CBN CONSOLES DARAPANENI: రాష్ట్రంలో సీఐడీ విభాగాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేయటంతో పాటు.. సీఐడీ చీఫ్ను మార్చాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల కేసులో అరెస్ట్ అయ్యి.. విడుదలైన తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను గుంటూరులోని ఆయన నివాసంలో చంద్రబాబు పరామర్శించారు. నరేంద్ర ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టారని ఆరా తీశారు. నరేంద్రతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అనంతరం వైకాపా ప్రభుత్వం, సీఐడీ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన అంకబాబుకు బెయిల్ వచ్చిందని.. అయినా మళ్లీ నరేంద్రను అరెస్టు చేసి హింసించటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులను గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. వైకాపా పతనం ప్రారంభమైందని.. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఇప్పటివరకూ చర్యలు లేవని.. కానీ గన్నవరం విమానాశ్రయంలో బంగారం పట్టుబడితే.. ఆ విషయం షేర్ చేసిన వాళ్లపై కేసులేంటని ప్రశ్నించారు. నరేంద్ర అరెస్టు విషయం తెలియగానే ఆయన్ను హింసిస్తారనే ఉద్దేశంతోనే తాను డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపారు. అయినప్పటికీ నరేంద్రను చిత్రహింసలకు గురి చేయటంపై ఆగ్రహం వెలిబుచ్చారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాక్షి సిబ్బందిని ఇలా చేస్తే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. పోలీసులను రక్షణ కల్పించే వ్యవస్థగానే చూశానని.. ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. బరితెగించి వ్యవహరిస్తోన్న ప్రభుత్వాన్ని దింపటానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: