ETV Bharat / state

Remand report: సులభంగా డబ్బు సంపాదించాలనే...మాదక ద్రవ్యాలు సరఫరా

author img

By

Published : Apr 6, 2022, 8:47 PM IST

Pub case remand report
పుడింగ్ పబ్ కేసులో రిమాండ్ రిపోర్టు

Pub case remand report: పుడింగ్ పబ్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్.. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Hyderabad Drug Case: పుడింగ్ పబ్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్.. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పుడింగ్ పబ్​లో రోజూ తెల్లవారుజామున 4 వరకు మద్యం, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం 3వ తేదీ తెల్లవారుజామున పబ్ పై దాడిచేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కౌంటర్ వద్దకు వెళ్లారు.

అక్కడ ఉన్న ట్రైలలో స్ట్రాలు, టిష్యు పేపర్లు, టూత్ పిక్స్​ను గమనించారు. అదే ట్రేలో 5 అనుమానాస్పద ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో తెల్లటి పౌడర్​ను గమనించిన పోలీసులు స్వాధీనం చేసుకొని పరీక్షించగా కొకైన్​గా తేలింది. 4.6 గ్రాముల కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. లాప్ టాప్, ప్రింటర్, వెయింగ్ మిషన్​తో పాటు ప్యాకింగ్ మెటీరియల్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ పబ్ మేనేజర్ అనిల్ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుసుకొని అతన్ని ప్రశ్నించారు. అనిల్ ఇచ్చిన సమాచారం మేరకు పబ్ నిర్వాహకుడు అభిషేక్​ను పిలిపించారు.

ఇద్దరినీ ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసి వాళ్ల వద్ద ఉన్న చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. పబ్​లో కిరణ్ రాజు, అర్జున్ వీరమాచినేని కూడా భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాళ్లపైనా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పామ్ అనే యాప్​లో రిజిస్ట్రర్ చేసుకున్న వాళ్లకే పబ్​లో అనుమతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.50వేల రుసుము కడితేనే యాప్​లో లాగిన్ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

3వ తేదీ జరిగిన పార్టీలో వేర్వేరు బృందాలుగా ఏర్పడి దాదాపు 150మంది వరకు పబ్​కు వచ్చారు. వీళ్లలో ఏ బృందం కొకైన్ తీసుకుందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనిల్, అభిషేక్​లను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మాదక ద్రవ్యాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.