ETV Bharat / state

R5 Zone Issue: ఆర్‌ 5 జోన్‌పై సుప్రీంకోర్టుకు రైతులు.. వచ్చేవారం విచారణ

author img

By

Published : May 8, 2023, 12:43 PM IST

R5 Zone Issue: ఆర్‌ 5 జోన్‌పై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాజధాని అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై వచ్చేవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై వెంటనే విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు.

R5 Zone Issue
ఆర్‌ 5 జోన్‌

R5 Zone Issue: ఆర్‌ 5 జోన్‌పై దాఖలైన పిటిషన్లపై వచ్చేవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాజధాని అమరావతి రైతులు స్పెషల్​ లీవ్​​ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై వెంటనే విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు న్యాయవాదులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్‌ 5 జోన్ పిటిషన్లపై వచ్చేవారం విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రకటించారు.

తొలుత హైకోర్టు ఏం చెప్పిందంటే: ఆర్‌-5 జోన్‌పై రైతులు వేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఇళ్ల స్థలాల పంపిణీ అనేది తుది తీర్పునకు లోబడి ఉండాలని తెలిపింది. ఇందులో భాగంగా స్థానికేతరులకు పట్టాలు ఇవ్వడంపై రైతుల అనుబంధ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. అమరావతిలో 1,100 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సీఆర్‌డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి ఎందుకు చేయడం లేదని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజధాని భూములపై వేరేవారికి హక్కులు కల్పించకుండా ఆదేశించాలని.. జీవో 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రాజధాని రైతులు పిటిషన్‌ వేశారు. ఈ మేరకు రైతులు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం ఈ విధంగా తీర్పుని ఇచ్చింది.

హైకోర్టు తీర్పు తర్వాత.. వేగం పెంచిన ప్రభుత్వం: హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆర్ 5జోన్​లో ఇళ్ల స్థలాల మార్కింగ్ చేపట్టారు. సుమారు 100 మంది సిబ్బంది కృష్ణాయపాలెంలోని 3 లే ఔట్లలో 9వేల ఇళ్ల స్థలాలకు మార్కింగ్, హద్దురాళ్లు పాతే పనులను ప్రారంభించారు. ఇళ్ల స్థలాల్లోని ముళ్ల కంపను తగులబెట్టారు. పిచ్చి మొక్కలు తొలగించారు. 7 రోజుల్లో ఇళ్ల స్థలాల పనుల మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈనెల 15లోపు లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.

సుప్రీంకు రాజధాని రైతులు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే కోరుతూ.. రాజధాని రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్-5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలను కేటాయించడంపై సుప్రీంకోర్టులో స్పెషల్​ లీవ్​​ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ 5 జోన్ విషయంలో విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేసేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ రైతులు కోరారు.

ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు: రాజధానిలో ఆర్-5 జోన్​లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ రైతులు నిరసనలు చేస్తున్నారు. రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వ అనుసరిస్తున్నా తీరు ఖండిస్తూ రాజధాని గ్రామాల్లో అన్నదాతలు నిరసనలు చేపడుతున్నారు. ఆర్​5 జోన్‌కు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను తీవ్రతరం చేస్తున్నారు. ఆర్​5 జోన్ రద్దయ్యేంతవరకు ఎన్ని రోజులైనా నిరసనలు కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.