్షం పడితే పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన పంట అమ్ముడుకాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన రైతులు.. శుక్రవారం నాడు ఆందోళన చేపట్టారు. రైతుభరోసా కేంద్రానికి వెళ్లి.. వ్యవసాయ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

"ఎక్కడి ధాన్యం అక్కడే కల్లాలలో ఉంది. ఈ క్రాప్​ ద్వారా పంట కొనుగోలు లేదు. దళారులు క్వింటాలుకు 1300 రూపాయల చొప్పున అమ్మమని అడుగుతున్నారు. అధికారులు 42 కిలోలు ఒక బస్తాకు నింపాలని సూచిస్తున్నారు. మిల్లర్లు 44 కేజీలు ఉండాలని అంటున్నారు. మొన్న వచ్చిన వర్షానికి ధాన్యం తడిసింది. రైతు భరోసా కేంద్రంలో అడిగితే మేమేం చేయాలి అంటున్నారు." -రైతు

ఖరీఫ్‌ పంటను ఊడ్చి రెండు నెలలవుతున్నా.. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అనకాపల్లి జిల్లా రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. కల్లాల్లోని పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పినా.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. బరకాలు వేసుకుని ధాన్యం మూటల్ని పొలంలోనే ఉంచేశారు. బస్తాలపై ఎలుకలు దాడి చేసి పాడుచేస్తున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ధాన్యం రంగు మారిన పరవాలేదు. చెత్త ఉన్న పర్లేదు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మిల్లర్ల దగ్గరికి ధాన్యం తీసుకువెళ్తే అవి బాగాలేవు. మేము తీసుకోము అని అంటున్నారు. మేము పండించింది తినడానికి పనికివచ్చే ధాన్యమే. ఇంకా వేరే ఏమి పండించలేదు. పంట నూర్చి సంచులలో నింపి ఉంచాము. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కు అవుతున్నారో తెలియదు. మా దగ్గరికి అధికారులు ధాన్యం కొనుగోలు కోసం రావటం లేదు. మేము తీసుకెళ్తే తీసుకోవటం లేదు." -రైతు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.