ETV Bharat / state

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు... వ్యర్థ నిల్వలకు ఆవాసాలు

author img

By

Published : Aug 27, 2020, 6:31 PM IST

గ్రామాల్లో సేకరించే చెత్తను సంపదగా మార్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరేళ్ళ క్రితం బృహత్తర ఆశయంతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటివరకు కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేయడం మినహా కార్యాచరణకు నోచుకోలేదు

No use of  Wealth centers from garbage
చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం

శ్రీకాకుళం జిల్లాలో 1101 గ్రామ పంచాయతీలు ఉండగా.. అన్నింటా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మించాలని 2014లో పూనుకున్నారు. 2018 వరకు వీటి నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రూ. 38.44 కోట్లతో 902 చెత్త సంపద కేంద్రాలు నిర్మించేందుకు ప్రతిపాదించారు. అయితే నిర్మాణాల్లో జాప్యం, నిధుల మంజూరులో తాత్సారం తదితర కారణాలతో రూ .18 కోట్లతో 659 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మించారు.

ప్రతి గ్రామపంచాయతీలో చెత్త సేకరణకు గ్రీన్ అంబాసిడర్ లను నియమించారు. ఇంత హడావుడి జరిగినా.. చెత్త సంపద కేంద్రాలు వినియోగం మాత్రం అడుగు కూడా ముందుకు పడలేదు. కాలక్రమేణా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు వ్యర్థాల నిల్వకు ఆవాసాలుగా మారాయి. మరోవంక చెత్త సేకరణకు నియమించిన గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు చెల్లింపు లేక వారి సేవలు కూడా నిలిచిపోయాయి.

తాజాగా కేంద్ర ప్రభుత్వం 'మన పంచాయతీ ..మన పరిశుభ్రత' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రతి మండలం నుంచి రెండు మూడు పంచాయతీలు ఎంపిక చేసి చెత్త సంపద కేంద్రాలు వినియోగంలోకి తీసుకొస్తామని చెత్త సంపద కేంద్రాల జిల్లా సమన్వయ అధికారి నిశ్చల తెలిపారు. ఇకనైనా ఈ కేంద్రాల వినియోగం లోకి వస్తాయేమో చూడాలి.

ఇదీ చదవండి: 'సీనియారిటీ జాబితా ఖరారు చేయండి.. పదోన్నతులు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.