ETV Bharat / state

భాషా పరిరక్షణ ప్రజాఉద్యమంగా మారాలి.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో వక్తలు

author img

By

Published : Dec 23, 2022, 7:21 PM IST

Updated : Dec 23, 2022, 9:36 PM IST

Fifth Conference of World Telugu Writers: భాషా పరిరక్షణ ప్రజాఉద్యమంగా మారాలని.. తెలుగు భాషాభిమానులు ఆకాంక్షించారు. మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో, భాష అంతేనని.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు ఇంటి నుంచే అమ్మభాషను కాపాడేందుకు నడుంబిగించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.

ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు
ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు

భాషా పరిరక్షణ ప్రజాఉద్యమంగా మారాలి.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో వక్తలు

Fifth Conference of World Telugu Writers: 'స్వభాషను రక్షించుకుందాం.. స్వాభిమానం పెంచుకుందాం' నినాదంతో విజయవాడ సిద్ధార్థ అకాడమీలో ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు లాంఛనంగా ఆరంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలను మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, వివిధ సంఘాల ప్రతినిధులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కోటి మాటల కోట, రాజరాజ నరేంద్ర పుస్తకాలను ఆవిష్కరించారు. రచనల ద్వారానే భాషా సంస్కృతులు భవిష్యత్‌ తరాలకు చేరతాయన్న వెంకయ్యనాయుడు.. మాతృభాషను కాపాడుకునేందుకు ఐదు అంశాలపై అంతా దృష్టి సారించాలని అన్నారు.

"శ్వాస ఎంత ముఖ్యమో..భాష అంత ముఖ్యము.. ప్రజల్లో నిబద్దత లేకుండా భాష పరిరక్షణ, సాహిత్యాభివృద్ధి సాద్యం కాదు.ఇది ఒక ప్రజా ఉద్యమంగా రూపొందాలనేది నా అభివాదం.. ప్రాధమిక విధ్య మాతృ భాషలో ఉండాలి..ఇది తప్పని సరి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.. పరిపాలన భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి.. పరిపాలన ఎవరికి.. ప్రజలకు కదా.. ప్రజలకు వచ్చిన భాషలో లేకుండా..ఉత్తర్వులు ఇంగ్లీష్​లో ఇచ్చి .. దయాదాక్షిణాలుగా తెలుగు కాపీ విడుదల చేస్తున్నారు..మారాల్సిన అవసరం ఎంతో ఉంది.. న్యాయవ్యవస్థలో కూడా తీర్పులు, వాదనలు మాతృభాషలో ఉండాలి..ఉన్నత సాంకేతి విద్యను మాతృ భాషలోకి తీసుకురావాలి.. ప్రతీ ఒక్కరూ ముందు ఇంట్లో కుటుంబ సభ్యులతో మాతృభాషలో మాట్లాడాలి.." వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.. తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో మక్కువ పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపైనా ఉందన్నారు. భాషాభిమానం విషయంలో తమిళనాడును చూసి తెలుగువారు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. సుసంపన్నమైన తెలుగు భాషను విదేశీయులు ఎంతో ఆదరిస్తున్నా.. స్వరాష్ట్రంలో ఆదరణ తగ్గిపోతుండడం పట్ల భాషాభిమానులు ఆవేదన చెందారు.

"తల్లి తరువాత అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఉపాధ్యాయుడు..మరి ఇవాళ మీ చేతిలో అనేకమంది విద్యార్ధులు ఉంటారు..దయచేసి నేను వి​జ్ఞప్తి చేస్తున్నాను..మీ దగ్గరకు వస్తున్నటువంటి విద్యార్ధులకు తప్పనిసరిగా శతక సాహిత్యం నేర్పించండి, పద్యాలు నేర్పించండి..భాష గురించి చెప్పండి. తమిళలను ఆదర్మంగా తీసుకోవాలి..భాష, సంస్కృతి, ఆహారవ్యవహారాలు సంబందించి వాళ్లు ఏమాత్రం రాజీ పడరు.. అవసరమైతే భారత ప్రభుత్వం తలవంచి..వాళ్లకి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా..చట్టం చేసి..జల్లికట్టు విషయం కానీవ్వండి ఇంకేమైనా విషయం కానీవ్వండి.. అదీ తమిళుల ఐక్యత.." జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

కన్నతల్లిని గౌరవించినట్లుగానే మాతృభాషపై మమకారం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన సుప్రసిద్ద తెలుగు రచయితలు ఈ మహాసభల్లో పాల్గొని కీలక ఉపన్యాసాలు ఇచ్చారు. ఇక్కడికి వచ్చినవారందరికీ గమ్యం-గమనం పేరిట పరిశోధనా గ్రంథాన్ని ప్రతినిధులు అందజేశారు. సభా వేదికపై ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.