ETV Bharat / state

బి.ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఈరోజు మరోసారి పోస్ట్​మార్టం

author img

By

Published : May 5, 2022, 9:55 PM IST

Updated : May 6, 2022, 10:28 AM IST

young woman Suspicious death
బి.ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

21:53 May 05

ప్రేమించిన వ్యక్తి హత్య చేశాడని యువతి తల్లిదండ్రుల ఆరోపణ

బి.ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన బీ. ఫార్మసీ విద్యార్థిని తేజస్విని వ్యవసాయ క్షేత్రంలో అనుమానాస్పదంగా మృతిచెందడం కలకలం రేపింది. పొలంలోని ఓ షెడ్డులో ఉరి వేసుకుని చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రేమించిన వ్యక్తే నమ్మించి తమ కూతురిని హత్య చేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

తిరుపతిలో బీ.ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్న యువతి తేజస్విని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలోని ఓ వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రియుడుగా చెబుతున్న సాదిక్​కు సంబంధించిన వ్యవసాయ షెడ్డులో ఉరి వేసుకొని చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఆమె మరణవార్త వెలుగుచూసింది. యువతి తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పేరుతో నమ్మించి తమ బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. మాయమాటలతో తిరుపతి కాలేజీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తన సొంత వ్యవసాయ పొలంలోని షెడ్డుకు పిలిపించి.. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాచారం తెలుసుకున్న గోరంట్ల పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగల కొట్టి మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం.. గోరంట్ల పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

యువతి మృతిపై తెలుగుదేశం స్పందించింది. సీఎం జగన్ చేతకాని పాలనలో.. మహిళలపై ప్రతిరోజు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆరోపించింది. బీఫార్మసీ విద్యార్థినిని హత్యాచారం చేసి.. ఆత్మహ‌త్యగా చిత్రీక‌రించ‌డం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మృత‌దేహాంతో పోలీస్‌స్టేష‌న్ ఎదుట ధ‌ర్నాకి దిగితేగానీ పోలీసులు స్పందించ‌క‌పోవ‌డం ఘోరమని మండిపడ్డారు. బంగారు భ‌విష్యత్తు ఉన్న అమ్మాయి అఘాయిత్యానికి బ‌లైతే, బాధిత‌కుటుంబానికి న్యాయం జ‌రిగేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని తాము కోర‌డం యాగీ చేయ‌డం కాదని ముఖ్యమంత్రికి చంద్రబాబు చురకలంటించారు. ఆడ‌బిడ్డని కోల్పోయిన త‌ల్లి న్యాయం చేయాల‌ని పోలీస్‌స్టేష‌న్ ఎదుట వేడుకుంటున్నా.. కనికరించట్లేదని నారా లోకేశ్​ దుయ్యబట్టారు. వైకాపా మూడేళ్ల పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరగని రోజు లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవటం వల్లే రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. హత్యాచారం చేసిన నిందితుల్ని శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

మరోసారి శవపరీక్ష: తేజస్విని మృతదేహానికి పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రీ-పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ తెలిపారు. తేజస్విని గురువారం ఉరి వేసుకుని మృతి చెందింది. అయితే విద్యార్థిని మృతి పట్ల కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయటంతో... రీ-పోస్టుమార్టం చేయిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు. మొదట చేసిన పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తేజస్విని ప్రియుడు సాదిక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. రీ-పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి: వ్యక్తి మర్మాంగాలు కోసేసిన కేసులో.. నిందితుల అరెస్టు

Last Updated : May 6, 2022, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.