ETV Bharat / state

Kidney Racket: విశాఖ కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో మరో ట్విస్ట్..!

author img

By

Published : Apr 29, 2023, 3:45 PM IST

Updated : Apr 29, 2023, 4:59 PM IST

Kidney Racket: విశాఖలో కిడ్నీ రాకెట్ ముఠాపై.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీసీపీ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కేజీహెచ్​లో ఉన్న బాధితుడు వినయ్​కుమార్​ను కుటుంబ సభ్యులు బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో వైద్యం సరిగా అందట్లేదని ఆరోపిస్తున్నారు. పరీక్షల పేరుతో రకారకాలు టెస్టులు చేస్తున్నారని అతని బంధువులు పేర్కొన్నారు. ఇదిలావుండగా.. కిడ్నీ మార్పిడి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తిరుమల ఆసుపత్రి యజమాని డాక్టర్ పరమేశ్వరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Kidney Racket Updates
Kidney Racket Updates

Kidney Racket Updates : విశాఖపట్నంలో కిడ్నీరాకెట్ వ్యవహారంపై బాధితుడు వినయ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు తీగలాగితే డొంక కదులుతోంది. విశాఖలో కిడ్నీ రాకెట్ ముఠా వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీసీపీ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న.. ముఠా సభ్యులు కనకరాజు, శ్రీను, ఇలియానాను ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. కిడ్నీ మార్పిడి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తిరుమల ఆసుపత్రి యజమాని డాక్టర్ పరమేశ్వరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడ్ని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రిని సీజ్​ చేసి తనిఖీలు చేపట్టారు. మరోవైపు.. అనుమతి లేకుండా చికిత్స చేసిన శ్రీకాంత్ కోసం.. ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశారు. కాకినాడలో ఉన్నారన్న సమాచారంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి గాలిస్తున్నాయి.

ఇంటికి తీసుకువెళ్లిన బంధువులు: విశాఖ కేజీహెచ్‌ నుంచి బాధితుడు వినయ్‌కుమార్‌ను అతని బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. కిడ్నీ రాకెట్‌ బాధితుడు వినయ్‌ను నిన్న పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. వైద్యం సరిగా అందట్లేదని వినయ్‌కుమార్‌ బంధువులు ఆరోపిస్తున్నారు. పరీక్షల పేరుతో రకారకాలు టెస్టులు చేస్తున్నారని అతని బంధువులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వైద్యులతో వాదించి ఆస్పత్రి నుంచి వినయ్‌ను అతని బంధువులు తీసుకెళ్లారు.

కేజీహెచ్‌ నుంచి వినయ్‌కుమార్‌ను తీసుకెళ్లిన బంధువులు

యూరాలజీ విభాగం: పోలీసుల సూచన మేరకు కుటుంబసభ్యులు వినయ్‌కుమార్​ను నిన్న యూరాలజీ విభాగంలో చేర్చారు. వైద్యులు అతని కిడ్నీ తీశారా లేదా అనే నిర్ధరణ కోసం యూరాలజీ విభాగాంలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేజీహెచ్‌ వైద్యులు వినయ్‌కుమార్‌కు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, ఫలితాలు రాకముందే వినయ్‌కుమార్​ను అతని బంధువులు ఆసుపత్రి నుంచి తీసుకెళ్లారు.

స్పందించిన సూపరింటెండెంట్‌: విశాఖ కేజీహెచ్‌లో వినయ్​కుమార్​కు వైద్యం సరిగా అందడం లేదంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో, వైద్యులు స్పందించారు. వినయ్​కుమార్ ఇప్పటివరకు సీటీ స్కాన్‌, అల్ట్రా సౌండ్‌ పరీక్షలు చేసినట్లు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. కొన్ని రక్త పరీక్షలు చేశామని, ఫలితాలు రావాల్సి ఉందని కేజీహెచ్‌ వైద్యులు తెలిపారు. ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలోనే వినయ్‌ను బంధువులు తీసుకెళ్లారని సూపరింటెండెంట్‌ వెల్లడించారు. వినయ్‌కుమార్​ను కుటుంబసభ్యులు తీసుకెళ్లిన విషయాన్ని పోలీసులకు తెలిపినట్లు సూపరింటెండెంట్‌ అశోక్‌కుమార్‌ వెల్లడించారు.

విజయ్​కుమార్ ఇంటికి చేరుకున్న పోలీసులు: ఆసుపత్రి సూపర్డెంట్ మాత్రం అనధికారికంగా డిశ్చార్జ్ లేకుండా వినయ్ పరారయ్యారని ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపామన్నారు. అతనికి రక్షణగా ఉన్న నలుగురు పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. బాధితుని ఇంటి వద్ద కు పోలీసు బృందం వెళ్లి తిరిగి తీసుకొచ్చేందుకు యత్నాలు ప్రారంభించింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 29, 2023, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.