ETV Bharat / state

'వెలిగొండ ప్రాజెక్ట్ పెండింగ్ బిల్లులన్నీ వెంటనే చెల్లిస్తాం'

author img

By

Published : Sep 3, 2021, 8:41 PM IST

వెలిగొండ ప్రాజెక్ట్ పెండింగ్ బిల్లులన్నీ వెంటనే చెల్లిస్తామని ఆర్​ అండ్ ఆర్ కమిషనర్ హరిజవహర్ లాల్​ తెలిపారు. పునరావాస ప్యాకేజీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,300 కోట్ల నిధులు కేటాయించిందని కమిషనర్ చెప్పారు.

వెలిగొండ ప్రాజెక్ట్
వెలిగొండ ప్రాజెక్ట్

వెలిగొండ ప్రాజెక్ట్ పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే చెల్లిస్తామని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ హరిజవహర్ లాల్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు తీరుపై సంబంధిత అధికారులతో ఒంగోలు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం జరిగింది. జిల్లాకు వచ్చిన ఆయన ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,300 కోట్ల నిధులు కేటాయించిందని కమిషనర్ చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజికి చెందిన బిల్లులు రెండు రోజుల్లో సీఎఫ్​ఎమ్​ఎస్​ పే అండ్ అకౌట్స్​కు పంపాలన్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజి కింద పెండింగ్​లో ఉన్న రూ. 47 కోట్లు, భూసేకరణకు సంబంధించిన మరో రూ. 40 కోట్ల బిల్లులు తక్షణమే చెల్లిస్తామన్నారు.

పునరావాస పనులు వేగంగా చేపట్టడానికి జిల్లా కలెక్టర్, జేసీలు సమగ్ర ప్రణాళిక రూపొందించడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా ఆర్ అండ్ ఆర్ కాలనీలలో ప్రాథమిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పన వేగంగా చేపట్టాలన్నారు. ప్రస్తుతం మూడు పునరావాస కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించగా, మరో ఐదు కాలనీలలో పనులు వివిధ దశల్లో ఉండడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వెలిగొండప్రాజెక్ట్ ముంపు బాధితులలో మిగిలిన 1,371 మందికి ఇళ్ల స్థల పట్టాలు ఈ నెలాఖరులోగా పంపిణీ చేయడానికి అధికారులు చొరవ తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రాజెక్ట్ స్టేజ్-1 కింద 540 ఎకరాలు భూసేకరణ చేసి నవంబరు నాటికి ప్రాజెక్ట్ అధికారులకు అప్పగించాలన్నారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిళ్లకుండా.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇదీ చదవండి: Fake Challans: ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నకిలీ చలానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.