తేలాల్సిన ఎసైన్డ్ భూముల లెక్కలు - మభ్యపెట్టి బుట్టలో వేసుకున్న వైసీపీ నేతలు

తేలాల్సిన ఎసైన్డ్ భూముల లెక్కలు - మభ్యపెట్టి బుట్టలో వేసుకున్న వైసీపీ నేతలు
20073859 YSRCP Government Stance on Assigned Lands: ఎసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తా అని గొప్పలకు పోయిన ముఖ్యమంత్రి జగన్ కాకమ్మ కథలు చెప్తున్నారు. 27 ఎకరాలకు హక్కులు కల్పిస్తున్నామని ప్రకటించిన సీఎం.. తాజా లెక్కల్లో 10.58 లక్షల ఎకరాలకు మాత్రమే అర్హులను గుర్తించారు. మిగిలిన 17 లక్షల ఎకరాల భూ వివరాలు కనిపించని పరిస్థితి నెలకొంది. పేదలను మభ్యపెట్టి వైసీపీ నేతలు భూములను తక్కువ ధరకే కొట్టేశారు
YSRCP Government Stance on Assigned Lands: సీఎం జగన్ ప్రచారానికీ క్షేత్రస్థాయిలో ఫలితాలకూ సంబంధం లేకుండా పోయింది. ఎసైన్డ్ భూములు పొంది 20 సంవత్సరాలు దాటిన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గత ఆగస్టు నుంచి రికార్డుల పరిశీలన ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు కొలిక్కిరాలేదు. దాదాపు 17 లక్షల ఎకరాల భూముల వివరాలు కనిపించడం లేదు. చాలా వరకు కేటాయింపులు జరిగిన దానికంటే జిల్లాల్లో అర్హులు తక్కువగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లోనైతే మండలాలవారీగా అర్హులైన లబ్ధిదారులు లేనేలేరు.
ఎసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామంటూ సీఎం జగన్ కాకి లెక్కలు చెప్తున్నారు. 27.14 లక్షల ఎకరాలకు సంబంధించి 15.21 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని ఇటీవల నూజివీడులో సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. అయితే అర్హులను గుర్తించకపోవడంతో ప్రస్తుతం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ప్రభుత్వ పరిస్థితి అయింది.
తాజా లెక్కల ప్రకారం.. 10.58 లక్షల ఎకరాల భూములకు మాత్రమే అర్హులు ఉన్నారు. మిగిలిన దాదాపు 17 లక్షల ఎకరాల భూముల వివరాలు కనిపించడం లేదు. అసలు 11.61 లక్షల ఎకరాలు ఎసైన్డ్ కేటగిరిలోనే లేవు. చాలా భూములను రెవెన్యూ సిబ్బందిని మభ్యపెట్టి.. ఆన్లైన్లో మార్పులు చేయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాకుండా 6.18 లక్షల ఎకరాలకు సంబంధించిన భూ రికార్డుల్లో అనుభవదారు లేదా వారసుల పేర్లు లేనే లేవు.
మరో 30 వేల ఎకరాలు ఎవరివో తెలియని పరిస్థితి. కొన్ని భూములు చెరువులు, కుంటల పరిధిలో ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వం ఘనంగా పేర్కొన్నట్లు 15.21 లక్షలమందికి బదులు కనీసం ఐదారు లక్షలమందికైనా యాజమాన్య హక్కులు (ownership rights on assigned lands ) లభిస్తాయా అనేది సందిగ్ధమే.
గుంటూరు జిల్లాలో 6 వేల 518 ఎకరాలకు 648 ఎకరాలను.. విశాఖ జిల్లాలో 3 వేల 37కు 666 ఎకరాలను మాత్రమే ఇప్పటి వరకు గుర్తించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి, గార్లదిన్నె, ధర్మవరం, ఉమ్మడి కడప జిల్లా కాశినాయన, కలసపాడు, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, ఉమ్మడి కృష్ణా జిల్లా అయినంపూడి, ఇలపర్రు, పోలకొండ, నందివాడ, ఏలూరు జిల్లా దోసపాడు తదితర ప్రాంతాల్లో ఎసైన్డ్ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి చేరాయి.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని గిరిజనుల్లో 50శాతం మంది లబ్ధిదారులు భూమిపై ఉన్నారు. అడవుల సమీపంలో, సాగుకు పనికిరాని భూములు మాత్రమే అనుభవదారుల చేతుల్లో ఉన్నాయి. పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు కాలక్రమేణా పెరిగాయి. దీంతో అభివృద్ధి చెందిన కొన్ని ప్రాంతాల్లోని ఎసైన్డ్ భూములు 70శాతం వరకు అనధికారికంగా చేతులు మారాయి. పరాధీనమైన భూముల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ఈ పథకం కింద అర్హుల సంఖ్య పెంచేందుకు ఉన్న మార్గాల గురించి సమాలోచనలు జరుగుతున్నాయి.
