ETV Bharat / state

Vijayawada Crime News: రోజుకో కొత్త తరహా మోసం... నగర వాసుల గుండెల్లో గుబులు !

author img

By

Published : Jan 17, 2022, 10:08 AM IST

Vijayawada Crime News
Vijayawada Crime News

మీకు కంప్యూటర్‌ పని వచ్చా.. అయితే మంచి జీతంతో కూడిన ఉద్యోగం... ఇంటి నుంచే పని చేసే అవకాశం అంటూ ఒకడూ... ఫేస్‌బుక్‌లో లోను ఇస్తామనే ఆశ చూపుతూ మరొకడు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు రోజుకో కొత్త తరహా మోసం విజయవాడ నగరవాసులను భయపెడుతోంది. ఇప్పుడు సాయం పేరుతో.. మనకు తెలియకుండానే జేబులో ఉన్న చరవాణి, పర్సులు, వాహనాలు దొంగిలించేస్తున్నారు.

CRIME NEWS: జనవరి 8వ తేదీ రాత్రి 7.15 గంటల సమయంలో ఏలూరు లాకులు కూడలిలో ద్విచక్ర వాహనంపె వెళుతున్న ఓ యువకుడు అదుపు తప్పి పడిపోయాడు. అటుగా వెళుతున్న జయశంకర్‌ అతడిని పైకి లేపుతుండగా, మరో ఇద్దరు యువకులు వచ్చి సాయం చేశారు. ఆ తర్వాత సాయం చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులు, కిందపడిన యువకుడు.. ముగ్గురు కలిసి అదే ద్విచక్రవాహనంపై తుర్రు మంటూ వెళ్లిపోయారు. ఇంతలో జయశంకర్‌ తను జేబును చూసుకుంటే.. రూ.15వేల విలువైన చరవాణి కనిపించలేదు. పడిపోతున్నట్లు నటించిన యువకుడు, తన స్నేహితులతో కలిసి ఇలా నాటకమాడి చాకచక్యంగా చరవాణి దొంగిలించాడు.

  • కంప్యూటర్‌ పని వచ్చా.. మీకు రోజుకు రూ.1800 జీతం. ఇంటి నుంచే పని చేయవచ్చు.. అంటూ ఓ యువతి చరవాణికి మెసేజ్‌ వచ్చింది. దీనికి ఆమె ఆకర్షితులై.. వాట్సాప్‌ ఛాటింగ్‌ చేసింది. రిజిస్ట్రేషన్‌ చేసుకోమని అవతలి వ్యక్తి చెప్పడంతో... తన బ్యాంకు ఖాతా, భర్త, తల్లి ఖాతాలను ఉపయోగించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మీరు పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన ఆదాయం వస్తుందని నమ్మించారు. ఆమె నమ్మి ముందుగా రూ.200లు పెట్టుబడి పెట్టారు. వెంటనే ఆమెకు రూ.363లు ఆదాయం వచ్చింది. పూర్తిగా నమ్మకం కలగటంతో నాలుగు విడతల్లో రూ.3,62,084 చెల్లించగా, ఆమెకు రూ.7,35,480ల ఆదాయం వచ్చిందని ఫోన్‌కు సమాచారం వచ్చింది. సదరు సొమ్మును విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా కుదరలేదు. ఇంటి నుంచే ఉద్యోగం అంటూ నమ్మి మోసపోయిందా యువతి.
  • ఫేస్‌బుక్‌లో లోను ఇస్తామనే ప్రకటన చూసి దరఖాస్తు చేశాడో యువకుడు. తర్వాత రోజే ఒక వ్యక్తి ఫోన్‌ చేసి, మీకు రూ.3లక్షల రుణం వచ్చిందని, దీనికి మీరు బీమా చేయాలని చెప్పి రూ.4,500లు కట్టించుకున్నారు. ఆ తర్వాత రోజు ఈఎంఐ ఛార్జీలు, ఆర్‌బీఐ ఛార్జీలు, జీఎస్టీ, ఇన్‌వాయిస్‌లు అంటూ.. సదరు యువకుడి నుంచి రూ.65,000, రూ.20,000 రూ.27,000 రూ.3,08,332లు ఇలా.. రూ.8,10,464లు వసూలు చేశారు. ఆ తర్వాత ముఖం చాటేశారు. రూ.3లక్షల రుణానికి రూ.8.10లక్షలు ఎలా కట్టారంటే.. మోసగాళ్ల తియ్యని మాటలకు మోసపోయానంటున్నారు బాధితుడు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు.. రోజుకో కొత్త తరహా మోసం నగరవాసులను భయపెడుతోంది. ఒకపుడు ఏటీఎం కేంద్రాల్లో జరిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయటంతో ఆ తరహా మోసాలు కొంత మేర తగ్గాయి. ఇప్పుడు సాయం పేరుతో.. మనకు తెలియకుండానే జేబులో ఉన్న చరవాణి, పర్సులు, వాహనాలు దొంగిలించేస్తున్నారు.

అపరిచిత ప్రకటనలను నమ్మొద్దు

ఇంటి వద్ద నుంచే పని చేయండి..మీకు ఆక్షణీయమైన జీతం ఇస్తామంటే.. అందులో మోసం ఉన్నట్టే లెక్క. ఒక వ్యక్తికి రూ.వేలలో జీతం చెల్లిస్తున్నారంటే.. అతని పనితీరు బాగుంటేనే ఇస్తారు. అదేమీ లేకుండా, విద్యార్హతలు లేకపోయినా కంప్యూటర్‌ పని వస్తే చాలని అంటున్నారంటే.. అనుమానించాల్సిందే. రిజిస్ట్రేషన్‌ పేరిట చరవాణి నెంబర్లు, బ్యాంకు ఖాతా నెంబర్లు అడిగారంటే.. మోసం చేసేందుకే అని గుర్తించమంటున్నారు పోలీసు అధికారులు. ఫేస్‌బుక్‌ల్లో ఇలాంటి మోసపు ప్రకటనలు వస్తుంటాయి. ఇటీవల విజయవాడలో వెలుగు చూసిన పలు సైబర్‌ నేరాల్లో ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోయిన వారే అధికంగా ఉన్నారు.

లింక్‌లు క్లిక్‌ చేయవద్దు...

చరవాణులు, మెయిల్స్‌కు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను అసలు క్లిక్‌ చేయవద్దంటున్నారు సైబర్‌ నిపుణులు. వాటిని క్లిక్‌ చేస్తే చరవాణితో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలను సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయని హెచ్చరిస్తున్నారు. మీ చరవాణికి మేసేజ్‌ రాకుండానే, మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తారని చెబుతున్నారు.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను నమ్మొద్దు. చరవాణులు, మెయిల్స్‌కు వచ్చే లింక్‌లను క్లిక్‌ చేయకూడదు. సైబర్‌ నేరగాళ్లు కొందరు మోసం చేయాలనే ఉద్దేశంతో ఇలా పంపిస్తున్నారు. ఆయా లింక్‌లను క్లిక్‌ చేస్తే మీ వివరాలు సైబర్‌ నేరగాళ్లకు తెలిసిపోతాయి. మీకు తెలియకుండానే మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ మోసానికి గురైతే త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తద్వారా మీ సొమ్మును వెనక్కి తీసుకువచ్చేందుకు వీలుంటుంది. - కాంతిరాణా టాటా, పోలీస్‌ కమిషనర్‌

.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.