ETV Bharat / state

నాలుగున్నరేళ్లు పట్టించుకోని జగన్​ - వైసీపీ​ పాలనపై ముస్లింల అసంతృప్తి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 5:12 PM IST

YCP Government Neglected Haj Building Constructions : మైనారిటీల సంక్షేమానికి అండాదండా అంతా తానేనని ముఖ్యమంత్రి జగన్​ ఊదరగొడుతుంటారు. తీరా తన పాలనలో మైనారిటీలకు ఏం మేలు జరుగుతోందని గమనిస్తే వెంట నడుస్తున్న వారికీ సైతం మొండిచెయ్యే మిగులుతోంది. కక్షలే తప్ప తనకు సెంటిమెంట్లు లేవన్నట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లానే హజ్ భవన్​ నిర్మాణాన్నే పడకేయించారు. గత ప్రభుత్వం హయాంలో ఆరంభమై 90 శాతం పూర్తవటమే ఆ భవనం చేసుకున్న పాపం. ఇదేనా మైనారిటీ సంక్షేమంపై జగన్​ పాలన చూపుతున్న శ్రద్ధ అని ముస్లిం నేతలు పెదవి విరుస్తున్నారు.

haj_builings
haj_builings

హజ్​ భవనాలను నిర్లక్ష్యం చేసిన జగన్​ ప్రభుత్వం

Government Neglected Haj Building Constructions : మైనారిటీల సంక్షేమానికి అండాదండా అంతా తానేనని ముఖ్యమంత్రి జగన్​ ఊదరగొడుతుంటారు. తీరా తన పాలనలో మైనారిటీలకు ఏం మేలు జరుగుతోందని గమనిస్తే వెంట నడుస్తున్న వారికీ సైతం మొండిచెయ్యే మిగులుతోంది. వైఎస్ఆర్ జిల్లాలో గత కొన్నేళ్లుగా అత్యధిక ముస్లింలు వైఎస్​ కుటుంబం వెంటే నడుస్తున్నారు. అయినా కూడా 2014 ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అధికారం చేపట్టిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కడపలో 25 కోట్లతో హజ్‌ భవన నిర్మాణ పనులు చేపట్టారు.

2019 ఎన్నికల నాటికే దాదాపు 90 శాతంపైగా పూర్తయింది. మిగిలిన కొద్ది పనుల్ని పూర్తిచేసి ఆ భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకూ జగన్‌కు మనసు ఒప్పలేదు. మిగతా పనులకు నిధులు విడుదల చేయాలని జిల్లా అధికారుల నుంచి ప్రభుత్వానికి నివేదిక అందినా పట్టించుకోలేదు. గత నాలుగున్నరేళ్లలో చిన్న పని కూడా చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో మళ్లీ ముస్లిం ఓట్లు గుర్తొచ్చినట్టున్నాయి. 10 కోట్లతో పనులు చేపట్టేందుకు హడావిడి చేస్తున్నారు. జగన్ పాలనా తీరు గుత్తేదారులకు పూర్తిగా అనుభవమైనట్టుంది. కడప హజ్ భవనంపై ఎన్నికల వేళ ఆయన హడావిడి చేస్తున్నా పనులు చేసేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావడంలేదు. టెండర్లు పిలిచినా పెద్దగా ఆసక్తి కనబరచనట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు పురమాయించేందుకు ప్రయత్నించినా మెల్లగా జారుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున నిధుల విడుదల జాప్యమైతే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ పరపతి ఎంత దిగజారిందో ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు.

Janasena on Hajj Yatra: 'హజ్ యాత్రికుల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి'

Haj Building in Vijayawada : విజయవాడలో మరో హజ్ భవనాన్ని నిర్మించాలనే ముస్లిం సంఘాల విజ్ఞప్తికి అప్పట్లో చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. 2018లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెంలో 80 కోట్లతో భవనాన్ని నిర్మించేందుకు మూడెకరాలు కేటాయించి శంకుస్థాపన చేశారు. అక్కడే మసీదు, షాదీ ఖానా కూడా నిర్మించాలనుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ దీన్ని కూడా పక్కన పెట్టారు. పోనీ, మరో చోటైనా నిర్మించ తలపెట్టారా అంటే అదీ లేదు. ఏటా హజ్ యాత్ర సమయంలో హడావిడి చేయడం ఆపై మిన్నకుండటం షరామామూలే. హజ్​ భవనాలకు భూములను కేటాయించాలని ముస్లిం సంఘాలు ఎన్ని సార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇది జగన్‌కు ముస్లింల పట్ల ఉండే చిత్తశుద్ధి. జగన్ తీరుతో విభజన రాష్ట్రానికి ఇప్పటి వరకు హజ్ భవనం సమకూరని పరిస్థితి నెలకొంది. విజయవాడలో హజ్ భవనం అందుబాటులోకి వస్తే అక్కడే మైనారిటీ ఆర్థిక, సహకార సంస్థ, వక్ఫ బోర్డు, హజ్‌ కమిటీ కార్యాలయాల్నీ నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఇవన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

Heavy Charges On Hajj Pilgrims: హజ్‌ యాత్రికులకు ధరాఘాతం!.. పక్క రాష్ట్రాలతో పోలిస్తే..!

Waqf Properties Are Alienable : వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా రక్షణకు వాటి చుట్టూ ప్రహరీలు నిర్మించేందుకు వైకాపా ప్రభుత్వం 2019-20 బడ్జెట్లో రూ.20 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపులు చేసి దాదాపు నాలుగున్నరేళ్లు దాటింది. అంటే ఈ పాటికే ప్రహరీల నిర్మాణం జరిగి ఉంటుందని ఊహిస్తున్నారా? అబ్బే అలాంటిది ఏమి లేదు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్. ఆయన చర్యలు ఊహాతీతం. నిధులు కేటాయింపు కాగితాలు దాటవు. పనులు ముందుకు కదలవు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు చుట్టూ ప్రహరీలు నిర్మించి, వాటి రక్షణకు హోంగార్డులను నియమించాలని 2021 ఆగస్టు 9న మైనారిటీ శాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఈసారైనా పని జరిగే ఉంటుందనుకుంటున్నారా మళ్లీ షరామామూలే. ఇప్పటికీ ఒక్క అడుగూ పడలేదు. ఎందుకంటే ఆయన ఇలా ఆదేశాలు మాత్రమే ఇస్తారు. కానీ నిధుల్ని విడుదల చేయరు. జగన్​ ప్రభుత్వం ముస్లిం నేతలు, అధికారులతో సమావేశం అయినప్పుడు మాత్రమే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ అంశాన్ని తెరమీదకు తెచ్చి చర్యలు తీసుకుంటున్నట్టు నమ్మించే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఆ ఊసే కనిపించదు. మళ్లీ ఎన్నికలు సమీపించే సమయంలో వక్ఫ్​ ఆస్తుల పరిరక్షణ అస్త్రాన్ని బయటకు తీస్తారు.

హజ్​ భవనంపై కూడా ప్రతాపమా..! మైనారిటీల ఆవేదన ..!

రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు, నగరాల్లో వక్ఫ్‌ బోర్డుకు సంబంధించి 68 ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ వేల కోట్లు ఉంటుంది. వీటిలో మసీదులు, ఈద్గాలు, పీర్ల చావిడులు, దర్గాలు, పాంజాలు, శ్మశానవాటికలు, ఖాళీస్థలాలు, వ్యవసాయ భూములున్నాయి. వీటికి రక్షణ చర్యలు చేపట్టాలంటే రూ. 27 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నివేదిక ఇచ్చి రెండేళ్లు దాటిపోయింది. కానీ జగన్ మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 13 వేల ఎకరాల వక్ఫ్‌ భూములు ఆక్రమణకు గురైనట్లు గతంలోనే గుర్తించారు. కొన్నింటిపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. అవి వక్స్ సంస్థలవే అని నిరూపించే అవకాశమున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నెల్లూరు నగరంలో, గుంటూరు, వినుకొండ, నరసరావుపేట, మదనపల్లె, కడప నగరంలోనూ కబ్జాకు గురైన వక్ఫ్‌ భూములు కనిపిస్తున్నా చర్యలే లేవు. కొన్ని చోట్ల వైసీపీ నాయకుల కబంధ హస్తాల్లోనే ఇవి చిక్కుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.