ETV Bharat / state

పోలీసుల హైడ్రామా మధ్య జనభేరి సభకు చంద్రబాబు!

author img

By

Published : Dec 17, 2020, 1:03 PM IST

Updated : Dec 17, 2020, 2:21 PM IST

ఉద్దండరాయునిపాలెం వెళ్లుతున్న తెదేపా అధినేత చంద్రబాబును.. వెలగపూడి వద్ద పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. పోలీసులతో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ చర్చలు జరిపిన అనంతరం.. ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రదేశాన్ని చంద్రబాబు సందర్శించి.. అనంతరం రాయపూడి సభకు చేరుకున్నారు.

police-intercepted
police-intercepted

పోలీసుల హైడ్రామా మధ్య జనభేరి సభకు చంద్రబాబు!

ఐదుకోట్ల మంది ఆంధ్రుల తరుపున విజయవాడ కనకదుర్గమ్మను తన ప్రజలను కాపాడుకోవాలని కోరినట్లు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. అమరావతి ప్రాంతంలో ఒకేరాష్ట్రం - ఒకే రాజధాని నినాదంతో చేస్తోన్న ఆందోళనలు ఏడాది అయిన సందర్భంగా.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో సురేష్‌బాబు ఆయనకు స్వాగతం పలికారు. న్యాయం, ధర్మాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు.

అమరావతి దేవతల రాజధాని అని రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగేలా అమ్మవారి ఆశీస్సులు అందించాలని కోరుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రజారాజధాని అమరావతి అందరికల అన్న చంద్రబాబు.. దానిని విధ్వంసం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఎన్నో విధాలుగా దాడులు చేసినా అమరావతిని కాపాడుకునేందుకు ఏడాదిగా పోరాడుతున్నారని అన్నారు. వారి ఆకాంక్షలను అమ్మవారు నెరవేర్చాలని కోరుకున్నానని తెలిపారు. న్యాయం, ధర్మం గెలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

కనకదుర్గమ్మ దర్శనం అనంతరం ఉద్దండరాయునిపాలెం బయలుదేరిన చంద్రబాబు పర్యటనలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరకట్టమీద నుంచి కాకుండా చంద్రబాబు రాజధాని ఉద్యమం సాగిన గ్రామాల మీదుగా ఆయన ఉద్దండరాయునిపాలేనికి బయలుదేరారు. రైతుల ఉద్యమాలు చేపట్టిన పెనుమాక, కృష్ణాయలపాలెం, మందడం, వెలగపూడి దీక్షాశిబిరాలమీదుగా వెళ్తున్న చంద్రబాబును మల్కాపురం-వెలగపూడి జంక్షన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఉద్దండరాయునిపాలేనికి అనుమతి లేదంటూ రహదారివద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కాఆనంద్‌బాబులు పోలీసులతో చర్చలు జరిపారు. శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని తాము పవిత్రస్థలంగా భావిస్తున్నందున శాంతియుతంగా అక్కడకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. సుదీర్ఘ చర్చల అనంతరం చంద్రబాబు కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలను మాత్రమే ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు అనుమతించారు. వీఐపీ వాహనం వెనుక ఉన్న ఎస్కార్ట్‌ వాహనాలను సైతం పోలీసులు ఆపేయడంతో జడ్‌ప్లస్‌ భద్రత వలయంలో ఉన్న కాన్వాయ్‌లో గందరగోళం నెలకొంది. దీంతో ఎస్కార్ట్‌ సఫారి వాహనాలు మార్గమధ్యలో ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు ప్రయత్నం చేసినా.. ఎక్కడికక్కడ పోలీసులు వాహనాలను అడ్డుగాపెట్టి రహదారులను దిగ్భందం చేశారు. చంద్రబాబు ఎస్కార్ట్‌ సిబ్బంది సైతం ఆ వాహనాల్లోనే ఉండిపోవడంతో కొద్దిపాటి ఎన్‌ఎస్‌సీ భద్రతతోనే ఉద్దండరాయునిపాలెంను చంద్రబాబు సందర్శించారు. అనంతరం రాయపూడి సభకు చంద్రబాబు చేరుకున్నారు.

ఇదీ చదవండి: ఉక్కు పాదాల కిందే..ఉవ్వెత్తున ఉద్యమజ్వాల

Last Updated : Dec 17, 2020, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.