Buddha prasad: నాటుసారా కారణంగా జంగారెడ్డిగూడెంలో 27మంది, ఏలూరు పరిసర ప్రాంతాల్లో 15 మంది చనిపోతే అవన్నీ సహజ మరణాలంటూ అసెంబ్లీలో ప్రకటించడం దారుణమని మాజీ ఉపసభాపతి, అవనిగడ్డ తెదేపా ఇన్ ఛార్జి మండలి బుద్ధ ప్రసాద్ ధ్వజమెత్తారు. దీనిపై ప్రశ్నించినందుకే తెదేపా శాసన సభ్యులను సస్పెండ్ చేశారని విమర్శించారు. వచ్చే 15 ఏళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపి రూ.25వేల కోట్లను అప్పుగా తేవడమే.. మద్యనిషేధంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
'తెదేపా హయాంలో రూ.6వేల కోట్లున్న మద్యం ఆదాయాన్ని.. వైకాపా ప్రభుత్వం రూ.16,500కోట్లకు పెంచింది. ఈ ఏడాది రూ.20వేల కోట్లు రాబట్టాలని ఆదేశాలిచ్చారు. ఇదేనా మద్యనిషేధం?' అని అవనిగడ్డలోని ఆయన కార్యాలయంలో నిలదీశారు. 'రాజ్యాంగంలోని 47వ ఆర్టికల్ ప్రకారం.. మద్యం, తదితర మత్తు పదార్థాలను నిషేధించడానికి, నిరోధించడానికి ప్రభుత్వం కట్టుబడాలని ఉంది. ఆదాయం కోసం రాజ్యాంగ విరుద్ధంగా మద్యం అమ్మకాలను జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. తద్వారా రాజ్యాంగాన్నే అవమానిస్తోంది. ప్రభుత్వమే వ్యాపారి పాత్రను పోషిస్తోంది. నాసి రకం ఉత్పత్తులను ప్రవేశపెట్టి వేల కోట్లు దండుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోన్నారు' అని బుద్ధ ప్రసాద్ దుయ్యబట్టారు. 'మాట తప్పను, మడమ తిప్పను ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి.. నవరత్నాల్లో ఒకటైన మద్యనిషేధాన్ని అటకెక్కించడమే కాకుండా రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలా చేశారు' అని మండిపడ్డారు.
ఇదీ చదవండి: