ETV Bharat / state

భారీ వరదలకు నీట మునిగిన పంటలు..

author img

By

Published : Oct 18, 2020, 4:22 PM IST

భారీ నష్టం కృష్ణా జిల్లా రైతుల్ని చిదిమేసింది. ప్రకాశం బ్యారేజీ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు వదలటంతో లంక గ్రామాల పొలాలన్నీ నీట మునిగాయి. వరుసగా 6 సార్లు వరద పోటెత్తటంతో అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది.

భారీ వరదలకు పంటలు అతలాకుతలం.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపలు
భారీ వరదలకు పంటలు అతలాకుతలం.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపలు

వరుస విపత్తులతో కృష్ణా జిల్లా రైతులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. స్వల్ప వ్యవధిలోనే వరదలు పంటల్ని ముంచెత్తుతుండటంతో అన్నదాతలు భారీగా నష్టపోయారు. 3 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో ప్రకాశం బ్యారేజీ దిగువున నదికి ఆనుకుని ఉన్న పంటపొలాలన్నీ నీట మునిగాయి. వేలాది ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. కొందరు ఈ ఏడాదే 2 పంటలు నష్టపోయిన వారుంటే.. అనేక మంది గత ఏడాదితో పాటు ఈసారీ తీవ్రంగా నష్టపోయారు.

యనమలకుదురు నుంచి అవనిగడ్డ వరకు

ప్రకాశం బ్యారేజీ దిగువన యనమలకుదురు నుంచి అవనిగడ్డ వరకు దాదాపు 60 కిలోమీటర్ల మేర కరకట్ట వెంట వేలాది ఎకరాల పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాణిజ్య పంటలతో పాటు ఉద్యానపంటలు వేసిన రైతులూ తీవ్రంగా నష్టపోయారు. అరటి, పసుపు, తమలపాకు, వరి, కంద, మినుము, చెరుకు వంటి పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు మూడు రోజుల నుంచి పొలాల్లోనే నీరు నిలవటంతో ఇక పంట ఎందుకూ పనికిరాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అనేక చోట్ల పొలాల్లో పీకల్లోతు నీరుండటంతో అది ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలీని దుస్థితి నెలకొంది.

50శాతానికి పైగా పోతేనే..

గత ఏడాది ఇదే తరహాలో పంటలను వరదలు ముంచెత్తినా ఇప్పటికీ ఎలాంటి పరిహారమూ రైతులకు అందలేదు. 50 శాతం పైబడి నష్టపోయిన పంటలనే అధికార యంత్రాంగం పరిగణనలోకి తీసుకుని లెక్కలు రాసుకుంది. ఫలితంగా తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లినా పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల్లో గత ఏడాది కేవలం 1200 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. ఆ పరిహారం కూడా ఇంతవరకూ రైతులకు అందలేదు.

3 మండలాలు.. 3 వేల ఎకరాలు..

తాజా వరదలతో పూర్తి స్థాయి పంటనష్టం ఈ మండలాల్లోనే సుమారు 3 వేల ఎకరాల వరకూ ఉంటుందని వ్యవసాయ అధికారుల అంచనా.

కౌలు రైతు కన్నీటి వ్యధ..

పంట నష్టపోయిన రైతుల్లో అధిక శాతం కౌలు రైతులే ఉన్నారు. భూ యజమానులు తాము కౌలు చేసే రైతు పేరు అధికారుల ముందు చెప్పేందుకు సిద్ధపడుతున్నా.. లిఖితపూర్వకంగా ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తీసుకురావటంతో కౌలు రైతులకు సరైన న్యాయం జరగట్లేదు. పెట్టుబడి, కౌలు డబ్బు మొత్తం అప్పు తెచ్చి కట్టడం తప్ప తమకు మిగిలేదమీ లేదని కౌలు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

నడుము లోతు నీటిలో..

చేతికందిన పంటను కోల్పోవటం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ పంటలపై వేల రూపాయలు వెచ్చించటంతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. పాడైపోయిన పంటను తీసేసి మళ్లీ పంట వేద్దామన్నా విత్తనం దొరికే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. నడుము లోతు నీళ్లలో దిగి మరీ నీట మునిగిన పంటను చూస్తూ దిగులు చెందుతున్నారు.

ఇవీ చూడండి :

శరన్నవరాత్రులు.. నర్సీపట్నం నుంచి ప్రత్యేక బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.