ETV Bharat / state

CM Jagan Visits Polavaram Flood Victims: సీఎం జగన్ పోలవరం ముంపు ప్రాంతాల పర్యటన.. గత హామీల మూట ఏమైంది జగనన్నా..?

author img

By

Published : Aug 7, 2023, 10:27 AM IST

Polavaram_Residents
Polavaram_Residents

CM Jagan Visits Polavaram Flood Victims: పోలవరం నిర్వాసితులు ఏటా గోదాట్లో మునుగుతూనే ఉన్నారు. పరిహారం, శాశ్వత పునరావాసంపై జగన్‌ హామీలో పురోగతి లేకపోవడంతో.. వాళ్ల బతుకులు మారడం లేదు. 2022 సెప్టెంబర్‌ నాటికి 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలకు పరిహారం ఇచ్చి ఖాళీ చేయిస్తామన్న సీఎం మాట కూడా గోదాట్లో కలిసిపోవడంతో.. ఇటీవల వరదలకు మళ్లీ రోడ్డున పడ్డారు. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో బాధితులను పరామర్శించడానికి సీఎం సారు తీరిగ్గా వెళ్తున్నారు. మరి ఈసారి బాధితులకు ఏం భరోసా ఇస్తారో..? గత హామీలపై ఏం సమాధానం చెబుతారో చూడాలి మరి.

Polavaram_Residents

CM Jagan Visits Polavaram Flood Victims: సీఎం జగన్‌.. 2022 జులై 27న వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లా వేలేరుపాడు, అల్లూరి జిల్లా చింతూరు వచ్చినపుడు.. ఇచ్చిన హామీలివి. ప్రధాని మోదీతో తనకు రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని.. గతేడాది విశాఖపట్నంలో జరిగిన సభలో జగన్‌ పేర్కొన్నారు. అందుకు నిదర్శనం అన్నట్లుగా ఎప్పుడో 2014-15 నాటి రెవెన్యూ లోటు నిధులు రూ.10 వేల కోట్లకు పైగా సాధించుకున్నారు. రాష్ట్రం అడగాలే కానీ కేంద్రం కాదన్న పరిస్థితులేవీ ఈమధ్య కాలంలో పెద్దగా లేవు. ప్రధాని దగ్గర అంత పలుకుబడి కలిగిన ముఖ్యమంత్రి.. పోలవరం నిర్వాసితుకు కేంద్రం సాయం మంజూరు చేయించుకోవడం పెద్ద పనేమీ కాదు. అయినా.. ఇప్పటికీ నిర్వాసితుల కష్టాలు అలాగే కొనసాగుతున్నాయంటే.. సీఎం చెప్పేవన్నీ వరద ముచ్చట్లేనా అనే అనుమానం తలెత్తుతోంది. పర్యటనలు, పరామర్శలకు వచ్చినప్పుడు ఇచ్చేవి ఉత్తుత్తి హామీలేనా అనే ప్రశ్న కూడా వస్తోంది.

CM Jagan Visit to Flood Affected Areas: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన.. ఆగమేఘాల మీద ఏర్పాట్లు

Polavaram Residents: వరదలొచ్చిన ప్రతిసారీ పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు మునుగుతున్నాయంటే.. అది ప్రభుత్వ వైఫల్యమే. బాధితుల మాటల్లో చెప్పాలంటే సర్కారే ముంచేస్తోంది. ఫలానా తేదీ నాటికి మిమ్మల్ని తరలిస్తామంటూ నీటిపై రాతల్లా హామీలు గుప్పించడం తప్ప.. వారి గోడు పట్టించుకోవడం లేదు. గతేడాది జులైలో వరదలు వచ్చినప్పుడు పరామర్శించి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌.. ఏడాది తర్వాత మళ్లీ అదే ప్రాంతానికి వెళ్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 2022 సెప్టెంబరు నాటికి 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయించి ఉంటే.. వరద నష్టం ఇంతగా ఉండేది కాదు. వారు ఇళ్లు విడిచి కొండలు, గుట్టలపై నివాసం ఉండాల్సిన పరిస్థితులు దాపురించేవి కాదు. పునరావాసం కల్పించిన గ్రామాల్లో స్థిరపడి, ఏదో ఒక పని చేసుకునేవారు. ఆ పరిస్థితి లేకపోవడంతో వారి జీవితాలు ముంపులోనే ఊగిసలాడుతున్నాయి.

floods: గోదావరికి వరద ఉద్ధృతి .. విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు

