ETV Bharat / state

Childrens: చిన్నారులు రోజంతా పోలీస్ స్టేషన్​లోనే.. కారణం ఏంటి!

author img

By

Published : Apr 26, 2022, 2:56 PM IST

childrens in police station
చిన్నారులు రోజంతా పోలీస్ స్టేషన్​లోనే

Childrens: అభం శుభం తెలియని చిన్నారులను పోలీసులు మధ్యాహ్నం నుంచి స్టేషన్​లోనే ఉంచారు. వారు ఏదో పెద్ద నేరం చేశారని భావిస్తే మీరు పొరపడినట్లే. ఎందుకంటే కేవలం వారు చేసింది ఆడుకుంటూ వెళ్లి ఫ్లెక్సీలను చించడమే! అదేంటి ఫ్లెక్సీలు చించితేనే స్టేషన్​కి తీసుకెళ్తారా అనే సందేహం ఉందా ? అయితే ఇది చదవండి..

అభంశుభం తెలియని విద్యార్థులను మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పోలీస్​స్టేషన్​లో ఉంచిన ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. పార్టీ ఫ్లెక్సీలను చించారని ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ చిన్నారులను స్టేషన్​కి తీసుకెళ్లారు. పోలీసులను చూసి భయపడిన చిన్నారులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బిక్కుబిక్కుమంటూ స్టేషన్లో గడిపారు. చివరకు స్థానిక నాయకుల పూచీకత్తుతో ఇంటికి పంపారు. పిల్లలను పోలీస్​స్టేషన్​లో ఉంచడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.

వైకాపా అరాచక పాలనకు నిదర్శనం...

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీస్​స్టేషన్​లో చిన్నారులను ఉంచిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ స్పందించారు. ఆడుకుంటూ ఫ్లెక్సీ చింపారని విద్యార్థులను రోజంతా స్టేషన్​లో ఉంచడం వైకాపా ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని మండిపడ్డారు. వైకాపా నాయకుల పైశాచికత్వానికి అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ప్రతిపక్ష నాయకుల పై అక్రమ కేసులు పెట్టిన వైకాపా నేతలు, ఇప్పుడు ఏకంగా చిన్నారులను పోలీస్ స్టేషన్ లో పెట్టి వికృత ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పిల్లల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి బెదిరించడమా? అని నిలదీశారు. బాలల హక్కులు కాలరాసే విధంగా చోటుచేసుకున్న ఈ ఘటన పై విచారణ జరిపి, విద్యార్థులను వేధించడానికి కారణమైన వైకాపా నేతలు, వారికి సహకరించిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.