ETV Bharat / state

మట్టి మాటున విధ్వంసం.. 'భూమాతకు తూట్లు... అక్రమార్కులకు రూ.కోట్లు!'

author img

By

Published : Jan 31, 2023, 7:26 AM IST

ILLEGAL SOIL MINING IN GUNTUR : అడ్డగోలు తవ్వకాలతో.. అక్రమార్కుల బరితెగింపుతో.. భూమి బద్దలవుతోంది. పచ్చని పంటపొలాలు పాడవుతున్నాయ్. రోడ్లు ఛిద్రమవుతున్నాయ్. ప్రజల ప్రాణాలు పోతున్నాయ్. ఊళ్లు విలవిల్లాడుతున్నాయ్. అడిగితే తంతాం.. ఇదేంటని ప్రశ్నిస్తే ఎదురుకేసులు పెడతాం. ఇదీ.. అధికారం అండతో గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతున్న తీరు. నిబంధనలకు పాతరేసి... ప్రకృతి సంపదను కొల్లగొడుతుంటే... అడ్డుకోవాల్సిన అధికారులు జీహుజూర్‌ అంటున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో మట్టి దొంగల ఆగడాలపై... ఈటీవీ-ఈటీవీ భారత్​ పరిశీలనాత్మక కథనం.

ILLEGAL MINING IN GUNTUR
ILLEGAL MINING IN GUNTUR

ILLEGAL MINING IN GUNTUR : పాతాళం లోతు ఎంతంటే చెప్పడం కష్టం కావచ్చు గానీ.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో సాగుతున్న విచ్చలవిడి అక్రమ మైనింగ్ ప్రాంతాలను పరిశీలిస్తే మాత్రం.. బహుశా ఇలాగే ఉంటుందేమో అనిపించకమానదు. మండల పరిధిలోని శేకూరు, శలపాడు, సుద్దపల్లి, వీరనాయనిపాలెం, వడ్లమూడిలో అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్న అక్రమార్కులు.. గ్రామాలను సర్వనాశనం చేస్తున్నారు. అయినా అడిగే నాథుడే లేడు. మట్టి తవ్వకాలపై నిఘా పెట్టాల్సిన గనులశాఖ.. సిబ్బంది కొరత పేరిట చేతులెత్తేసింది. స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన కరవైంది. ఇంకేముంది.. ఎమ్మెల్యే మా వెనుకున్నారంటూ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అనకొండల్లా ఎర్రమట్టిని మింగేస్తున్నారు.

చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎర్రనేల భూములున్నది చేబ్రోలు మండలంలోనే. అందుకే ఇక్కడి మట్టికి డిమాండ్ ఎక్కువ. ఇదే అదునుగా మట్టి మాఫియా ఇక్కడి గ్రామాలపై పడింది. ప్రైవేటు భూములను ఎకరా 40 లక్షల చొప్పున కొనేస్తున్న మాఫియా గ్యాంగ్‌... మైనింగ్ సహా ఇతర సమస్యలు రాకుండా ప్రజాప్రతినిధికి ముడుపులు ముట్టజెబుతున్నారు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్లు... భారీ యంత్రాలతో అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.

"నాకు పూర్వీకుల నుంచి వచ్చిన 80 సెంట్ల పొలం ఉంది. సపోటా తోట వేసుకుని జీవిస్తున్నా. మట్టి తవ్వకం కోసం భూమిని అమ్మాలని కొందరు బెదిరిస్తున్నారు. అమ్మేది లేదని చెప్పా. నీ పొలానికి నీళ్లు ఎలా వస్తాయో చూస్తామని హెచ్చరిస్తున్నారు. మా గ్రామాన్ని ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఏం చేయాలనుకుంటున్నారు? ఊళ్లోవాళ్లు బతకాలా... వద్దా?"-గాలి నిర్మల, శేకూరు, చేబ్రోలు మండలం

మట్టి తరలించి కోట్లు కొల్లగొడుతున్నారు. వంద అడుగులు దాటి మరీ తవ్వేసిన చోట్ల ఊట ఉబికి వస్తే... ట్రాక్టర్‌ ఇంజిన్లతో నీటిని తోడేసి... మళ్లీ పని మొదలుపెడతున్నారు. ఈ దారుణాలతో ఊళ్లు నాశనమవుతున్నాయంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగితే... పోలీసులతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మట్టి లారీలను అడ్డుకుంటే.. దాడులకూ తెగబడుతున్నారు. అంతటితో ఆగకుండా.. ఎదురుకేసులతో వేధిస్తున్నారు.

"రాత్రీపగలూ మట్టిని తవ్వి తరలిస్తున్నారు. మురుగునీటి కాలువ కట్టపై భారీ లారీలు తిరగడంవల్ల అది దెబ్బతింది. ఆ కట్ట తెగితే మా పొలాలు మునుగుతాయి. పంటలకు పూత, కాత వచ్చినా ధూళి పడి కాయలు చేతికి రావడం లేదు. బోరుబావులు ఎండి అవస్థలు పడుతున్నాం"-మైలా వెంకటరామరాజు, శలపాడు

అడ్డూఅదుపు లేని మట్టి తవ్వకాలతో గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. మట్టి తరలిస్తున్న భారీ వాహనాల ధాటికి రోడ్లు ఛిద్రమవుతున్నాయి. దుమ్మూ ధూళి పొలాలపై పడి... పంటలు దెబ్బతింటున్నాయి. మట్టి తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో వాన నీళ్లు నిలిచి... అందులో పడిన పశువుల ప్రాణాలు పోతున్నాయి. ఇంత జరుగుతున్నా, అధికారులకు విన్నవించుకున్నా ఫలితం మాత్రం ఉండటం లేదన్నది బాధిత ప్రజల ఆవేదన.

"అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. భారీ తవ్వకాలవల్ల ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. మట్టి తవ్వకాలతో గాలిలో దుమ్మూధూళి చేరి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వశాఖలు స్పందించకపోవడం దారుణం"-వీరంకి రంగారావు, విశ్రాంత జియాలజిస్టు, వడ్లమూడి

ఇక్కడి పొలాలపై మట్టి మాఫియా కన్ను పడిందంటే... వారి సొంతం కావాల్సిందే. సాహసించి ఎవరైనా ఇవ్వడం కుదరదంటే... బెదిరింపులు మామూలుగా ఉండవు. చేబ్రోలు మండలంలో సాగుతున్న అడ్డగోలు తవ్వకాలతో... పెనుముప్పు పొంచి ఉందని జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.