ETV Bharat / state

సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం ఆగదు.. : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

author img

By

Published : Apr 6, 2023, 9:13 AM IST

Updated : Apr 6, 2023, 1:23 PM IST

MLA Kotamreddy Sridhar Reddy Comments: పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ.. జలదీక్షకు పిలుపునిచ్చిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ పోరాటం ఇంతటితో ఆగబోదని స్పష్షం చేశారు. కాగా కోటంరెడ్డికి స్థానిక నేతలతో పాటు వామపక్ష, జనసేన నేతలు మద్దతు తెలిపారు.

Kotamreddy Sridhar Reddy
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy Sridhar Reddy Comments about House Arrest: నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో తాను లేవనెత్తిన ప్రజా సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం ఆగబోదని.. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టంచేశారు. సమస్యల పరిష్కారం కోసం జలదీక్షకు దిగిన తనను పోలీసులు అన్యాయంగా గహనిర్బంధం చేశారని విమర్శించారు. నిధులు మంజూరు చేస్తూ సీఎం జగన్‌ చేసిన సంతకానికే దిక్కులేకపోతే ఎలా అని శ్రీధర్‌రెడ్డి అంటున్నారు.

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలో అనేక ప్రజా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని.. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. మూడున్నరేళ్లుగా వాటిని పరిష్కరించాలని.. కలెక్టర్‌ నుంచి సీఎం వరకు అందరినీ కలిసినా ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికే జలదీక్ష రూపంలో ఆందోళనకు దిగానని.. కానీ శాంతియుత నిరసనను గృహనిర్బంధంతో అడ్డుకోవడం సరికాదని కోటంరెడ్డి సూచించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ తన పోరాటం ఆగబోదని స్పష్టంచేశారు. శ్రీధర్‌రెడ్డికి స్థానిక నేతలతో పాటు వామపక్ష, జనసేన నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం అణచివేతను మానుకుని శ్రీధర్‌రెడ్డి లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

హౌస్ అరెస్ట్: కాగా జలదీక్షకు పిలుపునిచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాగుంట లేఅవుట్​లో పోలీసులు ఈ రోజు ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారు జామున 5 గంటలకు పెద్ద ఎత్తున పోలీసులు ఇంటిని మోహరించారు. నెల్లూరు గ్రామీణంలోని పొట్టెపాలెం వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని, మునుముడి కలుజు వద్ద వంతెన నిర్మాణం కోసం.. పొట్టెపాలెం కలుజువద్ద 8 గంటలకు నీళ్లలో కూర్చుని దీక్షకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జలదీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆయనను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. మాగుంట లేఔట్​లోని ఎమ్మెల్యే కోటంరెడ్డి నివాసం వద్దకు కోటంరెడ్డి అభిమానులు, నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన కోటంరెడ్డి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గృహనిర్బంధం చేయడంతో.. ఆయన ఇంటి వద్దే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో కోటంరెడ్డి ఇంటివద్దకు పెద్దఎత్తున కార్యకర్తలు, అనుచరులు తరలి వస్తున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చేంతవరకూ ఇక్కడే కూర్చుంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు ఎంతసేపు కాపలా ఉంటారని ప్రశ్నించారు. పది రోజుల ముందు నుంచే పోలీసులను అనుమతి కోరుతున్నానని.. అయినా సరే తెల్లవారు జామున వచ్చి దీక్షకు అనుమతి లేదన్నారని కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది పాల్గొంటారు, గజ ఈత గాళ్లు ఉన్నారా వంటి ప్రశ్నలు అడిగారని కోటంరెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్షకు పోలీసులు నో.. హౌస్ అరెస్ట్

"పొట్టేపాలెం కలుజు వద్ద జలదీక్ష చేపట్టాలని నిర్ణయించి.. పది రోజుల ముందే పోలీసుల అనుమతి కోసం లేఖ రాయడం జరిగింది. ఈ రోజు ఉదయం వరకూ ఆ లేఖపై స్పందించలేదు. ఈ రోజు ఉదయం 4 గంటలకు పెద్ద ఎత్తున పోలీసులు మా ఇంటి వద్దకు చేరుకున్నారు. నన్ను గృహ నిర్బంధం చేశారు. ఇది ఏమిటని అడిగితే వాళ్లు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. నన్ను కలిసేందుకు నేతలు వస్తుంటే.. వారిని కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అందుకే నేను స్పష్టంగా చెప్తున్నాను.. నేను జలదీక్ష చేసి తీరాల్సిందే. నేను ఒక్కడినే చేస్తాను. రెండో వ్యక్తి ఎవరూ రారు.. అలా వచ్చినా నేనే బాధ్యత తీసుకుంటాను. ట్రాఫిక్​కి కూడా ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తే.. మరి మీకు వచ్చే నష్టం ఏంటి?. ఇది నా ఇల్లు ఇక్కడ పోలీసులు ఎన్ని రోజులు ఉంటారో ఉండండి. నేను మాత్రం దీక్ష చేసి తీరుతా.. లేదంటే ప్రభుత్వం స్పందించి.. వంతెనలు నిర్మించాలి". - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే

అప్పుడే అనుమతి కోరారు!: జలదీక్షకు అనుమతి కోసం జిల్లా ఎస్పీ, డీఎస్పీలను గతంలోనే అనుమతి కోరినట్లు కోటంరెడ్డి ప్రకటించారు. ఈ వంతెన నిర్మాణం గురించి.. 25 జులై 2019లోనే ముఖ్యమంత్రికి తెలియజేసినట్లు చెప్పారు. గత నాలుగేళ్లుగా అనేకసార్లు.. ప్రభుత్వం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి విసిగి వేసారిపోయానని అన్నారు. ప్రస్తుతం అనుమతి లేదని దీక్షను అడ్డుకోవడంపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ నుంచి ఎలా బయటకు వచ్చారు?: తన నియోజకవర్గంలోని ప్రజాసమస్యలపై.. అధికార పార్టీలో ఉంటూ విమర్శించడంతో పాటు.. పలు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండేవారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోటంరెడ్డిని దూరం పెడుతూ వచ్చింది. తరువాత అధికార పార్టీలోని ఇతర నేతలకు, కోటంరెడ్డికి మధ్య మాటల యుద్ధం నడిచింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. క్రాస్ ఓటింగ్ చేశారనే అనుమానంతో కోటంరెడ్డితో పాటు మరో ముగ్గురిని వైఎస్సార్సీపీ సస్పెండ్ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Apr 6, 2023, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.