ETV Bharat / state

మాచర్ల మారణహోమానికి సూత్రధారి అతడే..

author img

By

Published : Dec 17, 2022, 9:22 AM IST

Updated : Dec 17, 2022, 12:29 PM IST

Attacks In Macherla Area: మాచర్లలో జరిగిన విధ్వంసం పల్నాడు జిల్లా ఫ్యాక్షన్ గొడవల్ని మరోసారి తెరపైకి తెచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలైన బెదిరింపుల సంస్కృతి.. దాడులు, హత్యల వరకూ వెళ్లింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కనీసం తమ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు సిద్ధం కాకుండా భయపెట్టడమే తాజా దాడుల వ్యూహంగా కనిపిస్తోంది.

macherla
మాచర్ల

Attacks In Macherla Area: రెండేళ్ల క్రితం స్థానిక సంస్థల నామినేషన్ల సందర్భంగా మాచర్లలో వైసీపీ నాయకులు విధ్వంసానికి తెగబడ్డారు. ఆనాటి ఘటనను గుర్తుకు తెచ్చేలా శుక్రవారం మరోసారి వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అప్పట్లో తెలుగుదేశం అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు రానీయకుండా అడ్డుకుంటున్నారని తెలుసుకుని విజయవాడ నుంచి.. బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, పార్టీ లీగల్‌సెల్‌ నాయకులతో కూడిన ప్రతినిధుల బృందం మాచర్లకు చేరుకుంది.

పట్టణంలోకి రాగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. తురకా కిశోర్ నేతృత్వంలో అడ్డుకుని దాడులతో అరాచకం సృష్టించారు. టీడీపీ ప్రతినిధి బృందం ప్రయాణించే వాహనంపై దాడులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన డ్రైవర్లు చాకచక్యంగా వారిని తప్పించటంతో ఆరోజున ప్రమాదం తప్పింది. అప్పట్లో కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. కార్లను వెంబడించి మరీ పట్టణంలోకి రాకుండా తరిమి కొట్టారు. అంతటితో ఆగకుండా మార్గ మధ్యలో ఉన్న వైసీపీ శ్రేణులకు ఫోన్లు చేసి.. తెలుగుదేశం వాహనాలపై దాడులకు ఆదేశించటంతో దుర్గిలోనూ వాహనాలపై విధ్వంసం సృష్టించారు. ఇదంతా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కుడిభుజంగా భావించే తురకా కిశోర్ ఆధ్వర్యంలో జరిగాయి.

మాచర్ల మారణహోమానికి సూత్రధారి అతడే...

శుక్రవారం చోటుచేసుకున్న విధ్వంసానికి కూడా తురకా కిశోర్ నివాసం ఉండే వడ్డెర కాలనీ ప్రాంతమే వేదికైంది. ఆ ప్రాంతానికి తెలుగుదేశం నాయకులు 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం పేరుతో వెళ్లగా అడ్డుకున్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వైసీపీ దాడులను ప్రతిఘటించారు. దీంతో కొంచెం వెనక్కు తగ్గినట్లు తగ్గి.. తిరిగి జనసమీకరణ చేసుకుని దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు నాయకుల ఇళ్లపై దాడి చేయటం ద్వారా వారిలో మనోధైర్యం సన్నగిల్లేలా చేయటం వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.

మాచర్ల ఇంఛార్జ్‌గా జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చాక కార్యకర్తలు కొంచెం ధైర్యంగా ముందుకు వస్తున్నారు. బ్రహ్మారెడ్డిది రాజకీయ కుటుంబం కావటంతో ఈ ప్రాంతంలో పలుకుబడి ఉంది. కార్యకర్తల్ని సమీకరించి ముందుకు నడిపించే చొరవ ఉంది. ఇదే కొనసాగితే సాధారణ ఎన్నికల నాటికి తెలుగుదేశం బలపడి తాము ఇబ్బంది పడతామని వైసీపీ భావిస్తోంది. అందుకే ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని కూడా జరగనీయకుండా అడ్డుకుని దాడులు చేసినట్లు తెలుస్తోంది.

బ్రహ్మారెడ్డి ఇంఛార్జ్‌గా వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాలన్నింటిని ఎలాగోలా అడ్డుకోవాలని వైసీపీ చూస్తోంది. బుధవారం నాడు వెల్దుర్తిలో శుభకార్యానికి వెళ్లిన సమయంలో కూడా పోలీసులు అడ్డుకుని తెలుగుదేశం కార్యకర్తల్ని అరెస్టు చేశారు. దీంతో ఆయన స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఈ విషయంలో బ్రహ్మారెడ్డితో పాటు పార్టీ నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవన్నీ కూడా పోలీసులు, వైసీపీ వ్యూహాన్ని తేటతెల్లం చేస్తున్నాయని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 17, 2022, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.