కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండల గ్రామాల ప్రజలు మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. సముద్ర తీర ప్రాంత గ్రామాలు కావటంతో... ఎక్కడ బోరు వేసినా ఉప్పునీరే వస్తుంది. కానూరు, తాళ్లపాలెం, సిరివెళ్లపాలెం, మంగినపూడి, పెదపట్టనం, సత్తెనపాలెం, సత్రపాలెం తదితర గ్రామాల ప్రజలు పంచాయతీ కుళాయిలపైనే ఆధారపడ్డారు. పంచాయతీ తాగునీటి పథకాల నుంచి వస్తున్న నీరు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నికలప్పుడు ఇంటింటికీ పంచాయతీ కుళాయిలు అందిస్తామని ఓట్లు వేయించుకున్న నేతలు ఇప్పుడు ఆ హామీను మర్చిపోయారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో తాగునీటికి సైతం ఇక్కట్లు తప్పటం లేదని... ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇంటింటికీ పంచాయతీ కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రైళ్లలో వచ్చేవారికి కరోనా పరీక్షలపై సందిగ్ధత!