ETV Bharat / state

ఉపాధి కరవు...జీవనం బరువు!

author img

By

Published : May 20, 2021, 5:53 PM IST

కరోనా ఉధృతి రోజురోజుకు ఉధృతమవుతూ ఏ రంగాన్ని కోలుకోవివ్వడం లేదు. వైరస్‌ వ్యాప్తిని నివారించే ప్రక్రియలో భాగంగా అమలు చేసిన దీర్ఘకాలిక లాక్‌డౌన్‌తో వాహన చక్రాలకు బ్రేకులు పడ్డాయి. నిర్మాణాలు నిలిచిపోయాయి. దుకాణాలకు తాళాలు వచ్చాయి. ఆక్వా పరిశ్రమ తల్లడిల్లింది. ఉపాధి కనుమరుగైంది.

నిలిచిన నిర్మాణాలు
నిలిచిన నిర్మాణాలు

గతేడాది మార్చి నెలాఖరున కృష్ణా జిల్లాను తాకిన కరోనా వైరస్‌ నానాటికీ ఉద్ధృతమవుతూ ఏ రంగాన్నీ కోలుకోనివ్వడంలేదు. వైరస్‌ వ్యాప్తిని నివారించే ప్రక్రియలో భాగంగా అమలు చేసిన దీర్ఘకాలిక లాక్‌డౌన్‌తో వాహన చక్రాలకు బ్రేకులు పడ్డాయి. నిర్మాణాలు నిలిచిపోయాయి. దుకాణాలకు తాళాలు వచ్చాయి. ఆక్వా పరిశ్రమ తల్లడిల్లింది. ఉపాధి కనుమరుగైంది. ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోయారు. ఈ క్రమంలో కొవిడ్‌ నిష్క్రమిస్తున్నట్లుగా ఓ అడుగు వెనక్కి వేయడంతో.. జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఒక్కొక్కరు ఇంటి గడప దాటారు. చక్రాలు ముందుకు కదిలాయి. నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. దుకాణాలు తెరుచుకున్నాయి. ఆక్వా కుదుటపడే దిశగా అడుగులేస్తోంది. అంతలోనే మహమ్మారి మరోసారి కోరలు చాచింది. తీవ్రతను పెంచి ప్రాణాలను తోడేస్తోంది. సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా పరిస్థితుల్ని విషమం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కుదేలైన ఆయా రంగాలకు మరింత కష్టాన్ని తెచ్చిపెడుతోంది. భవితను ప్రశ్నార్థకంగా మార్ఛి.. కలతను రేపుతోంది.

కృష్ణా జిల్లావ్యాప్తంగా 1.30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. తాపీ పనివారు, పెయింటర్లు, విద్యుత్తు, ప్లంబర్లు, వడ్రంగి, సీలింగ్‌, సెంట్రింగ్‌, రాడ్‌ బెండింగ్‌ వంటి వాటితోపాటు రోజువారీ కూలీలతో లెక్కిస్తే ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. నిర్మాణ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారే. గతేడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు పూర్తిగా పనుల్లేక ఖాళీగా ఉన్నారు. డిసెంబరు నుంచి క్రమంగా నిర్మాణాలు మొదలయ్యాయి. జనవరి నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పుంజుకున్నాయి. పట్టుమని రెండు నెలలు గడవకుండానే మళ్లీ కొవిడ్‌ ఛాయలు కనిపించడంతో క్రమంగా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం 90 శాతం పనులు ఆగిపోయాయి. ఇంతకు ముందు ఖాళీగా ఉన్నప్పుడు తినడానికీ అప్పులు తేవాల్సిన దయనీయం ఏర్పడింది. ఆ బాకీలను కూడా తీర్చకుండానే.. మళ్లీ చేయిచాచే పరిస్థితి దాపురించింది. మరోవైపు భవన నిర్మాణానికి ముడిసరకు సరఫరా చేసే వ్యాపారాలపైనా పిడుగు పడినట్లయింది. ఇనుము, ఇసుక, ఇటుక, కర్ర, రంగులు ఇలా అనేక మంది వ్యాపారులు నష్టాల బాట పడుతున్నారు.

