ETV Bharat / state

'న్యాయం కోసం.. మహిళ ఆత్మహత్యాయత్నం బాధాకరం'

author img

By

Published : Nov 2, 2022, 5:21 PM IST

Etv Bharat
Etv Bharat

Chandrababu Naidu: ప్రచారానికే పరిమితమైన స్పందన కార్యక్రమం ఎందుకని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను ఆదుకోవాలని సూచించారు. ఇదే అంశంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ స్పందించారు. జగన్ రెడ్డి పాలనలో సామాన్య మహిళల కష్టాలు తీరుతాయనుకోవడం అత్యాశేనని దుయ్యబట్టారు.

Chandrababu Naidu: ఏపీలో అధికార మదంతో సామాన్య ప్రజలపై జరుగుతున్న వేధింపులకు ముగింపు ఎప్పుడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నిలదీశారు. అన్నవరానికి చెందిన ఆరుద్ర అనే మహిళ న్యాయం కోసం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమన్నారు. కూతురి వైద్యానికి తన ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛ కూడా ఆమెకు లేకుండా చేయడం దారుణమని అగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన మంత్రి గన్​మెన్ తదితరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయమని గతంలో కాకినాడ కలెక్టరేట్ ముందు ఆరుద్ర ధర్నా చేసినప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంతవరకు వచ్చేదా అని ప్రశ్నించారు. ప్రజలను కలవాలంటే ఈ ముఖ్యమంత్రికి అహంకారం అడ్డొస్తుందా అని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలు పరిష్కరించలేనప్పుడు ప్రచారానికే పరిమితమైన స్పందన కార్యక్రమంతో ఎవరికి ఉపయోగమని అన్నారు.

ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముందే న్యాయం కోసం మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందంటే.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ రెడ్డి పాలనలో.. సామాన్య మహిళల కష్టాలు తీరుతాయనుకోవడం అత్యాశేనన్నారు. తాడేపల్లి ప్యాలెస్​లో ఉన్న జగన్ రెడ్డికి కాకినాడలో వైకాపా నేతల అరాచకాలు కనపడవని దుయ్యబట్టారు. అచేతన స్థితిలో వున్న కుమార్తెకు వైద్యం చేయించలేని ఆడపడుచు ఆరుద్ర ఆత్మహత్యాయత్నం ఆర్తనాదాలు వినపడవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిడ్డ వైద్యానికి తక్షణమే సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర ప్రాణాలు కాపాడాలన్నారు. మంత్రి పేరుతో కబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.