ETV Bharat / state

Rains: ఎండాకాలంలో వర్షాలు.. రాష్ట్రంలో మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

author img

By

Published : May 2, 2023, 5:16 PM IST

Etv Bharat
Etv Bharat

AP Weather Update: ఏపీలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములతో కూడిన మెరుపులు పడవచ్చునని హెచ్చరించింది. గడిచిన మూడు నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

AP Weather Update: ఈ ఏడాది ఎండాకాలం కాస్త వానాకాలంగా మారింది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో పలు చోట్ల ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకూ కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ విభాగం తెలియజేసింది.

దీనికి అనుబంధంగా కర్ణాటక, తమిళనాడుల నుంచి నైరుతీ బంగాళాఖాతం వరకూ మరో ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ/ దక్షిణ దిశలో గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనికితోడు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదు అవుతాయని స్పష్టం చేసింది. అటు రాయలసీమలోనూ చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.

పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్లు తెలియజేసింది. దీంతో పాటు చాలా చోట్ల 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు గడిచిన మూడు నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజవర్గంలో గడిచిన నాలుగు గంటల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ కుంభవృష్టిలో స్థానికులు రోడ్లపైకి రాలేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరి, మొక్కజొన్న, పసుపు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికే చాలా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా పంట నష్టం మరింత తీవ్రతరం అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.