కర్నూలు జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చిప్పగిరి, ఓర్వకల్లు, బండి ఆత్మకూరు, ఆస్పరి, హోళగుంద, మంత్రాలయం, కోసిగి, మిడుతూరు మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఆదోనిలో ఆవుదూడవంక పొంగి ప్రవహిస్తుడంటం వల్ల సమీపంలోని ఇళ్లలోకి నీరుచేరింది. పాములపాడు మండలంలో పంటపొలాలు చెరువును తలపిస్తున్నాయి. కోసిగిలో చాపవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. డోన్ మండలం దేవరబండ వద్ద రహదారిపై విద్యుత్ స్తంభం కూలిపోయింది.
హొళగుంద మండలం ఇంగళహాల్-ఎండీ హళ్లి మధ్య వంక పొంగిపొర్లుతోంది. మహానంది మండలంలో తమడపల్లి చెరువు ప్రమాదకరంగా మారింది. బుక్కాపురం గ్రామానికి ప్రమాదం పొంచి ఉండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలూరు నియోజకవర్గంలో గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి. పత్తి పంట నీట మునిగింది.
గోస్పాడు మండలంలోని జులేపల్లె-పసురపాడు మధ్య భారీ వర్షాలకు రహదారి దెబ్బతింది. ఫలితంగా నంద్యాల-కోవెలకుంట్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల మండలంలోని కొట్టాల వద్ద కల్వర్టు తెగడంతో రాకపోకలు స్తంభించాయి.