ETV Bharat / state

ఆంధ్రావాళ్లని మాట్లాడుతున్నారు.. కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా?: షర్మిల

author img

By

Published : Dec 1, 2022, 4:10 PM IST

Sharmila fires on CM KCR: ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా పాదయాత్ర చేసి తీరతామని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ ఆదేశాలపైనే తనను అరెస్టు చేశారన్న షర్మిల.. దాడి ఘటనను తెలంగాణ గవర్నర్​కు వివరించారు. కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. మద్యం స్కామే కాదు.. కేసీఆర్‌ కుటుంబం చేసిన అన్ని బయటికి వస్తాయని షర్మిల ఆరోపించారు.

కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా?: షర్మిల
కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా?: షర్మిల

Sharmila fires on CM KCR: వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తెరాస సర్కార్​, సీఎం కేసీఆర్​ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్ని రకాలుగా అడ్డుకున్నా పాదయాత్రలో ముందుకే వెళ్తామని షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. తనపై జరిగిన దాడి ఘటనను ఆమె గవర్నర్​కు వివరించారు. కావాలనే శాంతి భద్రతల సమస్య సృష్టించి.. తనను అరెస్టు చేస్తే పాదయాత్ర ఆగిపోతుందనుకున్నారని షర్మిల పేర్కొన్నారు.

కవిత, కేటీఆర్ ఇళ్లపై దాడులు చేయాలి.. కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు దోచేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కవిత, కేటీఆర్ ఇళ్లపై దాడులు చేయాలన్న ఆమె.. ప్రగతి భవన్‌లో సోదాలు చేస్తే వేల కోట్లు దొరుకుతాయని పేర్కొన్నారు. పేదలకు రెండు పడకగదుల ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. పాఠశాలల్లో పిల్లలకు కనీసం భోజనం పెడుతున్నారా అని నిలదీశారు. అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా అని ఆమె మండిపడ్డారు. ఏమిలేని టీఆర్ఎస్ నాయకులకు వందల కోట్లు ఎలా వచ్చాయని మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే ధైర్యం లేదని షర్మిల వ్యాఖ్యానించారు.

'ఆంధ్రావాళ్లని మాట్లాడుతున్నారు.. కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా? కేటీఆర్‌ భార్యను విడాకులు తీసుకోవాలని అడుగుతున్నామా? కేటీఆర్‌ భార్యను గౌరవించినప్పుడు.. నన్ను కూడా గౌరవించాలి. నేను ఇక్కడే పెరిగాను... ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే పెళ్లి చేసుకున్నాను... ఇక్కడే బిడ్డకు జన్మనిచ్చాను. నా గతం ఇక్కడే...నా భవిష్యత్‌ ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడం నా బాధ్యత. నాకు, నా మనుషులకు ఏది జరిగినా బాధ్యత కేసీఆర్‌దే. ప్రజల కోసమే రాజన్న బిడ్డగా పాదయాత్ర చేస్తున్నాను.'-వైఎస్ షర్మిల, వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు

కేసీఆర్‌ కుటుంబం తిన్న తెలంగాణ ప్రజల సొమ్మంతా కక్కించాలి.. తెరాస మునుగోడు, హుజురాబాద్‌లో ఎంత ఖర్చు పెట్టారో విచారణ జరగాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రతి తెరాస మంత్రులు, నేతలపై విచారణ చేయాలని వ్యాఖ్యానించారు. దాడులు తప్పవని బెదిరిస్తున్నారన్న ఆమె.. తమపై దాడులు చేసేందుకు తెరాస వాళ్లు సంసిద్ధులయ్యారని పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఇక్కడి పరిస్థితులు సుప్రీంకోర్టు, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. భాజపాతో డ్యూయెట్లు పాడింది కేసీఆరే కదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబం తిన్న తెలంగాణ ప్రజల సొమ్మంతా కక్కించాలని ఆరోపించారు. ఇక్కడ ఉన్నది బందిపోట్ల రాష్ట్ర సమితి అని విమర్శించారు. మద్యం స్కామే కాదు... కేసీఆర్‌ కుటుంబం చేసిన అన్ని బయటికి వస్తాయని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.