Bills Payment Dispute in Guntur Municipal Corporation: గుంటూరు నగరపాలక సంస్థలో గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు వివాదాస్పదం అవుతున్నాయి. 'అయినోళ్లకు ఆకుల్లో- కానోళ్లకు కంచాల్లో' అన్న రీతిలో బిల్లలు చెల్లింపులు జరుగుతున్నాయి. అధికార పార్టీలో పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. ఇతరులకు పెండింగ్ పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాగైతే, పనులు చేయలేమని కొందరు కాంట్రాక్టర్లు నేరుగా మేయర్ మొహానే చెప్పేసిన ఉదంతాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Monopolists Complained to the Mayor: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం, నిర్వహణ సహా కార్పొరేషన్కు సంబంధించిన ఇతర పనులు చేసేందుకు 70మంది వరకూ గుత్తేదారులున్నారు. వీరిలో కొందరికి అధికార పార్టీ అండదండలున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పనులు చేసే గుత్తేదారులు కొందరున్నారు. అయితే, వైఎస్సార్సీపీ ముఖ్యనేతల అండదండలున్న గుత్తేదారులకే బిల్లులు చెల్లిస్తున్నారని.. కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పనులు పూర్తై రెండేళ్లు దాటినా.. బిల్లులు ఇవ్వడం లేదంటూ ఆక్రోశిస్తున్నారు. బిల్లులు రాని పరిస్థితుల్లో నగరంలో అభివృద్ధి పనులు చేయకూడదని నిర్ణయించిన గుత్తేదారులు.. నేరుగా మేయర్ మనోహర్ నాయుడును కలిసి విషయాన్ని తేల్చిచెప్పారు.
Guntur Municipal Council meeting గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో కొనసాగుతున్న గందరగోళం..
Monopolists Comments: ఈ క్రమంలో మూడు దశాబ్దాలుగా పనులు చేస్తున్నామని.. ముందెన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని.. గోడు వెల్లబోసుకున్నారు. నిధుల కొరత ఉంటే.. కొందరికి వెంటనే బిల్లులు చెల్లించటం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. పలుకుబడి ఉన్నవారికే బిల్లులిస్తే.. చిన్నచిన్న కాంట్రాక్టర్ల గతేంకావాలని మేయర్ వద్ద ఆవేదన వెలిబుచ్చారు. చిన్న చిన్న పనులకు సంబంధించి దాదాపు రూ.20 కోట్ల మేర బిల్లులు బకాయిలు ఉన్నాయన్న కాంట్రాక్టర్లు.. ఏడాది గడువు దాటిన బిల్లుల్ని వెంటనే చెల్లించాలని.. మిగతా వాటి విషయంలో జాప్యం లేకుండా చూడాలని కోరారు. అయితే, ఈ విషయంపై అధికారుల వాదన మరోలా ఉంది.. రొటేషన్ విధానంలో ఒకరి తర్వాత ఒకరికి బిల్లులు చెల్లిస్తున్నట్లు చెప్తున్నారు.
GMC MEETING: గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో మాటల యుద్ధం
Nine and a Half Crore Rupees Checks Come to Light: మరోవైపు ఇటీవల తొమ్మిదిన్నర కోట్ల రూపాయల బిల్లులకు సంబంధించి.. చెక్కులు రాసిన విషయం మేయర్ దృష్టికి వచ్చింది. ఆ మొత్తాన్ని.. ఎవరెవరికి చెల్లించారో వివరాలివ్వాలని ఇంజనీరింగ్ అధికారుల్ని ఆయన కోరారు. అయితే, యంత్రాంగం ఇచ్చేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. దీన్ని బట్టి.. బిల్లుల చెల్లింపులో ఏదో మతలబు జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. మేయర్కు.. ఫిర్యాదు చేసినందుకు అధికారులు తమపై గుర్రుగా ఉన్నారని.. గుత్తేదార్లు అంటున్నారు. బయటకు వచ్చి మాట్లాడితే బిల్లులు ఆపేస్తారనే భయంతో బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.