పేదలకు ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్ సహా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలోని ఇళ్ల బకాయిలను చెల్లించాలని సీఎం నిర్ణయించారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 3,38,144 ఇళ్లకు రూ.1,323 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈ చెల్లింపులు చేయాలని సూచించారు. నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలన్నారు.
మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల ఇళ్ల నిర్మాణంపై సీఎం సమీక్ష జరిపారు. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్దేశిత డిజైన్లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను అడిగితెలుసుకున్నారు. డిజైన్లో భాగంగా బెడ్ రూం, కిచెన్, లివింగ్ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు ఉండేలా చూడాలని తెలిపారు. ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. గవర్నమెంటు అంటే నాసిరకం అనే పేరుపోవాలని.. గవర్నమెంట్ నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలన్నారు.
జులై 8న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ అంశంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులకు సూచించారు. వారికి కేటాయించిన స్థలం వద్దే మహిళలకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి: ముంచుకొస్తున్న 'నిసర్గ' తుపాను.. పశ్చిమ తీరం హై అలర్ట్