ETV Bharat / state

Construction of Poor Houses in Amaravati: అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. మిగతావాటి సంగతేంటి జగనన్నా..?

author img

By

Published : Jul 24, 2023, 9:00 AM IST

Updated : Jul 24, 2023, 11:45 AM IST

Construction of Poor Houses in Amaravati: రాజధాని అమరావతిలో R5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణ విషయమై హైకోర్టు ఇంకా తేల్చకపోయినా.. నేడు శంకుప్థాపనకు సీఎం జగన్‌ సిద్ధమైపోయారు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల పేదల ఇంటి నిర్మాణ విషయం మాత్రం పట్టించుకోవడం లేదు. ఆప్షన్‌ 3 కింద నిర్మించే ఇళ్ల విషయంలో జగన్‌ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నారు. రెండేళ్లు అయినా రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం కొలిక్కే రాలేదు.

Construction of Poor Houses in Amaravati
అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన

అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. మిగతావాటి సంగతేంటి జగనన్నా..?

Construction of Poor Houses in Amaravati: రాజధాని అమరాతిలోని R5 జోన్‌లో రాజధానేతరులకు 45 వేల ఇళ్లను ఆప్షన్-3 కింద ప్రభుత్వమే కట్టించి ఇచ్చేలా ఉర్రూతలూగుతున్న సీఎం జగన్.. అదే ఆప్షన్‌ కింద రాష్ట్రంలోని 3.52 లక్షల మంది నిరుపేదలకు తామే ఇళ్లు కట్టిస్తామని.. రెండేళ్ల క్రితం మాట ఇచ్చి గాలికి వదిలేశారు. ఇప్పటివరకు కేవలం 9 వేల 631 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా అమరావతిలో షియర్‌వాల్‌ టెక్నాలజీతో ఆరు నెలల్లో ఇళ్లు కడతామంటున్నారు. అదే విధానాన్ని రాష్ట్రంలో మిగతా పేదలకు ఎందుకు వర్తింపజేయరు..? ఏం వారు పేదల్లా కనిపించట్లేదా..? పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఎప్పటికప్పుడు డబ్బిస్తోంది. గుత్తేదారులను ఎంపిక చేశారు. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఇచ్చేస్తున్నారు. మరి నిర్మాణాల్లో జాప్యమెందుకు అంటే ఎవరూ స్పందించరు. సమస్యలపై ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాటికి పరిష్కారం చూపకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పేర్లను తెర మీదకు తెచ్చి రాజకీయం చేసే ముఖ్యమంత్రి, మంత్రులకు.. ప్రభుత్వమే కట్టిస్తామని మాట ఇచ్చిన 3.52 లక్షల మంది లబ్ధిదారులు నిరుపేదలే అన్న విషయం తెలియదా? అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై అకుంఠిత దీక్ష కనబరుస్తున్న ఆ నేతలకు.. సొంత గూడు లేక అవస్థలు పడుతున్న ఈ పేదలు కనిపించలేదా..?

అమరావతిలో రాజధానేతరుల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ గత నెలలో 50 వేల 793 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో 45 వేల మంది ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆప్షను ఎంచుకున్నారు. 45 వేల ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారుల ఎంపిక కొనసాగుతోంది. ఈ ఇళ్ల నిర్మాణాన్ని 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు షియర్‌ వాల్‌ సాంకేతికతనూ వినియోగించనున్నారు. రాజధానిలో ఇళ్ల నిర్మాణానికి ఆగమేఘాలపై కదులుతున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే ధోరణితో ఎందుకు వ్యవహరించలేదన్నదే ప్రశ్న. నిర్మాణాన్ని ప్రారంభించిన రెండేళ్ల తర్వాత కూడా 2.28 లక్షల ఇళ్లు ఇంకా పునాది, అంతకన్నా తక్కువ స్థాయిలో ఉండటమేమిటన్న ప్రశ్న వినిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 3.52 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం 742 గుత్తేదారు సంస్థలను ఎంపిక చేసింది. అందులో 63 వేల ఇళ్ల నిర్మాణాన్ని వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బంధువు, అనుచరవర్గం డైరెక్టర్లుగా ఉన్న గుత్తేదారు సంస్థ రాక్రీట్ ఇన్‌ఫ్రా సంస్థకు కట్టబెట్టింది. ఈ ఇళ్ల నిర్మాణ విలువ 11 వందల కోట్లు. టెండరు విలువ 100 కోట్లకు మించితే జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదం తర్వాత గుత్తేదారులను ఖరారు చేస్తామని ప్రమాణ స్వీకార సభలో చెప్పిన జగన్.. నాలుక మడతేసి నేరుగా అప్పగించేశారు. ఎక్కడికక్కడ లబ్ధిదారులే గుత్తేదారు సంస్థతో ఒప్పందం చేసుకున్నారంటూ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఆ సంస్థ పూర్తి చేసిన ఇళ్లు వెయ్యి లోపే ఉన్నాయి.

పైగా విజయవాడ గ్రామీణంలోని నున్న, గుంటూరు జిల్లా పేరేచెర్ల లేవుట్లో కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకుండానే చేతులెత్తేశారు. చివరికి ఆ సంస్థకు కేటాయించిన కొన్ని గృహాలను రద్దు చేసి ఇతర సంస్థలకు అప్పగించారు. ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా పులివెందులలోనూ ఏడాదిన్నర క్రితం ఆ సంస్థ ప్రారంభించిన గృహాలకు అతీగతీ లేదు. ఇప్పటికీ ఇక్కడ ఒక్క ఇంటినీ పూర్తి చేయలేదు. ఆప్షన్-3 కింద ప్రభుత్వ చేపడుతున్న గృహాల తీరు చూస్తే కొన్ని జిల్లాల్లో దారుణంగా ఉంది. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల పరిధిలో పూర్తయిన ఇళ్లు 'సున్నా'. కర్నూలు జిల్లాలో అయితే కేవలం ఒక్క ఇల్లే పూర్తైంది.

Last Updated : Jul 24, 2023, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.