ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Oct 16, 2020, 11:22 PM IST

Updated : Oct 17, 2020, 6:54 AM IST

ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. దేవి శరన్నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొవిడ్‌ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని రోజుకు కేవలం పది వేల మంది భక్తులకే దర్శనానికి అనుమతించనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి అనేక ఆంక్షలను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇవాళ ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవ.. అనంతరం స్నపనాభిషేకం, బాలబోగ నివేదన, నిత్యార్చనల అనంతరం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా మొదటి అలంకారంతో జగన్మాత భక్తులకు దర్శనమిస్తుంది.

vijayawada kanakadurgamma
vijayawada kanakadurgamma

జగజ్జననీ.. సకల శుభకామినిగా వెలుగొందే కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శార్వరినామ సంవత్సరంలో నిజ ఆశ్వయుజ శుక్లపాడ్యమి నుంచి నవమి వరకు ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు పూర్తయ్యాయి. దసరా ఉత్సవాల్లో తొమ్మిది రోజులు దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరించనున్నారు.

మొదటి రోజు స్వర్ణకవచాలంకృతమై భక్తులకు అమ్మ దర్శనమిస్తుంది. ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవతో శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి. తొలిరోజు భక్తులను ఉదయం తొమ్మిది గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. ఈనెల 18 ప్రతిరోజు 25వ తేదీ వరకు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది.

21వ తేదీ మూలానక్షత్రం రోజున ఉదయం మూడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఈనెల 17వ తేదీన స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా.. 18వ తేదీన బాలా త్రిపురసుందరీదేవిగా.. 19న గాయత్రీదేవిగా, 20న అన్నపూర్ణాదేవిగా, 21న సరస్వతిదేవిగా, 22న లలితా త్రిపురసుందరీదేవిగా, 23న మహాలక్ష్మిదేవిగా, 24న ఉదయం దుర్గాదేవిగా, మధ్యాహ్నం మహిషాసుర మర్దినిగా, 25న రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. 25వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన సేవ ద్వారా తెప్పోత్సవం నిర్వహిస్తారు.

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఉత్సవాలు గతానికి భిన్నంగా కఠినమైన ఆంక్షలతోనే నిర్వహిస్తున్నారు. అంతరాలయ దర్శనం రద్దు చేశారు. భక్తులందరికీ ముఖమండప దర్శనానికే పరిమితం చేశారు. ముందుగా భక్తులు టిక్కెట్టు తీసుకోవాలి. లేనిపక్షంలో సీతమ్మవారి పాదాల వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన కౌంటరు వద్ద టిక్కెట్లు పొందాలి. 10 ఏళ్లు లోపు పిల్లలు, 65 ఏళ్ల వృద్ధులు, దివ్యాంగులకు అనుమతిలేదు.

భక్తులతో నిర్వహించే ప్రత్యేక పూజలన్నీ ఈసారి పరోక్షంగానే నిర్వహిస్తారు. తీర్థప్రసాదాలు, శఠారి ఇవ్వడాన్ని రద్దు చేశారు. కేశఖండన, కృష్ణానది ఘాట్‌ల వద్ద స్నానాలు రద్దు చేశారు. వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే అనుమతించాలని దేవస్థానం నిర్ణయించింది. వారికి పూర్ణకుంభం, సన్నాయి వాయిద్య స్వాగతాలు ఉండవు. సాంస్కృతి కార్యక్రమాలను రద్దు చేశారు.

దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ప్రతిరోజు పులిహారం, దద్దోజనం ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేస్తారు. అలాగే ప్రతిరోజు 50 వేల లడ్డూలను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి దిగువన వినాయక ఆలయం నుంచి కొండపై వరకు, కుమ్మరిపాలెం నుంచి టోల్‌గేట్‌ వరకు క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు- కొవిడ్‌ నిబంధనలు పాటింపజేసేందుకు వీలుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

ఈనెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.

Last Updated : Oct 17, 2020, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.