ETV Bharat / state

అలా జరిగితే 175స్థానాల్లో గెలుస్తాం.. ఏ ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోనూ: సీఎం జగన్​

author img

By

Published : Apr 3, 2023, 7:58 PM IST

Updated : Apr 4, 2023, 6:15 AM IST

CM JAGAN MEETING WITH PARTY LEADERS
CM JAGAN MEETING WITH PARTY LEADERS

CM JAGAN MEETING WITH PARTY LEADERS : షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి జగన్​ వెల్లడించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీలో జగన్ స్పష్టత ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు ఉండవనీ వారికి చెప్పినట్టు తెలుస్తోంది.

CM JAGAN MEETING WITH PARTY LEADERS : షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని.. ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏరకంగానూ.. రాష్ట్రవ్యాప్త ప్రజాభీష్టానికి గీటురాయికాదన్న సీఎం.. తెలుగుదేశం.. వాపును చూసి బలుపు అనుకుంటోందని.. ఎద్దేవా చేశారు. ఏ ఒక్క MLAనీ తాను వదులుకోవాలనుకోవడం లేదని,. ఇదే సమయంలో 25 మంది పనితీరు మెరుగుపరుచుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి నిర్వహించిన.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో.. వైసీపీ అధినేత జగన్‌ ముందస్తు ఎన్నికల ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికలకు.. ఇంకా ఏడాది ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బటన్‌ నొక్కుతూ... నేరుగా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా డబ్బును లబ్దిదారుల ఖాతాల్లో వేశామని.. వివరించారు. ఈ నాలుగేళ్లలో పేదరికం నిర్వచనం కూడా మార్చామని, రాష్ట్రంలో.. 87 శాతం ఇళ్లకు మంచి జరిగిందని సీఎం చెప్పుకొచ్చారు.

"25 మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని అనుకోను. పనితీరులో వెనకబడిన ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెంచుకోవాలి. ప్రజల్లో మీ గ్రాఫ్‌ సరిగా లేకపోతే పార్టీ, క్యాడర్‌కు నష్టం. ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సగం సచివాలయాల్లో గడప గడపకు కార్యక్రమం పూర్తైంది. మిగతా సగం కార్యక్రమం 5 నెలల్లో పూర్తిచేయాలి. నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి. సెప్టెంబరు నుంచి ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం. ఇతర కార్యక్రమాలకు పార్టీపరంగా కార్యాచరణ. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి 13న జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం. క్యాడర్‌ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి. సోషల్ మీడియాలో ప్రచారం ఉద్ధృతం చేయాలి"-సీఎం జగన్​

ఆ ఫలితాలను రాష్ట్రమంతటికీ ఎలా ఆపాదిస్తాం: MLAలు.. నెలకు 25 రోజులపాటు ప్రజల్లోనే ఉండాలని.. సెప్టెంబర్ నాటికి గడప గడపకు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఈనెల 7 నుంచి "జగనన్నే మన భవిష్యత్తు" కార్యక్రమం చేపట్టాలని సూచించారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఈ నెల 13న.. 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలను.. రాష్ట్రమంతటికీ ఎలా ఆపాదిస్తామని జగన్‌ ప్రశ్నించారు.

నేను ఏ ఒక్కరిని వదులుకోను: మంత్రివర్గంలో మార్పులపై.. పుకార్లు నమ్మొద్దని జగన్ సూచించారు. మున్ముందు ఇలాంటి ప్రచారాలు ఇంకా జరుగుతాయని.. సోషల్ మీడియా ద్వారా వాటిని తిప్పికొట్టాలని.. నిర్దేశించారు. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు సీట్లివ్వనని గత సమీక్షల్లో తెగేసి చెప్పిన సీఎం.. ఇప్పుడు మాత్రం తాను ఏ ఒక్కరినీ వదులుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. నేను చేయాల్సింది.. నేను చేస్తా.. మీరు చేయాల్సింది.. మీరు చేయాలి. ఈ రెండూ సమర్థంగా, సంయుక్తంగా జరిగితేనే 175కి 175 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తాం అని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

ఆ పుకార్లు నమ్మొద్దు: ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం జగన్​ స్పష్టంగా చెప్పారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. 87 శాతం మందికి ప్రభుత్వం నుంచి సహాయం అందిందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. 'గడపగడపకు' కింద నెలలో 25 రోజులు తిరగాలని సీఎం ఆదేశించారని అమర్నాథ్​ తెలిపారు. సీటు ఇవ్వకపోతే ఇతర పదవులతో న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారని అమర్నాథ్‌ తెలిపారు. మంత్రివర్గ విస్తరణ, మార్పులపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని.. అది కేవలం తప్పుడు ప్రచారమే అని గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు.

పార్టీని బలోపేతం చేయాలి: పార్టీని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి అప్పలరాజు తెలిపారు. ఈ నెల 7 నుంచి జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సమగ్రంగా చర్చ జరిగిందని వివరించారు. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 4, 2023, 6:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.