ETV Bharat / state

bheemla nayak : అధికారుల కనుసన్నల్లో థియేటర్లు... ప్రభుత్వ తీరుపై అభిమానుల ఆందోళనలు

author img

By

Published : Feb 26, 2022, 4:06 AM IST

భీమ్లా నాయక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు జిల్లాలో ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ప్రస్తుత టికెట్‌ ధరలు గిట్టుబాటు కావని పవన్‌కల్యాణ్‌ నటించిన భీమ్లానాయక్‌ చిత్రాన్ని ప్రదర్శించాల్సిన రాష్ట్రంలోని 15 థియేటర్లను వాటి యాజమాన్యాలు శుక్రవారం మూసేశాయి.

bheemla nayak
bheemla nayak

ప్రభుత్వ తీరుపై పవన్‌కల్యాణ్‌ అభిమానులు భగ్గుమన్నారు. తమ అభిమాన హీరో నటించిన భీమ్లానాయక్‌ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆందోళనలకు దిగారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు చేపట్టారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి కృష్ణా జిల్లా గుడివాడలో పవన్‌ అభిమానుల నిరసనల సెగ తగిలింది. ప్రస్తుత టికెట్‌ ధరలు గిట్టుబాటు కావని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన భీమ్లానాయక్‌ చిత్రాన్ని ప్రదర్శించాల్సిన రాష్ట్రంలోని 15 థియేటర్లను వాటి యాజమాన్యాలు శుక్రవారం మూసేశాయి. మరో అయిదు థియేటర్లలో ఈ చిత్రానికి బదులుగా వేరే సినిమాలు ప్రదర్శించారు. ఇంకో ఏడు థియేటర్లలో మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత భీమ్లానాయక్‌ చిత్రాన్ని వేశారు. టికెట్‌ ధరలు పెంచకుండా థియేటర్లపై అధికారులు నిఘా పెట్టారు. విశాఖలో భీమ్లానాయక్‌ పోస్టర్‌పైనా తహసీల్దార్‌ ఫోన్‌ నంబర్లు రాయించారు. అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు అనుమతించలేదు.

మంత్రులకు చేదు అనుభవం

తమ అభిమాన హీరోపై కక్షసాధిస్తూ, ఆయన సినిమా వేసే సినిమా హాలు ప్రారంభానికి ఎలా వస్తారని ప్రశ్నిస్తూ పవన్‌కల్యాణ్‌ అభిమానులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ఎదుట నినాదాలు చేశారు. వీరు గుడివాడలో జీ3 సినిమా కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి శుక్రవారం వెళ్లినప్పుడు ఈ చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు అభిమానులను చెదరగొట్టి, కొందరిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కొత్త సినిమా కాంప్లెక్స్‌లో భీమ్లానాయక్‌ చిత్రాన్ని మంత్రులిద్దరూ కొద్దిసేపు చూసి వెళ్లారు. తగ్గించిన టికెట్‌ ధరలు గిట్టుబాటు కావని మైలవరంలో రెండు థియేటర్లను మూసేశారు. తిరువూరులోని నాలుగు థియేటర్లలో, నందిగామలోని మరో థియేటర్‌లో భీమ్లానాయక్‌కి బదులు వేరే చిత్రాలు ప్రదర్శించారు. ఉయ్యూరు, కైకలూరు, ముదినేపల్లెలో కొన్నిచోట్ల మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత భీమ్లానాయక్‌ చిత్రాన్ని వేశారు. ప్రత్యేక ప్రదర్శన వేయాలని విస్సన్నపేట-తిరువూరు రహదారిలో పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తగ్గించిన ధరలకు చిత్ర ప్రదర్శన సాధ్యం కాదని కైకలూరులో ఒక థియేటర్‌ను మూసివేస్తుండగా... పవన్‌ అభిమానులు అడ్డుకున్నారు. గన్నవరంలో రెండు, హనుమాన్‌జంక్షన్లో మరో థియేటర్లలో సాంకేతిక కారణాల పేరుతో శుక్రవారం నుంచి ప్రదర్శన నిలిపివేశారు. విజయవాడ శైలజ థియేటర్‌ వద్ద పవన్‌ అభిమానులు ప్రభుత్వవైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. జగ్గయ్యపేటలోని కమలా థియేటర్‌లో అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించినందుకు కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్‌ మాధవీలత థియేటర్‌ యాజమాన్యానికి రూ.50వేల జరిమానా విధించారు.

