ETV Bharat / state

ఏడాదిన్నరగా 'సాగు'తున్న సాగునీటి ప్రాజెక్టులు!

author img

By

Published : Oct 30, 2020, 6:01 AM IST

Updated : Oct 30, 2020, 6:27 AM IST

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంతంత మాత్రంగానే ఉంది. అనేక మేజర్‌ ప్రాజెక్టుల్లో ఏడాదిన్నరగ కాలంగా పనులు సాగడంలేదు. కొన్ని ప్రాజెక్టుల్లో నామమాత్రంగా కాంక్రీటు, మట్టి తవ్వకం పనులు చేస్తున్నారు. పెండింగ్ బిల్లులు వందల కోట్ల రూపాయలు పేరుకుపోయాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ నిలిపివేస్తూ మెమో ఇచ్చారు. ఆ తర్వాత 25 శాతం లోపు పనులు చేసిన ప్రాజెక్టుల పనులన్నీ నిలిపివేయాలని, పునస్సమీక్షించిన తర్వాత అవసరాన్ని బట్టి పనులు చేపడతామని పేర్కొన్నారు.

Irrigation  projects
Irrigation projects

ఏడాదిన్నరగా 'సాగు'తున్న సాగునీటి ప్రాజెక్టులు!

రాష్ట్రంలో సాగునటీ ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిన్నరగా పనులు నామమాత్రంగానే ఉన్నాయి. కాంక్రీటు, మట్టి తవ్వకం పనుల్లో వేగంలేదు. పాత ప్రభుత్వ హయాం నుంచి పెండింగులో ఉన్న బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. దీంతో గుత్తేదారులు పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఏ ప్రాజెక్టు ముందు చేపట్టాలి, ఏది తర్వాత చేపట్టాలి, ఏది అవసరం, ఏదనవసరం అని తేల్చేసరికి 2019 డిసెంబర్ వచ్చింది. గుత్తేదారులను పనుల వైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తుండగా కరోనా వైరస్ వ్యాప్తితో ప్రాజెక్టుల్లో పనులు అక్కడే ఆగిపోయాయి. మరో వైపు కేవలం ఆరు ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని లెక్కగట్టారు. ఆయా ప్రాజెక్టుల ప్రారంభించే తేదీలు సైతం ప్రకటించారు.

వెలిగొండ మొదటి టన్నెల్‌

లక్ష్యం : 2020 సంవత్సరాంతం

డిసెంబరు నెలాఖరుకు టన్నెల్ పనులతో పాటు నీటి విడుదలకు అనువుగా కాలువలు, డ్యామ్​లకు సంబంధించిన పెండింగు పనులు పూర్తి చేయాలి. అంటే రూ.200 కోట్లకు పైగా విలువైన పనులు చేయాల్సిఉంది. డిసెంబరు నెలాఖరులోగా పనులు చేయగలరా అనేది సందేహమే. టన్నెల్ హెడ్​రెగ్యులేటర్​లోనూ సీఎంసీడీ పనులు చేయాలి. 2500 ఎకరాల భూసేకరణ పెండింగులో ఉంది. మొత్తం టన్నెల్​ పనులు దాదాపు 18 కిలోమీటర్లకు పైగా పూర్తయ్యాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు జరిగిన పనులను పరిగణనలోకి తీసుకుంటే మరో 400 మీటర్ల టన్నెల్​ తవ్వాలి.

వంశధార -2 రెండో దశ

లక్ష్యం : 2021 మార్చి

మరో 15 శాతం పనులు పూర్తిచేయాలి. 3 ప్యాకేజీలుగా ఈ పనులు సాగుతున్నాయి. అన్ని ప్యాకేజీల్లో కలిపి 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి తవ్వకం పనులు మిగిలిఉన్నాయి. 87వ ప్యాకేజీలో పనులు పూర్తికి ఇంకా 60 ఎకరాలకు పైగా భూసేకరణ పెండింగ్​లో ఉంది. 60 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని అయిదు నెలల్లో పూర్తి చేయగలరా అనేదే కీలకం. ప్రస్తుత వేగంతో పనులు జరిగితే లక్ష్యాన్ని చేరలేమని కొందరు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఇవన్నీ పూర్తి చేయడానికి మరో రూ.250 కోట్లు విలువైన పనులు చేయాల్సి ఉంది.

