ETV Bharat / state

Vijayawada Kanaka Durga Temple EO Transferred: దసరా ఉత్సవాల వేళ దుర్గగుడి ఈవో బదిలీ.. ఆధిపత్య పోరే కారణమా..?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 12:51 PM IST

Vijayawada Kanaka Durga Temple EO Transferred: దసరా ఉత్సవాల వేళ దుర్గగుడి ఈవో ఆకస్మిక బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఆ స్థానంలో రెవెన్యూశాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ను నియమించడం విమర్శలకు తావిస్తోంది. గత కొంతకాలంగా దుర్గగుడి ఆలయ ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌లతో ఈవో భ్రమరాంబకు సరిగా పొసగడం లేదు.

Vijayawada Kanaka Durga Temple EO Transferred
Vijayawada Kanaka Durga Temple EO Transferred

Vijayawada Kanaka Durga Temple EO Transferred: విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి, అమ్మవార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఇటువంటి సమయంలో ఆకస్మికంగా ఆలయ ఈవో డి.భ్రమరాంబను ప్రభుత్వం బదిలీచేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేవాదాయశాఖ అధికారి అయిన భ్రమరాంబను బదిలీచేసి, ఆ స్థానంలో రెవెన్యూశాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ను (Vijayawada Kanaka Durga Temple New EO) నియమించడంతో పలు విమర్శలకు తావిస్తోంది.

గత కొంతకాలంగా దుర్గగుడి ఆలయ ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌లతో.. ఈవో భ్రమరాంబకు అంతగా పొసగడం లేదు. ఈవో భ్రమరాంబకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మద్దతు ఇస్తున్నారు. గత సంవత్సరం దసరా సమయంలో కొట్టు సత్యనారాయణ తన ఆధిపత్యం చూపేందుకు గాను ఉత్సవాలు జరిగిన అన్ని రోజులూ ఆలయం వద్దే ఉంటూ, పర్యవేక్షించారు.

Kottu Satyanarayana on Durga Temple Issue: కర్నాటి రాంబాబు తీరుపై కొట్టు కౌంటర్.. దుర్గగుడి పంచాయితీకి తెరపడేనా..?

ఇది స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్​కి రుచించలేదు. అప్పట్లోనే వీరిమధ్య వైరం వచ్చింది. దీంతో ఈ సారి దసరా ఉత్సవాలను కూడా ఈవో భ్రమరాంబ నేతృత్వంలోనే జరిపించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ భావించారు. అయితే ఎమ్మెల్యే వెల్లంపల్లి, ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చి ఈవో భ్రమరాంబను బదిలీ చేయించారని దేవాదాయశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కొత్త ఈవోతో ఉత్సవాలు సవ్యంగా జరుగుతాయా?: దక్షిణాదిలో మైసూరు తర్వాత దసరా ఉత్సవాలు విజయవాడ దుర్గగుడిలోనే ఎంతో ఘనంగా జరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు, సదుపాయాల కల్పన తదితరాలన్నీ ఎంతో పకడ్బందీగా చేయాలి. భ్రమరాంబకు వరుసగా 2 సార్లు దసరా ఉత్సవాలు నిర్వహించిన అనుభవం ఉంది.

Indrakeeladri Dasara Navaratri Start From Oct 15 : ఇంద్రకీలాద్రి పై అక్టోబర్‌ 15 నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు

తాజా ఉత్సవాలకూ భ్రమరాంబనే ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇంతలో ఆమెను బదిలీచేసి, రెవెన్యూశాఖను చెందిన అధికారిని నియమించడం ఆశ్చర్యం కలిగిస్తోందని దేవాదాయశాఖ వర్గాలు అంటున్నారు. కొత్త ఈవో బాధ్యతలు తీసుకొని.. అన్నీ తెలుసుకొనేలోపే ఉత్సవాలు మొదలవుతాయని.. ఆ తర్వాత భక్తులకు ఇబ్బందులు తప్పవనే మాట వినిపిస్తోంది.

చందనోత్సవంలో ఏం జరిగిందో గుర్తులేదా?: ఏప్రిల్‌ నెలలో సింహాచలం చందనోత్సవ సమయంలో రెగ్యులర్‌ ఈవో లేక.. ఇన్‌ఛార్జ్‌ ఈవో ఏర్పాట్లలో ఘోరవైఫల్యం చెందారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వతీరుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. గత అనుభవం చూసిన తరువాత అయినా దుర్గగుడి దసరా ఉత్సవాల్లో భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా చూడాల్సిన ప్రభుత్వం.. ఆకస్మికంగా ఈవోను మార్చడంపై దేవాదాయశాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా భ్రమరాంబకు ఎక్కడా పోస్టింగ్‌ సైతం ఇవ్వలేదు.

New Master Plan for Durga Temple: దుర్గగుడికి కొత్త మాస్టర్ ప్లాన్.. పాతది గ్రాఫిక్స్‌కే పరిమితం..!

ఆ నలుగురూ బదిలీ: రాష్ట్రంలో నలుగురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ, పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ పెద్ది రోజాను కృష్ణా జిల్లా డీఆర్వోగా బదిలీచేయగా.. కృష్ణా జిల్లా డీఆర్వో పి.వెంకటరమణను బాపట్ల డీఆర్వోగా బదిలీ చేశారు. అదే విధంగా సెప్టెంబరు మొదటివారంలో ఎన్టీఆర్‌ జిల్లా డీఆర్వోగా పోస్టింగ్‌ పొందిన ఎం.శ్రీనివాస్‌.. ఆ పోస్టులో చేరకపోవడంతో.. తాజాగా ఆయనను దుర్గగుడి ఈవోగా నియమించారు. ఇక ఎన్టీఆర్‌ జిల్లా డీఆర్వోగా ఎస్వీ నాగేశ్వరరావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

దుర్గగుడిలో ఆకస్మిక తనిఖీలు చేసిన పాలకమండలి సభ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.