ETV Bharat / state

YSR Zero Interest: 'ఎమ్మెల్యే వచ్చేవరకూ.. బయటకు పంపించేది లేదు'

author img

By

Published : Apr 29, 2022, 7:40 AM IST

YSR Zero Interest
మహిళలతో కిక్కిరిసిపోయిన కళ్యాణ మండపం

YSR Zero Interest: ఆ మహిళలు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంతసేపటికి ప్రారంభం కావడంలేదు. అందరూ రావడంతో ఆ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. విసుగు చెందిన మహిళలు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా కొందరు అధికారులు, వైకాపా నేతలు వారిని అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించగా.. వారు చెప్పిన సమాధానం విని ఆ మహిళలు విస్తుపోయారు. ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చేవరకూ బయటకు వెళ్లేది లేదంటూ చెప్పారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

YSR Zero Interest: వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మహిళలు.. ఎమ్మెల్యే వచ్చేవరకూ బయటకు వెళ్లేది లేదంటూ అధికారులు అడ్డుకోవడంపై ఆవేదన చెందారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని కె.కె.కల్యాణ మండపంలో గురువారం మెప్మా మహిళలకు సున్నా వడ్డీ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సభ్యులందరూ వస్తేనే చెక్కులు ఇస్తామని అధికారులు మెలికపెట్టడంతో 699 సంఘాలకు చెందిన సభ్యులు ఉదయం 10 గంటలకే హాజరయ్యారు. అప్పటికే మండపం కిక్కిరిసిపోవడంతో కొందరు భోజనశాలలో, మెట్లపై కూర్చున్నారు. ఉక్కపోతను తట్టుకోలేక ఇబ్బందిపడ్డారు. స్థలం లేక కొందరు వెళ్లిపోవడాన్ని గుర్తించిన అధికారులు, వైకాపా నేతలు వెంటనే కల్యాణ మండపం గేటుకు తాళాలు వేయించారు.

ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉన్నారని, పనులు ఉన్నాయని, పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉన్నారని చెప్పినా వినిపించుకోలేదు. అప్పటికప్పుడు ఆరుబయట షామియానాలు, కుర్చీలు వేయించారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు సమాచారం ఇవ్వగా ఆయన మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. అత్యవసరమున్న మహిళలు ఇళ్లకు వెళ్లేందుకు మరోసారి యత్నించగా ఎమ్మెల్యే పీఏ దయాకర్‌, వైకాపా కార్యకర్తలు గేటు వద్దకు వచ్చి వారిని వారించారు. ఎమ్మెల్యే ఇప్పుడే వచ్చారని, అప్పుడే వెళ్లిపోతే ఎలా అని ఆర్పీలు ప్రశ్నించగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు వారిని బయటకు పంపించారు.

ఇదీ చదవండి: రేషన్​ పంపిణీపై ప్రతిపక్షనేతగా విమర్శలు... సీఎంగా కోతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.