CM Assurance to Polavaram Residents: గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారీ ముంపు గ్రామాల ప్రజలు పడే అవస్థలు వర్ణనాతీతం. కొన్నిరోజుల పాటు ఇళ్లు విడిచి కొండలు, గుట్టలెక్కి చిమ్మచీకట్లో తల దాచుకోవాల్సి వస్తోంది. ఆ సమయంలో సరైన ఆహారం లేక అల్లాడుతున్నారు. సాయం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అది అరకొరగానే ఉంటోంది. ముంపునకు గురైన ఇళ్ల నుంచి వరదనీరు లాగిన తర్వాత పేరుకుపోయిన బురద తీయించాలి. విద్యుత్తు వైరింగ్‌ మొత్తం మార్చాలి. సామాగ్రి తీసుకుని బయటకు వెళ్లడానికి, వరదలు తగ్గాక తిరిగి తెచ్చుకోవడానికి ఖర్చులూ తప్పవు. అన్నీ కలిపితే ఒక్కో కుటుంబానికి 35 వేల పైనే భారం పడుతోంది. ఏడాదికి మూడుసార్లు ముంపునకు గురైతే లక్ష రూపాయల వరకు ఖర్చవుతోంది. పునరావాసం కల్పిస్తే వెళ్లిపోతామన్న ఉద్దేశంతో ఇళ్లకు కనీసం మరమ్మతులు కూడా చేయించుకోకుండా.. శిథిల గృహాల్లోనే బాధితులు జీవనం సాగిస్తున్నారు.

Polavaram Flood victims: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా టార్పాలిన్లతో కప్పిన పూరిళ్లు కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఎప్పడైనా ఇక్కడి నుంచి వెళ్లక తప్పదని, పునరావాస కాలనీలకు వెళ్లాక అక్కడే సౌకర్యాలు ఏర్పాటు చేసుకుందామని నిర్వాసితులు భావిస్తున్నారు. దానికితోడు గోదావరికి ఏటా వచ్చే వరదలు ఇళ్లను కబళిస్తుంటాయి. ఏటా కట్టుకోవాలంటే పేద, మధ్యతరగతి రైతుల వల్ల అయ్యే పనికాదు. పైగా ప్రభుత్వం కూడా ఈ నెల, వచ్చే నెల అంటూ పునరావాస ప్యాకేజీని ఊరిస్తోంది. వరదలు వచ్చినప్పుడు చేసే పరామర్శలు, ప్రభుత్వం అందించే వంకాయలు, బంగాళదుంపల సాయం తమకొద్దని.. శాశ్వత పునరావాసం చూపించి తమ వ్యథ తీర్చాలని కోరుతున్నారు.

Godavari Floods Effect: గోదావరికి వరద.. పోలవరం ముంపు మండలాల ప్రజలకు బెడద..!

CM Jagan Visits Lanka Villages: పోలవరం కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితుల కళ్లలో ఆనందం చూడాలని.. దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న 6.36 లక్షల వ్యక్తిగత ప్యాకేజీని రూ.10 లక్షలకు పెంచుతానని 2019 మార్చిలో కొయ్యలగూడెం ఎన్నికల సభలో జగన్‌ ప్రకటించారు. సీఎం అయ్యాక 2021 జూన్‌లో జీవో నెంబరు 224 విడుదల చేశారు. ఇది వచ్చి రెండేళ్లు పైగా అయింది. కానీ ఇంతవరకూ ఒక్క నిర్వాసితుడికి కూడా రూ.10 లక్షలు జమ కాలేదు.

CM Jagan to Visit Flood Affected Areas: ఇదేకాదు 2007 నుంచి 2010 మధ్య జరిగిన భూసేకరణలో ఎకరాకు రూ.1.15 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు పరిహారం చెల్లించారన్న జగన్‌.. అది చాలా తక్కువని అన్నారు. అందుకే మానవతా ధృక్పథంతో భూములిచ్చిన రైతులందరికీ ఎకరాకు రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తానని 2019 మార్చిలో కుక్కునూరులో హామీ ఇచ్చారు. జగన్‌ సీఎం పదవి చేపట్టి నాలుగేళ్లు గడిచినా.. ఒక్క రైతుకూ పరిహారం ఇవ్వలేదు. రైతుల ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకాలు అధికారులు సేకరించి 4 నెలలు అవుతున్నా ఫలితం కనిపించలేదు. పరిహారం కోసం రైతులు నిరీక్షిస్తూనే ఉన్నారు.

CM Jagan About Flood Areas Visit: రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి.. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి, ఒక మాట చెప్పి నిలబెట్టుకోని వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదనే పరిస్థితులు రావాలని మన సీఎం సారు పదేపదే చెబుతుంటారు. మరి 2022 సెప్టెంబరు నాటికే 107 గ్రామాల్ని ఖాళీ చేయించి పునరావాస కాలనీలకు తరలిస్తామన్న జగన్‌... ఆ తేదీ దాటి ఏడాది కావొస్తున్నా మాట నిలబెట్టుకోలేదు. 88 గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. మరో 19 గ్రామాల్లోని నిర్వాసితులు ప్రభుత్వం నుంచి ప్యాకేజీ అందకపోయినా.. ముంపు సమస్యలు భరించలేక స్వచ్ఛందంగా తరలివెళ్లారు. దీనికి ఈ పర్యటనలోనైనా సీఎం సమాధానమిస్తారో, లేదో..?

Polavaram Flood Victims ఆ హామీల నీటి మూట ఏమైంది..! సీఎం జగన్​పై అల్లూరి జిల్లా కుయుగూరు పోలవరం ముంపు బాధితుల మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.