ETV Bharat / state

మునుగోడులో తారస్థాయికి చేరిన ప్రచారం.. రంగంలోకి ప్రధాన నేతలు..!

author img

By

Published : Oct 23, 2022, 8:45 PM IST

Munugode Bypoll: తెలంగాణాలోని మునుగోడు ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాయి. నియోజకవర్గంలోని ప్రతీ ఓటరును కలిసేలా ఇంటింటి ప్రచారం, రోడ్‌ షోలు, ఆత్మీయ సమ్మేళనాలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉపఎన్నికలో గెలిపిస్తే మునుగోడుకు మహర్దశ కలిగిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ప్రధాన పార్టీల రాష్ట్ర నాయకత్వమంతా మునుగోడులోనే మోహరించారు. చరిత్రలో నిలిచేలా తమకు అనుకూలమైన తీర్పు ఇవ్వాలంటూ అన్ని పార్టీల నేతలు అభ్యర్థిస్తున్నారు.

Munugode Bypoll
మునుగోడులో తారస్థాయికి చేరిన ప్రచారం

Munugode Bypoll: మునుగోడు ఉపపోరులో పార్టీల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. పోలింగ్‌కు పదిరోజులు గడువే ఉండడంతో... నేతలంతా విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పల్లెపల్లెన మోహరించిన నేతలు... ఇంటింటి ప్రచారం సాగిస్తుండగా రాష్ట్రస్థాయి నాయకత్వం గెలుపుకోసం సామాజికవర్గాల వారీగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కూసుకుంట్లను గెలిపించాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. భాజపా అభ్యర్థికి కోమటిరెడ్డికి ఓటేయాలంటూ కిషన్‌ రెడ్డి, ఈటల, బండి సంజయ్‌ అభ్యర్థిస్తున్నారు. పాల్వాయి స్రవంతికి పట్టం కట్టాలంటూ స్థానిక నేతలతో పాటు జానారెడ్డి విజ్ఞప్తి చేశారు.

మునుగోడు తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా చండూరు మండలం శిర్ధేపల్లిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. మహిళలు కోలాటం వేస్తూ బతుకమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. గల్లీగల్లీలో తిరుగుతూ తెరాసకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. చండూర్ మండలం ఉడుతాలపల్లి, పడమటితాళ్ల, కాస్తాల, శిర్దేపల్లిలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. రాజగోపాల్‌రెడ్డి ఏనాడు కూడా నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.

తెరాస ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా... భాజపా గెలుపు ఖాయం.. మునుగోడు ఉపఎన్నిక న్యాయానికి-అన్యాయానికి, ధర్మానికి-అధర్మానికి మధ్య జరుగుతోందని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడు మండలం రతిపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మద్యం, మాంసం, మనీ అక్రమంగా పంచుతూ ఎలాగైనా గెలవాలని తెరాస చూస్తోందని ఆరోపించారు. తెరాస సర్కార్ తప్పుడు విధానాల ద్వారా మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం అప్పులపాలైందని మండిపడ్డారు. మునుగోడు ఓటర్లను తెరాస ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా... భాజపా గెలుపు ఖాయమని... సర్వేలు అదే చెబుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నాగోల్‌లో మునుగోడు ఓటర్లతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందుతుందని... రాత్రికి రాత్రి రోడ్లు వేశారని నేతలు స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యం నిలవాలంటే కాంగ్రెస్‌ను బతికించాలి.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస, భాజపా కార్యకర్తలు మధ్య వాగ్వాదం జరిగింది. పెట్రో ధరలు పెంచిన భాజపాను ఓడించాలని.. గ్యాస్ సిలిండర్‌తో తెరాస కార్యకర్తలు నినాదాలు చేయగా... వారికి వ్యతిరేకంగా తెరాసను ఓడించాలంటూ భాజపా కార్యకర్తలు ప్రతి నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని... ఆ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం నిలవాలంటే కాంగ్రెస్‌ను బతికించాలని కోరారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో పార్టీ అభ్యర్థి స్రవంతికి మద్దతుగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

కేసీఆర్‌ను ఓడిద్దాం నిరుద్యోగుల జీవితాలు కాపాడుకుందాం.. కాంగ్రెస్ కార్యకర్తలపై భాజపా కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ నాంపల్లి అంబేడ్కర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నైతికంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే భాజపా వ్యవహరిస్తోందని పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. కార్యకర్తలకు మద్దతుగా స్రవంతి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో ఓయూ ఐకాస విద్యార్థి నేతలు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా వినూత్న ప్రచారం చేశారు. మెడలో తాడు వేసుకోని ప్లకార్డులతో కేసీఆర్‌ను ఓడిద్దాం... నిరుద్యోగుల జీవితాలు కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.