ETV Bharat / state

ACCIDENT: 'ప్రకాశం జిల్లాలో పెళ్లింట విషాదం.. నలుగురి దుర్మరణం'

author img

By

Published : Aug 25, 2021, 8:15 AM IST

Updated : Aug 26, 2021, 5:21 AM IST

accident prakasam
accident prakasam

08:13 August 25

వధువును వివాహానికి తీసుకెళ్తుండగా ప్రమాదం

కంటతడి పెట్టించిన చిన్నారి బుజ్జగింపు..

రాత్రంతా ఆ ఇల్లు బంధుమిత్రులతో కళకళలాడింది. తెల్లవారే అంతా పెళ్లి వేడుకకు ముస్తాబయ్యారు. సమయం లేదాయె! కొద్ది గంటల్లోనే ముహూర్తం.. వధువును తీసుకొని ఓ వాహనంలో పిల్లలు, పెద్దలు అంతా కలిసి బయలుదేరారు. మరో గంటలో వరుడి ఇంటికి చేరుకుంటారనగా విధి వెంటాడింది. తమను క్షేమంగా తీసుకెళ్లాల్సిన వాహనమే పంజా విసిరింది. ఇద్దరు పెద్దలు, మరో ఇద్దరు పిల్లల ఆయువు తీసింది. ఎంతో సంతోషం నడుమ శుభకార్యం జరగాల్సిన సమయంలో గుండెకోత మిగిల్చింది.   

కొనకనమిట్ల మండలంలోని గార్లదిన్నె వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మండలం తోకపల్లి పంచాయతీ సోమేపల్లి నుంచి బయలుదేరిన పెళ్లి బృందంలో నలుగురు మృత్యువాత పడటంతో విషాదం అలముకుంది. కనకం కోటేశ్వరరావు, రమణమ్మ దంపతుల కుమార్తెకు పొదిలి మండలం అక్కచెరువుకు చెందిన యువకుడితో ఉదయం 11 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండటంతో గొబ్బూరుకు చెందిన మినీ ట్రాలీని మాట్లాడుకున్నారు. పెళ్లి కుమార్తెతో పాటు బంధువులు మరో ఇరవై మంది ఇందులో ఎక్కారు. డ్రైవర్‌ ఆంజనేయులు దీనిని నడుపుతున్నాడు. తెల్లవారుజామున దాదాపు 5.30 గంటలకే బయలుదేరిన వీరంతా 38 కిలోమీటర్లు ప్రయాణించి గార్లదిన్నె వద్దకు చేరుకునేసరికి 6.30 గంటలైంది. మరో గంటలో అక్కచెరువుకు వెళ్లాల్సి ఉండగా ఆటో వెనుక డోరుపై కూర్చొన్న అయిదుగురు గొలుసు తెగి తలుపు ఊడి కిందకు పడిపోయారు. అప్పటికే 80 కి.మీ. వేగంతో వెళ్తుండటంతో ఆ అదుటుకు వారంతా రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు స్వల్పంగా గాయపడగా మిగిలిన నలుగురు చనిపోవడంతో అంతా విషాదంలో మునిగిపోయారు.

బావ బావమరుదులిద్దరూ కలిసే..
ప్రమాదంలో మృతిచెందిన కొంగని శ్రీనివాసులు, బోగోలు సుబ్బారావు బావబావమరుదులు. వీరు పెద్ద దోర్నాలలో ఉంటారు. వారిద్దరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి తొలుత సోమేపల్లి వెళ్లారు. అక్కడి నుంచి బంధువులతో కలిసి పెళ్లికి బయలుదేరారు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. సుబ్బారావు వెలిగొండ సొరంగాల్లో కార్మికుడు. ఆయనకు తల్లి పిచ్చమ్మ, భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది. ఇప్పుడు తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. శ్రీనివాసులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భార్య పార్వతి కూలి పనికి, కుమారుడు రాజేష్‌ వెలిగొండలో పనులకు వెళ్తున్నారు. వైద్యశాలకు ఇతనిని తీసుకువెళ్దామనుకునే సమయంలో బంధువుల ఇంట వివాహం ఉండటంతో అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. ఇంతలోనే మృత్యు ఒడికి చేరాడని భార్య పార్వతి రోదిస్తున్నారు. తన భర్త, తమ్ముడు ఒకేసారి అందని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు.

కన్నీటి మధ్యే మాంగళ్య ధారణ
బంధువుల మధ్య ఆనందోత్సాహంతో పెళ్లి జరగాల్సిన జంట...చివరకు కన్నీటి నడుమ ఒకటి కావాల్సి వచ్చింది. అక్కచెరువులో ఉదయం పదకొండు గంటలకు జరగాల్సిన వివాహం ప్రమాద ఘటనతో ఆగిపోయింది. వరుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పుట్టెడు దుఃఖంలో ఆసుపత్రి వద్ద విలపిస్తున్న వధువును బంధువులు ఓదార్చారు. సాయంత్రం ఓ ఆలయంలో వివాహం జరిపించారు. 

అయ్యో.. బిడ్డలూ
సోమేపల్లికి చెందిన కనకం చిన్న సుబ్బారావు, అరుణ దంపతులకు కుమారుడు కార్తీక్‌(13), కుమార్తె ఉన్నారు.  కార్తీక్‌ ఏడో తరగతి చదువుతున్నాడు. ఘటనలో అతడు చనిపోవడంతో ఆ తల్లి విలవిల్లాడింది. తన బిడ్డకు ఏం కాలేదని, బతికే ఉన్నాడంటూ బేలచూపులు చూస్తూ ఆమె అంటుంటే అంతా కన్నీరుపెట్టుకున్నారు. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కనకం బోడెయ్య, సుబ్బమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్దవాడైన అనిల్‌(11) ఆరోతరగతి చదువుతున్నాడు. ప్రమాదంలో చనిపోవడంతో ‘ఇక నా కొడుకు రాడమ్మా’ అంటూ సుబ్బమ్మ రోదించారు.

మృతదేహాల  అప్పగింత
నలుగురి మృతదేహాలకు మార్కాపురం జిల్లా వైద్యశాలలో శవపరీక్షలు నిర్వహించారు. పోలీసుల సమక్షంలో బుధవారం మధ్యాహ్నం ఆసుపత్రి అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. వారంతా విలపిస్తూ స్వగ్రామాలకు బయలుదేరారు.

కంటతడి పెట్టించిన చిన్నారి బుజ్జగింపు.. 

మృతి చెందిన వారిని అదే వాహనంలో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వారితో పాటు వధువు కూడా వైద్యశాల వద్దకు చేరుకుంది. తన వివాహం కోసం ప్రయాణిస్తుండగా దుర్ఘటన చోటు చేసుకోవడంతో.. ఓ పక్కన కూర్చొని వధువు రోధించింది. ఆ సమయంలో ఆమె బాబాయ్ కుమారుడు అక్కడికి చేరుకొని ఆమెను ఓదార్చాడు. ఏడవకక్కా అంటూ వధువును బుజ్జగించేందుకు బాలుడు చేసిన ప్రయత్నం అక్కడున్నవారిని కలచి వేసింది.

ఇదీ చదవండి: Jagan bail cancel petition: 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్​పై తీర్పు నేడే

Last Updated : Aug 26, 2021, 5:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.