ETV Bharat / state

Prathipati Pulla Rao on Gambling: 'అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జూదం మాఫియా'

author img

By

Published : Jun 15, 2023, 3:46 PM IST

Prathipati PullaRao on Gambling: అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జూదం మాఫియా నడుస్తోందని టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. జూదం లేని రాష్ట్రంగా చేశామని అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రగల్బాలు పలికారని, జగన్ చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని దుయ్యబట్టారు.

Etv Bharat
Etv Bharat

Gambling in Chilakaluripeta : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లో జూదం మాఫియా నడుస్తోందని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాసులు కురిపిస్తున్న పేకాట కేంద్రాలు : మంత్రి విడదల రజిని అండదండలతో ఆమె కుటుంబ సభ్యులు జూదం మాఫియాను పోషిస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. జూదం లేని రాష్ట్రంగా చేశామని అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రగల్బాలు పలికారని, జగన్ చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలకు పేకాట కేంద్రాలు కాసుల కురిపిస్తున్నాయని అన్నారు. ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్ర స్థానంలో ఉంటుందని, 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు.

పేకాట అడ్డాగా చిలకలూరిపేట : సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లను మాత్రం మూసేసి అనధికారికంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చిలకలూరిపేటను పేకాటకు అడ్డాగా మార్చారని.. అపార్ట్‌మెంట్లలో, బజార్లలో పేకాట నడుస్తోందని అన్నారు. మంత్రి విడదల రజిని సహకారంతోనే యథేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్నారని, 'మూడు పువ్వులు... ఆరు కాయలు'గా.. పేకాటను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. చిలకలూరిపేటలో జూదం ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని... పేకాట క్లబ్‌ల ద్వారా మంత్రి రజిని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని తెలిపారు. అనధికారికంగా పేకాట క్లబ్‌లోనే మద్యం సహా అన్నీ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.

రోడ్డున పడుతున్న పేద కుటుంబాలు : కంటిచూపు మేరలో ఉన్న చిలకలూరిపేటలో జరిగేది సీఎం జగన్‌కు కనిపించట్లేదా? అని ప్రత్తిపాటి ప్రశ్నించారు. సీనియర్ సిటిజన్స్ ఆడుకునే క్లబ్‌లు మూసేసి అనధికారికంగా పేకాట క్లబ్‌లు తెరిచారని.. వైఎస్సార్సీపీ నేతల జేబులు నింపుకునే దురుద్దేశం స్పష్టంగా కనబడుతోందని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్, మంత్రి రజిని పుణ్యాన రాష్ట్రంలో ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్సీలకు రక్షణ ఉందా? : చిలకలూరిపేటలో జరుగుతున్న ఈ తతంగం ఎస్ఈబీ, పోలీస్‌శాఖకు కనిపించట్లేదా? అని ప్రత్తిపాటి ప్రశ్నించారు. ఎవరికి అందేవి వారికి అందుతున్నాయని.. రూ.కోట్లలో చేతులు మారుతున్నాయని అన్నారు. విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో ఎస్సీ కులానికి చెందిన కృష్ణయ్య చనిపోతే ఏం చేస్తున్నారని? సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఎస్సీలకు రక్షణ ఉందా? అని ప్రశ్నించారు. జూదాన్ని నియంత్రించి, నిర్వహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, మాటలు కాకుండా చేతల్లో చూపించాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేస్తున్నామని ప్రత్తిపాటి తెలిపారు.

పేకాట అడ్డాగా చిలకలూరిపేట

'క్లబ్​లను మూసేశాము. జూదాన్ని అరికట్టామని చెప్పుకునే సీఎం జగన్​కు చిలకలూరిపేట, రాష్ట్రంలో ఉన్నపేకాట కనపడటం లేదా అని ప్రశ్నిస్తున్నాను. పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జూదం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.'- ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.