ETV Bharat / state

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన

author img

By

Published : Jul 12, 2021, 10:00 PM IST

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది.

Congress protests on rate hike
ధరలపై కాంగ్రెస్ నిరసనలు

సామాన్యులపై పెను భారం మోపుతున్న అధిక ధరలకు నిరసనగా.. ప్రకాశం జిల్లా చీరాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ముక్కోణం పార్కు కూడలిలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి చేపట్టిన ర్యాలీ.. ప్రధాన వీధుల మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంటి గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చీరాల నియోజకవర్గ ఇన్​ఛార్జీ అలీం పేర్కొన్నారు. అసలే కరోనా కష్టాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల నెత్తిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయన్నారు. పెంచిన ఆస్తి పన్నులు, ధరలను వెంటనే తగ్గించకుంటే.. ఆందోళనలు ఉద్దృతం చేస్తామని హెచ్చరించారు.

చిల‌క‌లూరిపేటలో...

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు నిర‌సిస్తూ.. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో వినూత్న పద్ధతిలో ధర్నా చేశారు. నియోజకవర్గ ఇన్​ఛార్జీ శ్రీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపటిన నిరసనలో సైకిల్, రిక్షా ర్యాలీ నిర్వ‌హించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిలకా విజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలగ్జాండర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

గుంటూరులో..

ఇంధన ధరలు నియంత్రించాలని కోరుతూ.. గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నేతలు సైకిల్ ర్యాలీ చేపట్టారు. అయితే స్థానిక పార్టీ జిల్లా కార్యాలయం నుంచి చేపట్టిన సైకిల్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నాయుకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు.

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం..

గుంటూరులో నిరసన చేపట్టిన పార్టీ శ్రేణుల అరెస్టు పట్ల ఏపీపీసీసీ అధ్యక్షులు శైలజనాధ్ మండిపడ్డారు. తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వాళ్లను అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.

పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని శాంతియుతంగా సైకిల్ ర్యాలీ చేపడితే పోలీసులు అడ్డుకోవడం హేయమైన చర్య అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షడు మస్తాన్ వలీ మండిపడ్డారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చేపట్టిన సైకిల్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల వస్తున్నాడని వందల మంది యువతతో బైక్ ర్యాలీ నిర్వహిస్తే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. తక్షణమే పెంచిన ఇంధన ధరలను నియత్రించాలని డిమాండ్ చేశారు.

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు అలుపెరుగని పోరాటం చేస్తుంటే వారిని హోం మంత్రి పట్టించుకోవడం లేదని.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే మహిళలు అని కూడా చూడకుండా అరెస్టులు చేయడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. ప్రభుత్వాల నిరంకుశ విధానాలతో ప్రజలు నష్టపోతున్నారన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

Anganwadi: 'నూతన విద్యా విధానం పేరుతో అంగన్‌వాడీ వ్యవస్థ నిర్వీర్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.