అవుకు టన్నెల్‌-2

లక్ష్యం : 2021 మార్చి

అవుకు టన్నెల్​లో ఆగస్టులో దాదాపు 20 మీటర్ల భాగం ఆకస్మాత్తుగా కూలిపోయింది. దీనిపై నిపుణుల కమిటీ కొన్ని సూచనలిచ్చింది. వాటిని పరిశీలించిన తర్వాతే ఈ పని ముందుకు సాగే అవకాశం ఉంది. కుడివైపు ట్యూబు తవ్వకం, లైనింగు పనులు చాలా వరకూ చేయాల్సి ఉంది. 160 మీటర్ల తవ్వకం పనులకు గాను 100 మీటర్లకు పైగా పెండింగులో ఉంది.

నెల్లూరు బ్యారేజి

లక్ష్యం : 2020 నవంబరు నెలాఖరు

కొన్ని పనులు కొత్త గుత్తేదారుకు అప్పజెప్పేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. ఇంకా కాంక్రీటు పనులు దాదాపు 700 క్యూబిక్ మీటర్లు వరకు చేయాలి. పీసీసీ బ్లాకులు, పియర్ హాయిస్ట్ కాలమ్ పనులు చేయాల్సి ఉంది. మెకానికల్ పనులూ చాలా వరకూ పెండింగులో ఉన్నాయి. గేట్లు ఎత్తేందుకు సంబంధించిన పనులు పెండింగులో ఉన్నాయి. గడువులోగా ఈ పనులన్నీ పూర్తి చేసే పద్ధతి లేదు.

సంగం బ్యారేజి

లక్ష్యం : నవంబరు నెలాఖరు

మట్టి తవ్వకం, కాంక్రీటు పనులు కూడా మందగమనంలోనే ఉన్నాయి. ఇంకా సుమారు 5000 క్యూబిక్ మీటర్లు కాంక్రీటు పోయాల్సి ఉఁది. బ్యారేజిలో మెకానికల్ పనులు పెద్ద ఎత్తున పెండింగులో ఉన్నాయి. 85 సర్వీసు గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా మూడొంతులుకూడా పూర్తి కాలేదు. స్టాప్ లాగ్ గేట్ల ఏర్పాటు పనులూ మందకొడిగానే సాగుతున్నాయి. గేట్లు ఎత్తేందుకు, దించేందుకు పూర్తి చేయాల్సిన మెకానికల్ పనులు పరిస్థితీ ఇంతే .

వంశధార-నాగావళి అనుసంధానం

లక్ష్యం : డిసెంబర్‌ చివరిలోగా

వంశధార నాగావళి అనుసంధాన పనులు రెండేళ్లలో సుమారు 70శాతం పూర్తయ్యాయి. మిగిలిన 30శాతం పనులను మరో 2 నెలల్లో ఎంతవరకు చేయగలరనేది చర్చనీయాంశమవుతోంది. కాంక్రీటు పని 45వేల క్యూబిక్ మీటర్లకు మించి పెండింగులో ఉంది. గడువు లోపు పూర్తి చేయాలనుకున్నదానికి తగ్గట్టుగా ప్రస్తుతం కాంక్రీటు పనుల వేగం లేదు. మట్టి పని కూడా 4.50 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు చేయాల్సి ఉంది. కట్టడాలి పనులు సగమే పూర్తయ్యాయి.

ఇదీ చదవండి : మందు బాబులకు శుభవార్త.. మద్యం ధరలు తగ్గించిన సర్కారు

Last Updated : Oct 30, 2020, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.