ETV Bharat / state

రెండేళ్ల చిన్నారిని చంపిన తండ్రి.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, యువతి మృతి

author img

By

Published : May 29, 2023, 10:15 PM IST

Updated : May 29, 2023, 10:36 PM IST

Crime News
నేర వార్తలు

AP Crime News: మద్యం మత్తులో కన్న తండ్రే.. రెండేళ్ల చిన్నారిని కొట్టి చంపిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో.. ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నం చేశారు. వీరి శరీరంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోనసీమ జిల్లాలో.. టీడీపీ నాయకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం పూర్తిగా చదివేయండి.

AP Crime News: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో రెండేళ్ల చిన్నారి లక్ష్మీపద్మను తండ్రి మునగాల గోపి నేలకేసి కొట్టి హత్య చేశాడు. మునగాల గోపికి మంగళగిరికి చెందిన మౌనికతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆరు నెలల క్రితం రెండో కుమార్తెకు మౌనిక జన్మనిచ్చింది. అప్పట్నుంచి తరచుగా భార్యతో గోపి గొడవపడుతున్నాడని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో సోమవారం పూటుగా మద్యం సేవించిన గోపి.. భార్యతో ఘర్షణకు దిగారు. మధ్యలో అడ్డు వచ్చిన రెండేళ్ల చిన్నారి లక్ష్మీ పద్మను నేలకేసి కొట్టడంతో స్పృహ తప్పిపడిపోయింది. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని తల్లి మౌనిక విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయింది. తండ్రి గోపిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నం.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ లాడ్జిలో ప్రేమికులు కత్తిపోట్లకు గురి కావడం జిల్లాలో సంచలనం కలిగించింది ఈ సంఘటనలో యువతి లాడ్జిలో మృతి చెందగా.. యువకుడు కొన ఊపిరితో అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాజువాక గ్రామానికి చెందిన యువకుడు రాంబిల్లి మండలం సచివాలయంలో పని చేస్తున్న యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఈరోజు అచ్యుతాపురంలోని లాడ్జిలో ఒక రూమ్ తీసుకున్నారు. ప్రియుడే ప్రియురాలిని కత్తితో పొడిచి చంపి.. తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. యువతీ మృతదేహాన్ని మార్చురీకి,.. గాయపడిన యువకుడిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ వివాహం చేసుకున్నారా లేదా వివాహం విషయమై గొడవ జరిగిందా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన యువతిది కూర్మన్నపాలెం గ్రామం కాగా... యువకుడు గాజువాక ప్రాంతంలోని అరుణోదయ కాలనీకి చెందినవాడు. వీరిద్దరూ గాజువాక సమీపానికి చెందినవారే కావడంతో గాజువాక పోలీసులను అప్రమత్తం చేశారు. యువతి మెడపై కత్తితో కోసిన గాయాలు ఉన్నాయి. యువకుడు పొట్టపై కత్తిపోట్లు కనిపించాయి. పరవాడ డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన యువతి ఎస్ మహాలక్ష్మిగా,.. చికిత్స పొందుతున్న యువకుడు మాడెం శ్రీనివాస్ కుమార్​గా గుర్తించారు. అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అకస్మాత్తుగా భర్త మృతి.. ఇంట్లోనే దహనం చేసిన భార్య

రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతి.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం నాయకుడు రామాంజనేయులు మృతి చెందారు. అమలాపురం రూరల్ మండలానికి చెందిన కరెళ్ల రామాంజనేయులు రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో రోడ్డుపై పడి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు.. ఆసుపత్రి వద్దకు వెళ్లిన అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, అమలాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి విచారణ వ్యక్తం చేశారు.

పిడుగు పడి బాలుడు మృతి.. నంద్యాల జిల్లా గడివేములలో పిడుగు పడి అనిరుద్ (4) అనే బాలుడు మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో తాము ఉన్న గుడిసె వద్దకు వెళుతుండగా పిడుగు పడిందన్నారు.. ఎరుకలి సామాజిక వర్గానికి చెందిన కొందరు.. స్థలాల్లో గత కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు ఈ స్థలాలను పేదలకు పంచాలని.. ఖాళీ చేయాలని అధికారులు చెప్పడంతో మరొక ప్రాంతానికి తమ వస్తువులను మార్చుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి వర్షం వచ్చింది. దీంతో తమ గుడిసెలోకి తల్లితోపాటు వెళ్తుండగా ఉన్నట్టుండి పిడుగు పడింది. ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై నిరసనకు దిగారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొడుకు తల, మొండెం వేరు చేసిన తండ్రి

భార్యని ఇంట్లోకి రానివ్వని భర్త.. భార్యని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు ఆమె భర్త. ఇందులో ఆమె అత్తమామలు కూడా అతనికి సహకరించారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని దువ్వాడలో జరిగింది.. సంవత్సరం పసిపాపతో భార్య పల్లవి ఇంటి బయటే కూర్చుంది. హిందూ సాంప్రదాయాలు పాటించకూడదని, సెల్ ఫోన్ వాడకూడదని, అమ్మనాన్నలు ఇంటికి రాకూడదని, ఫోన్​లో ఎవరితో మాట్లాడినా సరే.. తన భర్త వేధింపులు గురి చేస్తున్నాడని పల్లవి తెలిపింది. దీంతో పల్లవి దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్తను అదుపులో తీసుకున్నారు.

ఆటోలో నుంచి మంటలు.. విజయవాడలోని చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద ఒక్కసారిగా గ్యాస్ ఆటోలో నుంచి మంటలు రావడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు అప్రమత్తం కావడంతో ఫైర్ స్టేషన్​కి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీక్ అవడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదంలో ఆటో పూర్తిగా దగ్ధం అయింది.

వ్యక్తిపై కత్తులతో దాడి.. చెరువులో పడి ముగ్గురు మృతి

పట్టపగలే దొంగలు హల్​చల్​.. బాపట్ల జిల్లాలోని చీరాలలో ఫైర్ ఆఫీస్ గేట్ సమీపంలోని ఓ ఇంట్లో పట్టపగలే దొంగలు దోచుకుపోయారు. పొత్తూరి హరిబాబు క్యాటరింగ్, కర్రీస్ పాయింట్ నిర్వహిస్తున్నారు.. ఉదయం 10 గంటల సమయంలో తలుపులు వేసి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి కొద్దిసేపటి తరువాత ఇంటికి చేరుకున్నాడు.. అతని ఇంట్లో ఉన్న బీరువాలో సుమారు 25 సవర్ల బంగారు అభరణాలు, 5 వేల రూపాయల నగదును దుండగులు అపహరించుకుపోయారు. బాధితుడు చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్లూస్ టీంను రంగంలోకి దింపి నిందితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు.

డివైడర్‌ను ఢీ కొట్టిన వాహనం.. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డు 6వ మలుపు వద్ద కర్నాటక రాష్ట్రానికి చెందిన భక్తుల వాహనం డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. తిరుపతిలో దర్శనం చేసుకుని తిరగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనంలో 13 మంది ఉండగా 11 మంది గాయపడ్డారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న ఎస్పీఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన భక్తులను అంబులెన్స్ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

Last Updated :May 29, 2023, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.