ETV Bharat / state

జిల్లాల విభజన సహేతుకంగా లేదు : వైకాపా ఎమ్మెల్యే ఆనం

author img

By

Published : Feb 19, 2022, 3:51 PM IST

Updated : Feb 20, 2022, 3:25 AM IST

MLA Ramanarayana Reddy: జిల్లాల విభజనపై నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన కొన్నిచోట్ల సహేతుకంగా లేదన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలోని 3 మండలాలను.. బాలాజీ జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ANAM RAMNARAYANA REDDY ON DISTIRCT BIFURCATION
ANAM RAMNARAYANA REDDY ON DISTIRCT BIFURCATION

MLA Ramanarayana Reddy: జిల్లాల విభజనపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాల విభజన కొన్నిచోట్ల సహేతుకంగా లేదన్నారు. వెంకటగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను బాలాజీ జిల్లాలో కలపడం సరికాదని వ్యాఖ్యానించారు.

గతంలో నియోజకవర్గ కేంద్రంగా రాపూరు ఉందని ఆనం రాంనారాయణరెడ్డి గుర్తు చేశారు. రాపూరును వెంకటగిరిలో విలీనం చేసి నష్టపరిచారని.. ఇప్పుడు నెల్లూరు కాకుండా బాలాజీ జిల్లాలో కలుపుతున్నారని వ్యాఖ్యానించారు. తాము చేసిన తీర్మానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ను కలిశానని చెప్పారు. వెంకటగిరి ఏ జిల్లాలో ఉండాలని పుర, గ్రామీణ ప్రతినిధులతో మాట్లాడానని.. మరో 2 మండలాల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు.

గురజాలను జిల్లా కేంద్రంగా మార్చాలని..

కొత్తగా ఏర్పాటయ్యే పల్నాడు జిల్లాకు గురజాలను జిల్లా కేంద్రంగా మార్చాలంటూ పల్నాడు సాధన సమితి ఆధ్వర్యంలో పిడుగురాళ్లలో మహా ర్యాలీ నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఐలాండ్ సెంటర్ మీదుగా సాగిన ర్యాలీ ఎమ్మార్వో కార్యాలయం వరకు సాగింది. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గురజాలను జిల్లా కేంద్రంగా మార్చాలంటూ యరపతినేని డిమాండ్ చేశారు. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలను జిల్లా కేంద్రాలుగా మారుస్తామన్న ప్రభుత్వం.. హిందూపురం, రాజంపేటలను జిల్లా కేంద్రాలుగా చేయని విషయాన్ని యరపతినేని గుర్తు చేశారు. పల్నాడుకు నరసరావుపేట కాకుండా గురజాలను జిల్లా కేంద్రంగా చేయాలని యరపతినేని డిమాండ్ చేశారు. ఇది భిక్ష కాదని.. పల్నాడు ప్రజల హక్కు అని యరపతినేని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.

వేగంగా ప్రణాళికలు..
Districts: మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా అధికారులు ప్రణాళికను రూపొందించారు. అదేరోజు నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు పనిచేయనున్నారు. పాత జిల్లాలకు కూడా వీరే ఇన్‌ఛార్జి కలెక్టర్లుగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రకటించిన కొత్త జిల్లాలకు ఉద్యోగులు, అధికారులను కేటాయించడం, మౌలిక వసతుల కల్పన, ఇతర చర్యలు పూర్తయ్యేంత వరకూ వీరే పాత జిల్లాల బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ పాత జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చినా విభజన, మౌలిక వసతుల కల్పన తదితర వ్యవహారాలను వీరే పర్యవేక్షిస్తారని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

  • కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్లు, సవరణ ఉత్తర్వులపై జిల్లాల కలెక్టర్లు ప్రజల నుంచి సలహాలు, సూచనలను వచ్చే నెల 3వ తేదీ వరకు స్వీకరిస్తారు. వీటిని ఈ నెల 16 నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో తయారయ్యే సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి.
  • జిల్లాల నుంచి వచ్చే నివేదికలను సీసీఎల్‌ఏ, ప్రణాళిక శాఖాధికారులు మార్చి 10వ తేదీ వరకు పరిశీలిస్తారు. మరుసటిరోజు నివేదిక రూపంలో వివరాలను సచివాలయంలోని బిజినెస్‌ నిబంధనలు రూపొందించే వారి పరిశీలనకు పంపిస్తారు.
  • మార్చి 15 నుంచి 17 మధ్య తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.
  • దీనికి అనుగుణంగా మార్చి 18న జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తారు.
  • ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

అభ్యంతరాలపై..
కొత్తగా ప్రకటించిన జిల్లా, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలపై వస్తున్న అభ్యంతరాలు, సూచనలపై రాజకీయ కోణంలోనే నిర్ణయాలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ‘జిల్లాల్లో అందచేసే అభ్యంతరాలు స్వీకరించి, అభిప్రాయాలతో పంపండి. మాట్లాడాల్సి వస్తే..సంయమనం పాటించండి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని జిల్లా అధికారులకు సూచనలు వెళ్లాయి. మరోవైపు వచ్చే మంత్రివర్గ సమావేశంలోనూ మంత్రులు వీటి గురించి ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అలాగే శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సీఎం నేరుగా తెలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జిల్లా కలెక్టరేట్‌లో..
జిల్లా కలెక్టరేట్‌లో ప్రస్తుతం వివిధ హోదాల్లో 165 మంది అధికారులు, ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీరిలో కలెక్టర్‌ నుంచి డ్రైవర్‌, అటెండర్‌ వరకు ఉన్నారు. ఈ సంఖ్యను 158 మందికి పరిమితం చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ కాకుండా ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లు (కేడర్‌ పోస్టులు) ఉన్నారు. ఈ సంఖ్యను రెండింటికి పరిమితం చేయనున్నారు. రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న 32 మంది యథావిధిగా కొత్తగా ఏర్పడే రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ఉంటారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒక జిల్లా కేంద్రంలో కనీసం 80 శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఉంటారు.

ఇదీ చదవండి:

Awards: స్వచ్ఛత విభాగంలో రాష్ట్రానికి 10 అవార్డులు: మంత్రి బొత్స

Last Updated : Feb 20, 2022, 3:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.