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు

గుంటూరు జిల్లా కొల్లూరులో భీమ్లానాయక్‌ చిత్రాన్ని ప్రదర్శించడానికి థిÅయేటర్‌కి బీఫాం లేదని షోలు రద్దు చేయడంతో పవన్‌కల్యాణ్‌ అభిమానులు బస్టాండ్‌ సెంటర్‌లో బైఠాయించి స్థానిక ఎమ్మెల్యే, తహసీల్దార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిత్రాన్ని ప్రదర్శించాల్సిందేనని కొందరు అభిమానులు పెట్రోలు బాటిల్‌తో ఆందోళన చేపట్టారు. దీంతో వేమూరు-భట్టిప్రోలు మార్గంలో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ఫిరంగిపురంలోని ఈశ్వరసాయి థిÅయేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన (బెనిఫిట్‌ షో) వేస్తున్నట్లు ముందుగా టిక్కెట్లు అమ్మి, ప్రదర్శించకపోవడంతో అభిమానులు ఆందోళన చేపట్టారు. తగ్గించిన ధరలతో సినిమా ప్రదర్శించలేమని పెదనందిపాడులో ఒక థియేటర్‌ను యాజమాన్యం మూసివేసింది.
* చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలాజీ థియేటర్‌ వద్ద అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకాలలో చిత్ర ప్రదర్శనలకు అధికారులు అడ్డంకులు సృష్టించడంతో రామకృష్ణా థియేటర్‌ ముందు పవన్‌కల్యాణ్‌ అభిమానులు ధర్నా చేసి సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. పుత్తూరులోని విష్ణుమహాల్‌, శాంతి థియేటర్‌లో కొద్దిసేపు ఆలస్యంగా చిత్రాన్ని ప్రదర్శించారు.

కుర్చీలు ధ్వంసం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న ఒక థియేటర్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆగ్రహించిన పవన్‌ అభిమానులు థియేటర్‌లో కుర్చీలు ధ్వంసం చేసి డోర్లు బద్దలకొట్టారు. ప్రొజెక్టర్‌పైకి సీసాలు రువ్వి డీటీఎస్‌ బాక్సులు ధ్వంసం చేశారు.
* అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించినందున చిత్రప్రదర్శనకు వీల్లేదని ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శాంతి, ప్రశాంతి థియేటర్ల గేట్లకు అధికారులు తాళాలు వేయడంతో పవన్‌కల్యాణ్‌ అభిమానులు, జనసేన నేతలు ఆందోళనకు దిగారు. తగ్గించిన ధరలకు చిత్రాన్ని ప్రదర్శించలేమని అద్దంకిలోని సత్యనారాయణ కళామందిర్‌లో మొదటి షో రద్దు చేయడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.
* విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం, పాయకరావుపేట, పరవాడలోని 5 థియేటర్లలో భీమ్లానాయక్‌ చిత్ర ప్రదర్శనను నిలిపివేశాయి.
* విజయనగరం జిల్లా కొత్తవలసలో తగ్గించిన టికెట్‌ ధరలు గిట్టుబాటు కాదని 3 థియేటర్లలో మొదటి రెండు షోలూ నిలిపివేసి సాయంత్రం నుంచి మళ్లీ ప్రదర్శించారు. తూర్పుగోదావరిలో ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతివ్వకపోవడాన్ని నిరసిస్తూ అభిమానులు అమలాపురం, రాజవొమ్మంగిలో ఆందోళనలు చేపట్టారు.

ఇదీ చదవండి: 'భీమ్లానాయక్' సినిమాపై ఆర్జీవీ రివ్యూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.