ఆటో చక్రాలకు మళ్లీ బ్రేకులు..

జిల్లాలో సుమారు 1.80 లక్షల వరకు ఆటోలు ఉన్నాయి. ఒక్కో మండలంలో 300 నుంచి 400 వరకు ఉండగా.. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ వంటి పట్టణాల్లో వేల సంఖ్యలో ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కొందరు సొంతంగా ఆటోలను కొనుగోలు చేసుకుని నడుపుకొంటుండగా, మరికొందరు రోజువారీ అద్దెకు తెచ్చుకుంటున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు కిరాయి ఇచ్చి ఆయిల్‌ కొట్టించుకుని నడుపుకొంటున్నారు. యజమానికి అద్దె రావాలన్నా.. డ్రైవర్‌కి అద్దె, ఖర్చులు పోను డబ్బులు మిగలాలన్నా ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్లపై చక్రం తిరుగుతూనే ఉండాలి. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా ఆటోలను పరదాల్లో భద్రంగా దాచుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత వాటిని రోడ్డెక్కించి నాలుగు నెలలు కాకుండానే కొవిడ్‌ నిబంధనలు మళ్లీ బ్రేకులు వేశాయి. పది రోజులుగా మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న అనుమతిని గురువారం నుంచి మరో రెండు గంటలు కుదించారు. దీంతో ఆటోలను రోడ్డెక్కించాలా, వద్దా అనే సందిగ్ధంలో చోదకులు కొట్టుమిట్టాడుతున్నారు.

తాడినాడలో పట్టుబడి చేసిన చేపలు

కుదుటపడని ఆక్వా

జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. వీటిలో 1.10 లక్షల ఎకరాల్లో చేపలు, 60 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఆ ప్రభావం ఎగుమతులపై పడింది. ఆక్వా ఉత్పత్తులకు ప్రత్యేకంగా కొన్ని వెసులుబాట్లు కల్పించినా రైతులకు పూర్తిస్థాయి ప్రయోజనం కలగలేదు. ఓ వైపు కౌంటుకు వచ్చిన సరకు పట్టుబడి చేయాలని.. ఇంకోవైపు వ్యాధులు సోకి చనిపోతున్న రొయ్యలను అమ్ముకోవాలన్న సాగుదారుల ఆత్రుతను దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలతో నిమిత్తం లేకుండా అయినకాడికి కొనడం, నచ్చినప్పుడు డబ్బులివ్వడం వంటి పరిణామాలతో రైతులు కుదేలవుతున్నారు. చేపల రైతుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. గడిచిన నాలుగు నెలలుగా మళ్లీ గాడిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. రెండోదశ కొవిడ్‌ ప్రభావంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

అచేతనంగా చేనేత

కొవిడ్‌ మహమ్మారి చేనేత రంగాన్ని అచేతనంగా మారుస్తోంది. జిల్లాలో క్రియాశీలంగా ఉన్న 35 చేనేత సంఘాల్లో 5 వేల మందికిపైగా పని చేస్తున్నారు. దీనిపై ఆధారపడి పరోక్షంగా మరో 15 వేల మంది జీవనం సాగిస్తున్నారు. ఏటా రూ.కోట్ల ఉత్పత్తులను ఇస్తున్న ఈ రంగం ఏడాదిగా ఏమాత్రం కోలుకోలేదు. ఇప్పుడూ అవే పరిస్థితులు నెలకొన్నాయి. శుభకార్యాలు నిలిచిపోవడంతో విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. మాస్టర్‌ వీవర్ల వద్ద భారీగా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో కార్మికులకు పని దొరకని దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇదీ చదవండి: 'బ్లాక్​ ఫంగస్​ను 'సాంక్రమిక' చట్టం కింద గుర్తించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.